Last Updated:
పశ్చిమ బెంగాల్లోని బంకురా జిల్లాకు చెందిన 80 ఏళ్ల అశోక్ పాల్ సేవాభావం దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటుంది. వృద్ధాప్యంలో విశ్రాంతి తీసుకోవాల్సిన వయసులోనూ.. ఆయన గత 66 ఏళ్లుగా తన గ్రామంలోని రోడ్డును శుభ్రం చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.
పశ్చిమ బెంగాల్లోని బంకురా జిల్లాకు చెందిన 80 ఏళ్ల అశోక్ పాల్ సేవాభావం దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటుంది. వృద్ధాప్యంలో విశ్రాంతి తీసుకోవాల్సిన వయసులోనూ.. ఆయన గత 66 ఏళ్లుగా తన గ్రామంలోని రోడ్డును శుభ్రం చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. డబ్బు కోసం కాదు.. పేరు ప్రతిష్ఠల కోసం కాదు.. తన గ్రామం పరిశుభ్రంగా ఉండాలనే ఒక్క సంకల్పంతో ఆయన చేస్తున్న సేవ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
బంకురా జిల్లా బిష్ణుపూర్ నియోజకవర్గంలోని లాయక్బంధ్ గ్రామానికి చెందిన అశోక్ పాల్ ప్రతి రోజు ఉదయం, సాయంత్రం రెండు పూటలా చేతిలో చీపురు.. భుజానికి పసుపు రంగు సంచి వేసుకుని ఇంటి నుంచి బయలుదేరుతారు. గ్రామంలోని సుమారు 2 నుంచి 2.5 కిలోమీటర్ల ప్రధాన రోడ్డును స్వచ్ఛందంగా ఊడుస్తూ ఎక్కడైనా చెత్త కనిపిస్తే వెంటనే ఏరుకుని తన సంచిలో వేసుకుంటారు. ఈ పని ఆయనకు అలవాటు కాదు.. జీవితంలో భాగమైపోయింది.
అశోక్ పాల్ కేవలం 12 ఏళ్ల వయసులోనే ఈ సేవా కార్యక్రమాన్ని ప్రారంభించారు. అప్పట్లో గ్రామంలో మట్టి రోడ్డు ఉండేది. కాలం మారింది.. రోడ్డు కాంక్రీట్ రోడ్డుగా మారింది.. వాహనాల సంఖ్య పెరిగింది.. కానీ అశోక్ పాల్ సేవ మాత్రం మారలేదు. నేటికీ ప్రతి రోజు అదే క్రమశిక్షణతో రోడ్డును శుభ్రం చేస్తున్నారు.
ఈ రోడ్డుపై ప్రతిరోజూ భారీ లారీలు, కార్లు, బైక్లు, వందలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. అయినప్పటికీ రోడ్డుపై ప్లాస్టిక్ కవర్లు, టీ కప్పులు, కాగితాలు, ఇతర చెత్త కనిపించదు. గ్రామానికి వచ్చే ప్రతి ఒక్కరూ రోడ్డు పరిశుభ్రతను చూసి ఆశ్చర్యపోతుంటారు. ఈ మార్పుకు కారణం ఒక్క అశోక్ పాల్ మాత్రమే అని గ్రామస్థులు గర్వంగా చెబుతుంటారు.
అశోక్ పాల్కు ఇంట్లో భార్య జాబా పాల్, ఇద్దరు కుమారులు ఉన్నారు. వయసు పైబడటంతో కుటుంబ సభ్యులు ఎన్నోసార్లు ఈ పని మానేయాలని కోరినా ఆయన మాత్రం అంగీకరించలేదు. ‘రోడ్లు ఊడవడం మానేయమని ఎన్నోసార్లు చెప్పాను. కానీ ఆయన ఎప్పుడూ వినలేదు. దేవుడి దయతో ఇప్పటికీ ఆరోగ్యం బాగానే ఉంది. రోజంతా గ్రామం కోసం కష్టపడుతూనే ఉంటారు’ అని ఆయన భార్య జాబా పాల్ తెలిపారు.
గ్రామస్థుల మాటల్లో.. అశోక్ పాల్ పరిశుభ్రత విషయంలో ఎంతో క్రమశిక్షణ కలిగిన వ్యక్తి. ఎవరైనా రోడ్డుపై చిన్న చెత్త ముక్క వేసినా వెంటనే వారిని ఆపి అలా చేయవద్దని గట్టిగా చెబుతారు. గ్రామం శుభ్రంగా ఉండటం ప్రతి ఒక్కరి బాధ్యత అని అవగాహన కల్పిస్తుంటారు. అందుకే గ్రామ ప్రజలు ఆయనను ఎంతో గౌరవంగా చూస్తారు.
తాను ఎందుకు ఇన్ని సంవత్సరాలుగా ఈ పని చేస్తున్నానని అడిగితే అశోక్ పాల్ సమాధానంగా.. ‘రోడ్డుపై చెత్త కనిపిస్తే నాకు అస్సలు నచ్చదు. ఎవరైనా చెత్త వేస్తే వారిని మందలిస్తాను. నా రోజు మొత్తం ఈ రోడ్డును శుభ్రం చేయడంలోనే గడుస్తుంది. ఒకప్పుడు మనసా ఆలయాన్ని చూసుకునేవాడిని. ఇప్పుడు నాకు వేరే ఉద్యోగం లేదు. ఈ రోడ్డే నా బాధ్యత.. ఇదే నా జీవితం’ అని చెబుతారు.
అశోక్ పాల్ సేవ ఒక వ్యక్తి సంకల్పం ఎంతటి మార్పు తీసుకురాగలదో నిరూపిస్తోంది. ప్రభుత్వాలు, అధికారులు మాత్రమే కాదు.. ప్రతి పౌరుడు తన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలనే బాధ్యత తీసుకుంటే గ్రామాలు, పట్టణాలు మరింత అందంగా మారతాయని ఆయన జీవితం చెబుతోంది. 80 ఏళ్ల వయసులోనూ అలుపెరగని సేవ చేస్తూ గ్రామాన్ని ఆదర్శంగా నిలిపిన అశోక్ పాల్ నిజంగా ప్రతి ఒక్కరికీ స్ఫూర్తి. పరిశుభ్రతను కేవలం ఒక అలవాటుగా కాకుండా జీవిత లక్ష్యంగా మార్చుకున్న ఈయన సేవ సమాజానికి ఆదర్శప్రాయంగా నిలిచిపోతుంది.
బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana
Jul 14, 2026 12:49 PM IST













