న్యూఢిల్లీ: దేశంలో మరిన్ని సివిల్ ఏవియేషన్ కాలేజీలు ఏర్పాటు చేయాలన్న రాజ్యసభ ఎంపీ సుధామూర్తి, విజయపురకు విమానాలు ఎప్పుడు వస్తాయని రాజ్యసభలో ప్రశ్నించారు. రాజ్యసభలో సుధామూర్తి మాట్లాడుతూ.. ‘కర్ణాటకలో ఫేమస్ టూరిస్ట్ స్పాట్ విజయపుర. పర్యాటకుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఎయిర్ పోర్ట్ సిద్ధం చేశారు. దీనిపై కర్ణాటక ప్రభుత్వంతో నేను మాట్లాడాను. కేంద్ర ప్రభుత్వం తమకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. ఈ సందర్భంగా ఓ విషయం అడుగుతున్నాను. విజయపురకు విమానాలు ఎప్పుడు ప్రారంభం కానున్నాయి. నేను ఎప్పుడు అడిగినా త్వరలోనే తెలుస్తుందని చెబుతున్నారు. ఈసారి అలా కాదు. కచ్చితంగా దీనిపై మాకు సమాధానం కావాలి.
54 సివిల్ ఏవియేషన్ కాలేజీలు ఉన్నాయి. 140 కోట్ల భారతీయులకు ఇది చాలా తక్కువ అని నా అభిప్రాయం. దేశ వ్యాప్తంగా ఎన్నో ప్రాంతాల్లో సివిల్ ఏవియేషన్ కాలేజీలు, కేంద్రాలు లేవు. దీనిపై కేంద్రం ఫోకస్ చేయాలి. ఇది మా రిక్వెస్ట్’ అని సుధామూర్తి రాజ్యసభలో ప్రశ్న లేవనెత్తారు. సుధామూర్తి అడిగిన ప్రశ్నకు పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించి ఇచ్చిన సమాధానం అందర్నీ ఆకట్టుకుంటోంది.
రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. ఇది తిరుపతికి సంబంధించిన విషయం. అయితే సుధామూర్తిగారు విజయపుర పేరును ఇక్కడ ప్రస్తావించారు. విజయపురకు త్వరలోనే విమానాలు వస్తాయి. ఇదే ఏడాది అది అమలు చేస్తాం. కావాలంటే లిఖిత పూర్వకంగా మీకు సమాధానం ఇస్తాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి దీనిని సాధ్యం చేస్తాం. సివిల్ ఏవియేషన్ కాలేజీలు 54 మాత్రమే ఉన్నాయి. అందులో పైలట్లతో పాటు మెయింటనెన్స్ ఇంజినర్లకు ట్రైనింగ్ ఇస్తారు. మరో 3 కాలేజీకు అప్రూవల్ వచ్చింది. మరో 9 ఏవియేషన్ కాలేజీల కోసం కేంద్రం చర్యలు ప్రారంభించింది. ప్రతి ఏడాది 1500కు పైగా పైలట్లు శిక్షణ తీసుకుంటున్నారు. దేశంలో మరికొన్ని కాలేజీలు అవసరం ఉంది కనుక ఎవరైనా ప్రైవేట్ సంస్థలు ఇందుకోసం ముందుకొస్తే కేంద్రం వారికి సహకారం అందిస్తుంది.
వచ్చే 5 ఏళ్లలో దేశంలో 50 ఎయిర్ పోర్టులు అందుబాటులోకి రానున్నాయి. 10 ఏళ్లలో 100, 20 ఏళ్లలో 200 విమానాశ్రయాలు నిర్మించి విమాన సర్వీసులు అందించాలని కేంద్రం భావిస్తోంది. కానీ విమానాశ్రయాలతో పాటు అక్కడ పార్కింగ్, ఆ స్థాయిలో స్థలం సేకరణ లాంటి చాలా అంశాలు ఆలోచించాలి. మౌలిక సదుపాయాలు కల్పించడానికి మేం సిద్ధంగా ఉన్నాం. అవసరమైతే సుధామూర్తి గారితో ప్రత్యేకంగా సమావేశమై వివరాలు ఇస్తాం. సెషన్స్ లో మరోసారి ఈ విషయం ప్రస్తావన అవసరం లేదని’ రామ్మోహన్ నాయుడు ఎంపీ సుధామూర్తి అడిగిన ప్రశ్నకు ఇచ్చి రిప్లై అందర్నీ ఆకట్టుకుంటోంది.
మరిన్ని చూడండి