Too Drunk To Drive Back Home? Italy To Offer Free Taxi Rides For Party-goers

Free Taxi Rides: ద్యం తాగితే మందు బాబులు ఊరుకుంటారా? బైక్ లేదా కారు బయటకు తీస్తారు. అతి వేగంగా నడుపుతారు. ప్రమాదాలకు కారణమవుతారు. ఈ ప్రమాదాల్లో రోడ్డుపైనే వెళ్లేవారు చనిపోవచ్చు. కొన్ని సార్లు వాహనం నడిపేవారు, అందులో ప్రయాణించేవారు ప్రాణాలు కోల్పోవచ్చు. ఇది చాలా చోట్ల జరిగే విషయమే. అయితే ఇలాంటి సమస్యలకు ఇటలీ ప్రభుత్వం ఓ పరిష్కార మార్గంతో ముందుకు వచ్చింది. నైట్ క్లబ్‌ల వద్ద అతిగా మద్యం సేవించే వారి కోసం ప్రత్యేకంగా ఉచిత టాక్సీ రైడ్లను అందిస్తోంది.

మందు బాబులకు ఇటలీ ప్రభుత్వం సూపర్ పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రజలు మద్యం తాగి వాహనాలు నడపుతుండడంతో ప్రమాదలు జరుగుతున్నాయి. వీటికి చెక్ పెట్టేందుకు పార్టీకి వెళ్లే వారి కోసం ఉచిత టాక్సీ ప్రయాణాన్ని అందిస్తోంది. ఇందులో భాగంగా పైలట్ ప్రాజెక్ట్ కింద సెప్టెంబర్ నెల మధ్య వరకు దేశవ్యాప్తంగా పుగ్లియా, టుస్కానీ, వెనెటో నుంచి ఆరు నైట్‌క్లబ్‌లలో ప్రయోగాత్మకంగా పరిశీలించనున్నారు.  

ఈ పథకం కింద నైట్ క్లబ్బుల వద్ద మద్యం ప్రియులు నిష్క్రమించేటప్పుడు వారికి పరీక్షలు నిర్వహిస్తారు. పరిమితికి మించి అతిగా మద్యం సేవించి ఉంటే వారిని ఇంటికి తీసుకెళ్లడానికి టాక్సీని పిలుస్తారు. ఇటలీ రవాణా మంత్రి, ఉప ప్రధాన మంత్రి, హార్డ్-రైట్ లీగ్ పార్టీ నాయకుడు మాటియో సాల్విని ఈ పథకాన్ని ప్రకటించారు. ఈ మేరకు ఆయన ట్విటర్‌లో పేర్కొంటూ “అతిగా తాగిన వారికి రాత్రి చివరిలో టాక్సీలు ఉచితం” అని రాశారు. 

రహదారులపై జరిగే ప్రమాదాలు తగ్గించడానికి, విషాదాన్ని నివారించే లక్ష్యంతో ఒక ఆచరణాత్మక చొరవ అన్నారు. రోడ్డు ప్రమాదాలను ఆపడానికి జరిమానాలు, చట్టాలు సరిపోవని, ప్రతి ఒక్కరి ప్రాణాన్ని రక్షించేలా ఈ పథకం అమలు చేసేందుకు నిర్ణయించినట్లు చెప్పారు. యూరోపియన్ ట్రాన్స్‌పోర్ట్ సేఫ్టీ కౌన్సిల్ (ETSC) 2020 నివేదిక ప్రకారం ఇటలీలో డ్రంక్ డ్రైవింగ్ తీవ్రమైన సమస్యగా మారింది. ఇతర EU దేశాలతో పోలిస్తే ఇటలీలో డ్రింక్ డ్రైవింగ్ ఆమోదం స్థాయి ఎక్కువగా ఉందని సర్వేలు చూపించాయి. 

వెల్లువెత్తుతున్న ప్రసంశలు
ఒక నైట్‌క్లబ్ వెలుపల, వెనెటో ప్రాంతంలోని జెసోలో పట్టణానికి సమీపంలో ఓ యువకుడు మీడియాతో మాట్లాడుతూ.. డ్రంక్ అండ్ డ్రైవ్ ద్వారా చాలా ప్రమాదాలు జరుగుతున్నాయని, వాటి నివారణకు ఇది మంచి ఆలోచన అన్నారు. ప్రజలు డ్యాన్స్ చేస్తూ బయటకు వెళ్లి తాగుతారని, ప్రయోగం సమస్యను పరిష్కారం చూపిందన్నారు. ఓ నైట్‌క్లబ్ యజమాని శామ్యూల్ బుకియోల్ మాట్లాడుతూ.. పథకం అమలు చేసిన మొదటి రోజు రాత్రి సమయంలో 21 మందిని టాక్సీల ద్వారా తీసుకెళ్లారని అన్నారు. 

ప్రభుత్వం తమ గురించి ఆలోచించినందుకు సంతోషంగా ఉందన్నారు. తరచుగా మద్యం తాగిన వారితో మీడియాకు గొడవ జరుగుతోందని, ఇకపై ఇలాంటి సమస్య ఉండదన్నారు. ప్రజలు సరదాగా గడపడానికి ఇక్కడికి వస్తారని, వారు తమ సమస్యలను కొంచెం మరచిపోవాలని కోరుకుంటారని, అందుకే ఎక్కువగా తాగుతారని చెప్పారు. అలా ఎక్కువగా తాగిన వారిని టాక్సీలు వారిని సురక్షితంగా ఇంటికి  చేర్చడానికి ఉపయోగపడతాయన్నారు.

Source link