Jawahar Navodaya Vidyalaya Admission Notification 2024 Released For Class 6, Check Exam Date Here | JNVS Admissions: నవోదయాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌

జవహర్‌ నవోదయ విద్యాలయాల్లో 2024-25 విద్యాసంవత్సరాకిగాను ఆరోతరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్‌ వెలువడింది. ఈ ఏడాది రెండు విడతల్లో ఎంపిక పరీక్ష నిర్వహించనున్నారు. వచ్చే ఏడాది జనవరి 20న అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు కేంద్ర విద్యాశాఖ ప్రకటించింది. ఇక సమస్యాత్మక ప్రాంతాల్లో ఈ ఏడాది నవంబరు 4న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ పరీక్షలో అర్హత సాధిస్తే చాలు.. ఇంటర్‌ దాకా ఉచితంగా చదువు, వసతి, భోజనం కల్పిస్తారు. బోధన కూడా అత్యున్నత ప్రమాణాల్లో ఉంటుంది. ప్రవేశ పరీక్షకు సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ జూన్ 19న ప్రారంభంకాగా, ఆగస్టు 10 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.  

ఈ జవహర్‌ నవోదయాలు దేశవ్యాప్తంగా 649 ఉన్నాయి. వీటిలో ఏపీలో 15, తెలంగాణలో 9 ఉన్నాయి. వీటన్నింటిలో దాదాపు 48 వేల వరకు సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఒక్కో నవోదయ విద్యాలయంలో గరిష్ఠంగా 80 మంది విద్యార్థులకు ఆరో తరగతిలో ప్రవేశం కల్పిస్తారు. జేఎన్‌వీ ప్రవేశ పరీక్షను హిందీ, ఇంగ్లిష్‌‌తోపాటు ఆయా రాష్ట్రాల ప్రాంతీయ భాషల్లో నిర్వహిస్తారు. ప్రవేశ పరీక్షలో మెరిట్‌ ఆధారంగా విద్యార్థులకు సీట్లు కేటాయిస్తారు.

వివరాలు..

* జవహర్ నవోదయ ప్రవేశ పరీక్ష – 2024

సీట్ల సంఖ్య: దాదాపు 48 వేలు

అర్హతలు..

➥ 2023-2024 విద్యా సంవత్సరంలో అయిదో తరగతి చదువుతున్నవారు జవహర్‌ నవోదయ విద్యాలయ సెలక్షన్‌ టెస్టు (జేఎన్‌వీఎస్‌టీ) రాయడానికి అర్హులు. అభ్యర్థులు ప్రవేశం కోరే జిల్లాలో ప్రస్తుత విద్యా సంవత్సరంలో చదువుతున్నవారై ఉండాలి. విద్యార్థులు ఒకసారి మాత్రమే పరీక్ష రాయడానికి అర్హులు. విద్యార్థులు తప్పనిసరిగా సంబంధిత నవోదయ విద్యాలయం ఉన్న జిల్లాలో నివాసి అయి ఉండాలి.

➥ ప్రవేశాల్లో 75 శాతం సీట్లను గ్రామీణ ప్రాంతంలో చదివిన విద్యార్థులతో భర్తీ చేస్తారు. గ్రామీణ ప్రాంత కోటాలో సీటు ఆశించే విద్యార్థులు 3,4,5 తరగతులను పూర్తిగా గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ స్కూళ్లలో లేదా గుర్తింపు పొందిన ఇతర స్కూళ్లలో చదవి ఉండాలి. మిగిలిన 25 శాతం ఇతర ప్రాంతాలవారికి అవకాశం కల్పిస్తారు. మొత్తం సీట్లలో మూడో వంతు బాలికలకు కేటాయించారు. ఎస్సీలకు 15, ఎస్టీలకు 7.5, ఓబీసీలకు 27 శాతం సీట్లు ఉంటాయి. దివ్యాంగులకు కొన్ని సీట్లు కేటాయిస్తారు.

వయోపరిమితి: విద్యార్థులు 01.05.2012 – 31.07.2014 మధ్య జన్మించి ఉండాలి.,

 ఉచిత విద్య, వసతి..
ఈ పరీక్షలో ఎంపికైనవారికి 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు ఉచితంగా చదువుతోపాటు వసతి, భోజన సౌకర్యాలు ఉంటాయి. ఎనిమిదో తరగతి వరకు మాతృ భాష లేదా ప్రాంతీయ భాషలో విద్య అభ్యసించవచ్చు. 9వ తగరతి నుంచి ఇంగ్లిష్ మీడియం ఉంటుంది. సీబీఎస్‌ఈ సిలబస్‌ బోధిస్తారు. ఇక్కడ రెగ్యులర్‌ చదువతోపాటు నీట్‌, జేఈఈ వంటి జాతీయస్థాయి ప్రవేశ పరీక్షలకు కూడా శిక్షణ ఇస్తున్నారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: ప్రవేశపరీక్ష ఆధారంగా.

పరీక్ష విధానం:

మొత్తం 100 మార్కులకు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మూడు సెక్షన్ల నుంచి 80 ప్రశ్నలు ఉంటాయి. ఆబ్జెక్టివ్‌ విధానంలోనే ప్రశ్నలు అడుగుతారు. తెలుగు, హిందీ, ఇంగ్లిష్‌తో పాటు అన్ని ప్రాంతీయ భాషల్లో పరీక్ష రాయొచ్చు పరీక్ష సమయం 2 గంటలు. నెగిటివ్‌ మార్కులు లేవు.

➥ సెక్షన్‌-1లో మెంటల్‌ ఎబిలిటీ టెస్ట్ (MAT) నుంచి 40 ప్రశ్నలు ఉంటాయి. మొత్తం 50 మార్కులు ఉంటాయి. దీనికి ఒక గంట సమయం కేటాయించారు. ఈ సెక్షన్‌లో మొత్తం 10 విభాగాలుంటాయి. ఒక్కో దాంట్లో నాలుగేసి చొప్పున ప్రశ్నలు అడుగుతారు. 

➥ సెక్షన్‌-2లో అరిథ్‌మెటిక్ నుంచి 20 ప్రశ్నలు అడుగుతారు. 30 నిమిషాల్లో ఈ సెక్షన్ పూర్తిచేయాల్సి ఉంటుంది. 

➥ సెక్షన్‌-3 అనేది లాంగ్వేజ్‌ టెస్ట్‌. ఇందులో 20 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష వ్యవధి 30 నిమిషాలు. లాంగ్వేజ్‌ టెస్టులో పాసేజ్‌ ఇచ్చి, ప్రశ్నలకు సమాధానాలు రాయమంటారు. విద్యార్థులు పాసేజ్‌ అర్థం చేసుకున్నారో లేదో తెలుసుకునేలా ఈ ప్రశ్నలు వస్తాయి. ప్రతి పాసేజ్‌ కింద అయిదేసి ప్రశ్నల చొప్పున నాలుగు పాసేజ్‌లు ఉంటాయి.

ముఖ్యమైన తేదీలు..

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 19.06.2023.

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 10.08.2023

ప్రవేశ పరీక్షతేది: 20.01.2024 (ఏపీ, తెలంగాణ) , 04.11..2023. 

Notification

Online registration

Website

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి.. 

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Source link