Purandeswari: విజయవాడలో బీజేపీ పదాధికారుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కమిటీల బలోపేతంపై చర్చించారు. కమిటీల్లో మార్పు చేర్పులు, సంస్థాగత అంశాలపై సమీక్షించారు. ఈ సమావేశం అనంతరం బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి మీడియా సమావేశంలో ప్రసంగించారు. తనపై గురుతర బాధ్యతలు ఉన్నాయన్న పురంధేశ్వరి.. పార్టీని బలోపేతం చేయడం తన ఒక్కరి వల్లే సాధ్యం కాదన్నారు. ప్రతి కార్యకర్త సహకారం అందించినప్పుడే పార్టీ బలోపేతం సాధ్యం అవుతుందన్నారు. క్షేత్ర స్థాయిలో పార్టీని ప్రజలకు చేరువ చేసేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. 2014 తర్వాత పార్టీని బలోపేతం చేసుకునేందుకు ఒంటరిగా వెళ్లాలని చాలా మంది సూచించారన్నారు. పార్టీని బలోపేతం చేసుకునే దిశగా ముందు కసరత్తు చేయాలని అధినాయకత్వం సూచించిందని పురంధేశ్వరి అన్నారు.