కాలంతో పాటు ఆలయ పరిపాలనలోనూ మార్పులు వచ్చాయి. 1843లో తిరుమల ఆలయ నిర్వహణ హథీరాంజీ మఠ మహంతుల ఆధీనంలోకి వెళ్లింది. ఆ తర్వాత 1933లో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఏర్పడటంతో ఆలయ నిర్వహణ కొత్త వ్యవస్థలోకి వచ్చింది. అప్పటి నుంచి బ్రహ్మోత్సవాల నిర్వహణ కూడా మరింత క్రమబద్ధంగా మారింది. నేడు తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంటే కేవలం ఆధ్యాత్మిక కార్యక్రమాలు మాత్రమే కాదు.. లక్షలాది మంది భక్తులు తరలివచ్చే భారీ ఉత్సవం. భక్తుల కోసం వసతి, రవాణా, భద్రత, వైద్యం, అన్నప్రసాదం వంటి అనేక ఏర్పాట్లు టీటీడీ చేస్తోంది. వెయ్యేళ్లకు పైగా చరిత్రను తనలో దాచుకున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. ప్రతి ఏడాది కొత్త భక్తి అనుభూతిని పంచుతూ అదే వైభవంతో కొనసాగుతున్నాయి.













