Himachal Pradesh Floods Rain Costs Himachal Rs 10,000 Crore, 74 Dead

Himachal Pradesh Floods: 

74 మంది మృతి..
 
హిమాచల్ ప్రదేశ్‌లో కురుస్తున్న వర్షాలకి భారీగా వరదలు ముంచెత్తుతున్నాయి. కొండచరియలు విరిగి పడుతున్న ఘటనలు తరచూ జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ వరదల కారణంగా 74 మంది ప్రాణాలు కోల్పోయారని అధికారికంగా ప్రభుత్వం వెల్లడించింది. షిమ్లా ప్రాంతంపై ఈ వరదల ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. 74 మంది మృతుల్లో 21 మంది షిమ్లాకి చెందిన వాళ్లే. ఇక్కడే కొండ చరియలు విరిగి పడిన ఘటనలు ఎక్కువగా నమోదయ్యాయి. మరో 8 మంది శిథిలాల కింద చిక్కుకున్నట్టు సమాచారం. దాదాపు మూడు రోజులుగా అక్కడ ఎడతెరపి లేకుండా వానలు కురుస్తూనే ఉన్నాయి. రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగుతోంది. సమ్మర్ హిల్ ప్రాంతంలో 14 మృత దేహాలను గుర్తించారు. ఎయిర్‌ఫోర్స్‌తో పాటు ఇండియన్ ఆర్మీ కూడా రంగంలోకి దిగింది. వరద ప్రభావిత ప్రాంతాల నుంది వందలాది మంది పౌరులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. గత మూడు రోజుల్లోనే 2074 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు అధికారులు వెల్లడించారు. ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు ఎప్పటికప్పుడు పరిస్థితులు సమీక్షిస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. భారీ వర్షాలకు రాష్ట్రంలో మౌలిక వసతులు తీవ్రంగా దెబ్బ తిన్నాయన్న ఆయన వీటిని పునరుద్ధరించేందుకు కనీసం ఏడాది సమయం పట్టే అవకాసముందని చెప్పారు. ఇప్పటి వరకూ ఈ వరదల కారణంగా రూ.10 వేల కోట్ల ఆస్తినష్టం వాటిల్లిందని ప్రభుత్వం స్పష్టం చేసింది. 

కోట్ల రూపాయల నష్టం..

గత 55 రోజుల్లో 113 కొండ చరియలు విరిగి పడిన ఘటనలు నమోదయ్యాయి. పబ్లిక్ వర్క్ డిపార్ట్‌మెంట్ (PWD)కి రూ.2,491 కోట్ల నష్టం వాటిల్లింది. ఇక నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI)కి రూ.1000 కోట్ల నష్టం వాటిల్లింది. అటు రైల్వే ట్రాక్‌లు కూడా పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఎక్కడికక్కడ విరిగిపోయాయి. మరి కొద్ది రోజుల పాటు షిమ్లా సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఇప్పటికే IMD హెచ్చరించింది.  

Source link