ByKranthi
Wed 31st Jan 2024 08:35 PM
ఏపీలో ఎన్నికల టైమ్ దగ్గరపడుతోంది. ఈ టైమ్ని వాడుకోవడానికి అందరూ అన్ని రకాలుగా ప్రయత్నాలు మొదలెట్టారు. ఇక సినిమా వాళ్లు.. ఎన్నికలకు సంబంధించిన సినిమాలను బయటికి తీసి మరి రీ రిలీజ్కు ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో నిర్మాత నట్టి కుమార్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా కెమెరామెన్ గంగతో రాంబాబుని మళ్లీ థియేటర్లలోకి తెచ్చేందుకు సిద్ధమయ్యారు. ఆర్ఆర్ఆర్ చిత్ర నిర్మాత డీవీవీ దానయ్య డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ పెట్టకముందు.. యూనివర్సల్ మీడియా పతాకంపై ఈ సినిమాను నిర్మించారు.
2012లో 1600కి పైగా స్ర్కీన్స్లో విడుదలై సంచలనాన్ని క్రియేట్ చేసిన ఈ సినిమా.. తెలంగాణ మూమెంట్కు బలైంది. దర్శకుడు పూరి జగన్నాధ్ ఇందులో కావాలనే కొన్ని ఒరిజినల్ పాత్రలను వాడేశారనే టాక్, తెలంగాణ రాష్ట్రానికి వ్యతిరేకంగా తీశారనే ఆగ్రహం వెరసీ.. అనేక వివాదాలకు ఈ సినిమా కారణమైంది. అందుకే.. టాక్ బాగున్నప్పటికీ థియేటర్లలో ఎక్కువకాలం ఈ సినిమాని ఉండనీయలేదు. ఇప్పుడీ సినిమాను థియేటర్లలోకి తెస్తే.. సినిమాను విడుదల చేస్తున్న వారికేమోగానీ.. పవన్ కళ్యాణ్కి పొలిటికల్గా మాత్రం ప్లస్ అయ్యే అవకాశం ఉందని అంతా అనుకుంటూ ఉండటం విశేషం.
పవన్ కళ్యాణ్ సరసన మిల్కీ బ్యూటీ తమన్నా జంటగా నటించిన ఈ సినిమాలో రాంబాబుగా పవన్ కళ్యాణ్, గంగ పాత్రలో తమన్నా నటించారు. కథ విషయానికి వస్తే.. మెకానిక్ అయిన రాంబాబు సమాజంలో జరిగే అన్యాయాలకు రియాక్ట్ అవుతుంటాడు. రాంబాబు ధైర్యం గంగకు నచ్చి.. అతడు మెకానిక్గా కంటే జర్నలిస్టుగా బావుంటాడని భావించి.. తను పనిచేస్తున్న టీవీ ఛానల్లో జర్నలిస్టుగా చేర్పిస్తుంది. ఈ నేపథ్యంలో సొసైటీలో జరిగే అరాచకాలను వారు ఎలా ఎదుర్కొన్నారు అన్న కథాంశంతో ఈ చిత్రం రూపొందింది. ఫిబ్రవరి 7న ఈ సినిమాను రీ రిలీజ్ చేసేందుకు నిర్మాత నట్టికుమార్ ప్లాన్ చేస్తున్నారు.
Cameraman Gangatho Rambabu Re Releasing on February:
Producer Nattikumar Plans Pawan Kalyan Film CCR Re Release