Govt Of India Constitutes 8-member Committee To Examine ‘One Nation, One Election’. | Kovind Committee : కోవింద్ కమిటీలో అమిత్ షా, గులాం నబీ ఆజాద్

Kovind Committee :  వన్ నేషన్ వన్ ఎలక్షన్‌పై కేంద్ర ప్రభుత్వం శనివారం కమిటీ ఏర్పాటు చేసింది. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఛైర్మన్‌గా ఈ కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, లోక్‌సభలో విపక్ష నేత అధిర్ రంజన్ చౌదరి, సీనియర్ రాజకీయ వేత్త గులాంనబీ ఆజాద్, ఎన్‌కే సింగ్, సుభాష్, హరీశ్ సాల్వే, సంజయ్ కొఠారిలు సభ్యులుగా వ్యవహరిస్తారు. 

 

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం లోక్‌సభ, శాసనసభల ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలని అనుకుంటోంది. అందులో భాగంగానే  ఈ విధానం ఆచరణ సాధ్యమేనా? దీనిని అమలు చేయడానికి తీసుకోవలసిన చర్యలేమిటి? వంటి అంశాలను అధ్యయనం చేసేందుకు మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నేతృత్వంలో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ దేశంలోని రాజకీయ పార్టీలతోనూ, రాష్ట్రాలతోనూ విస్తృత స్థాయిలో చర్చలు జరుపుతుంది.

లోక్‌సభ ఎన్నికలకు కొన్ని నెలల ముందు, వెనుకగా 13 రాష్ట్రాల శాసన సభల ఎన్నికలు జరగవలసి ఉంటుంది. కేంద్రం తీరుతో ఈ రాష్ట్రాల ఎన్నికలపై ప్రభావం పడుతుంది. ‘ఒక దేశం-ఒకేసారి ఎన్నికలు’ కోసం చట్టాన్ని తీసుకురావాలంటే శాసన పరిశీలన సంఘం ద్వారా సిఫారసులను పొందవలసి ఉంటుంది. అందుకు భిన్నంగా ప్రత్యేకంగా ఓ కమిటీని ఏర్పాటు చేయడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఈ నెల 18 నుంచి 22 వరకు జరిగే పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉందన్న  ప్రచారం జరుగుతోంది.  

లోక్‌సభ ఎన్నికలతో పాటు  ఆంధ్రప్రదేశ్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌, ఒరిస్సా, సిక్కిం శాసన సభల ఎన్నికలు లోక్‌సభ ఎన్నికలతోపాటే జరగవలసి ఉంది. ఛత్తీస్‌గఢ్‌, మధ్య ప్రదేశ్‌, మిజోరాం, తెలంగాణ, రాజస్థాన్‌ శాసన సభల ఎన్నికలు లోక్‌సభ ఎన్నికలు డిసెంబర్ లో జరగాల్సి ఉంది.  మరోవైపు హర్యానా, జార్ఖండ్‌, మహారాష్ట్ర, ఢిల్లీ శాసన సభల ఎన్నికలు లోక్‌సభ ఎన్నికల అనంతరం 5 నుంచి 7 నెలల్లోగా జరగవలసి ఉంది. ఈ రాష్ట్రాలన్నిటితోనూ సంప్రదించి, లోక్‌సభ ఎన్నికలతోపాటు శాసన సభల ఎన్నికల నిర్వహణకు ఒప్పించాలని కేంద్రం భావిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. 

కానీ మిగిలిన 15 రాష్ట్రాల పరిస్థితి వేరుగా కనిపిస్తోంది. వీటిలో కొన్ని రాష్ట్రాల శాసన సభల పదవీ కాలం ఒక ఏడాది నుంచి నాలుగేళ్ల వరకు ఉంది. ఉదాహరణకు, కర్ణాటక, హిమాచల్‌ ప్రదేశ్‌, గుజరాత్‌ రాష్ట్రాలకు ఈ ఏడాదిలోనే ఎన్నికలు జరిగాయి. ఉత్తర ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, అస్సాం రాష్ట్రాల్లో 2022లో ఎన్నికలు జరిగాయి. ఈ 15 రాష్ట్రాల్లో ఒకే పార్టీ ప్రభుత్వాలు లేవు. కొన్నిటిలో బిజెపి, మరికొన్నిటిలో కాంగ్రెస్‌, ఇతర పార్టీలు, కూటములు అధికారంలో ఉన్నాయి. ఈ పార్టీలు ఇప్పటికే వ్యతిరేకిస్తున్నాయి కాబట్టి అధికారాన్ని ముందు గానే వదులుకోవడానికి ఇష్టపడే అవకాశం లేదు. అందుకే పాక్షిక  జమిలీకి ప్రతిపాదిస్తారని అంటున్నారు. 

Source link