<p>మహారాష్ట్రలోని థానే జిల్లాలో 12 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడి చిత్రహింసలు పెట్టి హత్య చేసిన నిందితుడు జైల్లో శిక్ష అనుభవిస్తూ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయాన్ని తలోజి జైలు అధికారులు నిర్ధారించారు. ఆదివారం ఉదయం తెల్లవారుజామను 3.30 గంటల ప్రాంతంలో జైలు గదిలో ఉరేసుకున్నట్లు వెల్లడించారు.</p>
<p>ఓ బ్యాంకులో పనిచేసే విశాల్ గావ్లి తన మూడో భార్య సాక్షి గావ్లితో కలిసి గతేడాది డిసెంబర్ 23న ఓ 12 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేశారు. థానే జిల్లా కల్యాణ్‌లోని చక్కినాకా ప్రాంతంలో ఇంటి బయట ఆడుకుంటున్న బాలికను నిందితుడు విశాల్ భార్య సహాయంతో ఎత్తుకెళ్లాడు. నిర్మాణుష్య ప్రాంతానికి తీసుకెళ్లి బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన నిందితుడు.. ఆమెను చిత్ర హింసలు పెట్టి ఆపై చంపేశాడు.</p>
<p>ఆ తర్వాత భార్యాభర్తలు కలిసి బాలిక మృతదేహాన్ని ఆటో రిక్షాలో కళ్యాణ్-పద్ఘా రోడ్డులోని బాప్‌గావ్‌కు తీసుకెళ్లి అక్కడ పడేశారు. డిసెంబర్ 24న బాలిక మృతదేహాన్ని గుర్తించిన కొందరు పోలీసులకు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తు చేపట్టి, సీసీ కెమెరాలు చెక్ చేసి అనుమానితురాలి సాక్షి గావ్లిని అదే రోజు రాత్రి అరెస్టు చేశారు. పరారీలో విశాల్ గావ్లిని మరుసటి రోజు బుల్ధానా జిల్లాలో అరెస్టు చేశారు.</p>
<p>ఈ కేసు సీరియస్గా తీసుకున్న మహారాష్ట్ర ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారిస్తామని ప్రకటించింది. కేసు విచారణకు ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను నియమించింది. ఈ క్రమంలోనే అతడిపై పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. అయితే తాను ఆటిజంతో బాధపడుతున్నానని సర్టిఫికెట్‌ తోపాటు అతడు మానసిక అనారోగ్య కారణాలు చూపుతూ ఫిబ్రవరిలో బెయిల్ పొందినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదించింది. అతడు వైద్య ధృవీకరణ పత్రాన్ని ఎలా పొందాడో తెలుసుకోవడానికి దర్యాప్తు జరుగుతోందని ఒక పోలీసు అధికారి తెలిపారు.</p>
<p>ఆ తర్వాత నిందితుడిని పోలీసులు మళ్లీ అదుపులోకి తీసుకొని తలోజి జైలుకు తరలించారు. ఈ క్రమంలోనే శిక్ష అనుభవిస్తున్న విశాల్ ఆదివారం తెల్లవారుజామున తన జైలు గదిలో సూసైడ్ చేసుకున్నాడు. అతడి డెడ్బాడీని పోస్టుమార్టం కోసం జేజే ఆసుపత్రికి తరలించినట్లు జైలు అధికారులు తెలిపారు.</p>