RRB ALP 2024 Results: రైల్వేశాఖలో టెక్నీషియన్ గ్రేడ్-I పరీక్ష ఫలితాలను రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (ఆర్ఆర్బీ) మార్చి 12న విడుదల చేసింది. జోన్లవారీగా అధికారిక వెబ్సైట్లో ఫలితాలను అందుబాటులో ఉంచింది. సికింద్రాబాద్ జోన్ పరిధిలో మొత్తం 76 మంది అభ్యర్థులు డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్కు ఎంపికయ్యారు. ఉద్యోగాల భర్తీకి గతేడాది డిసెంబరు 19, 20 తేదీల్లో నిర్వహించిన రాతపరీక్ష(సీబీటీ)లో ప్రతిభ ఆధారంగా ఉద్యోగాలకు ప్రాథమికంగా అభ్యర్థులను రైల్వే బోర్డు ఎంపికచేసింది. డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్కు సంబంధించిన కాల్ లెటర్లను బోర్డు త్వరలోనే విడుదలచేయనుంది. ధ్రువపత్రాల పరిశీలన పూర్తయిన అభ్యర్థులను మెడికల్ పరీక్షల నిమిత్తం రైల్వే ఆసుపత్రులకు పంపుతారు. మెడికల్ పరీక్షల నిమిత్తం ఒక్కో అభ్యర్థి రూ.24 చెల్లించాల్సి ఉంటుంది.
దేశవ్యాప్తంగా ఉన్న 21 రైల్వే రీజియన్ల పరిధిలో గతేడాది మార్చిలో మొత్తం 9,144 టెక్నీషియన్ పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ ఖాళీలకు అదనంగా 5154 పోస్టులను జతచేసింది. దీంతో మొత్తం ఖాళీల సంఖ్య 14,298కి చేరింది. గతంలో కేవలం 18 కేటగిరీల్లో పోస్టులను పేర్కొనగా.. తాజాగా మొత్తం 40 కేటగిరీల నుంచి పోస్టులను అందుబాటులోకి తీసుకొచ్చారు. అదనంగా పెరిగిన పోస్టుల్లో సికింద్రాబాద్ జోన్ పరిధిలో 959 ఖాళీలు చేరాయి. అత్యధికంగా ముంబయి జోన్ పరిధిలో 1883, అత్యల్పంగా సిలిగిరి జోన్లో 91 ఖాళీలు ఉన్నాయి. సీబీటీ-1, సీబీటీ-2, కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. టెక్నీషియన్ గ్రేడ్-I సిగ్నల్ పోస్టులకు రూ.29,200. టెక్నీషియన్ గ్రేడ్-III పోస్టులకు రూ.19,900 జీతం చెల్లిస్తారు.
మరిన్ని చూడండి