Government On 10 Rupees Coins: మన దేశంలో 10 రూపాయలు లేదా 20 రూపాయల నాణేల చెల్లుబాటును త్వరలో నిలిపేస్తారా అనే చర్చ తరచూ ప్రజల మధ్య వినిపిస్తూనే ఉంటుంది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో, భారత ప్రభుత్వం, 10 రూపాయలు & 20 రూపాయల నాణేలు, కరెన్సీ నోట్లకు సంబంధించి కీలకమైన సమాచారాన్ని వెల్లడించింది.
ఆర్థిక మంత్రిత్వ శాఖ ఏం చెప్పింది?
దేశంలో ప్రస్తుతం ఎన్ని రూ.10 నోట్లు, నాణేలు చెలామణిలో ఉన్నాయన్న సమాచారాన్ని లోక్సభ సభ్యుడు అడిగితే, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ దీనికి సమాధానం చెప్పింది. ప్రస్తుతం మన దేశంలో రూ. 10 & రూ. 20 నాణేలు, కరెన్సీ నోట్లు చెలామణిలో ఉన్నాయని, అవన్నీ చెల్లుబాటు అవుతాయని తెలిపింది. 31 డిసెంబర్ 2024 నాటికి, మార్కెట్లో 2,52,886 లక్షల 10 రూపాయల నోట్లు చెలామణిలో ఉన్నాయని, వాటి విలువ రూ. 25289 కోట్లు అని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలియజేసింది. 31 డిసెంబర్ 2024 నాటికి, దేశంలో 79,502 లక్షల 10 రూపాయల నాణేలు మార్కెట్లో ఉన్నాయి, వాటి విలువ రూ. 7950 కోట్లుగా వెల్లడించింది.
20 రూపాయల నోట్ల ముద్రణ ఆగిపోయిందా?
మన దేశంలో కొత్త రూ. 20 నోట్ల ముద్రణపై నిషేధం ఉందా అని అడిగిన ప్రశ్నకు కూడా ఆర్థిక మంత్రిత్వ శాఖ నుంచి జవాబు వచ్చింది. కొత్త రూ. 20 నోట్ల ముద్రణపై ఎలాంటి నిషేధం లేదని, వాటి ముద్రణ కొనసాగుతోందని తెలిపింది. మార్కెట్లో రూ. 10 & రూ. 20 నోట్లు, నాణేలు తక్కువ సంఖ్యలో కనిపించినప్పటికీ, అవి ఇప్పటికీ చెలామణిలో ఉన్నాయని కేంద్ర మంత్రిత్వ శాఖ సమాధానం స్పష్టం చేస్తుంది. నోట్ల ముద్రణ నిలిపివేత, నాణేలు చెల్లుబాటు కావు అంటూ అప్పుడప్పుడు కనిపించే & వినిపించే వార్తలు పూర్తిగా అబద్ధమని, ప్రజలను తప్పుదారి పట్టించేందుకు కావాలని కొందరు వ్యక్తులు అసత్య ప్రచారం చేస్తున్నారని దీనిని బట్టి అర్ధం చేసుకోవచ్చు.
2020లో మొదటిసారిగా 20 రూపాయల నాణేలు
కేంద్ర ప్రభుత్వం 2020లో తొలిసారిగా రూ. 20 నాణేలను జారీ చేసింది. రూ.20 నాణెం 12 భుజాల బహుభుజిగా ఉంటుందని, దానిపై ధాన్యం ఆకారం ఉంటుందని, ఇది వ్యవసాయ రంగ ప్రాముఖ్యతను ప్రతిబింబిస్తుందని ఆ సమయంలో ప్రభుత్వం చెప్పింది. దీనితో పాటు… ఒకటి, రెండు, ఐదు & పది రూపాయల నాణేల కొత్త సిరీస్ కూడా జారీ చేసింది. ఇవి వృత్తాకారంలో ఉంటాయి & వాటి విలువ హిందీ లిపిలో కనిపిస్తుంది.
ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇచ్చిన సమాచారం ప్రకారం, 20 రూపాయల నాణెం బరువు 8.54 గ్రాములు & దాని బయటి వ్యాసం 27 మి.మీ. ఉంటుంది. దానిలో బయటి వృత్తం నికెల్ సిల్వర్తో & మధ్య భాగం నికెల్ ఇత్తడిని కలిపి ఉంటుంది. కొత్త రూ. 20 నాణెం ముందు భాగంలో ‘నాలుగు సింహాల చిహ్నం’ అని చెక్కి ఉంటుంది, దాని కింద ‘సత్యమేవ జయతే’ అని రాసి ఉంటుంది. ఎడమ వైపున ‘భారత్’ అని హిందీలో & కుడి వైపున ‘ఇండియా’ అని ఇంగ్లీషులో రాసి ఉంటాయి.
మరో ఆసక్తికర కథనం: 8వ వేతన సంఘం ప్రయోజనాలు ఏడాది ఆలస్యం, ఎందుకు?
మరిన్ని చూడండి