PM Modi: కాలుష్యం మీది.. నింద మాపై నెడతారా?.. పాశ్చాత్య దేశాల తీరుపై ప్రధాని మోదీ ఫైర్! | | ACTPnews

Narendra Modi


Last Updated:

PM Modi: గతంలో విపరీతంగా కాలుష్యం వెదజల్లి పర్యావరణ విధ్వంసానికి కారణమైన పాశ్చాత్య దేశాలను పక్కనబెట్టి, కార్బన్ ఉద్గారాల నిందను అభివృద్ధి చెందుతున్న దేశాలపై నెట్టే ప్రయత్నాలను ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా తప్పుబట్టారు.

Narendra Modi
Narendra Modi

పర్యావరణ పరిరక్షణలో జీ-20 దేశాల్లోనే భారత్‌ అత్యుత్తమ రికార్డును నమోదు చేస్తోందని ఆయన స్పష్టం చేశారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ (NGT) ఆధ్వర్యంలో ‘ది ఫ్యూచర్ ఆఫ్ ఎన్విరాన్‌మెంట్ అండ్ క్లైమేట్ డైనమిక్స్’ అంశంపై నిర్వహించిన అంతర్జాతీయ సదస్సులో శనివారం ఆయన ప్రసంగించారు. నవంబర్‌లో తుర్కియేలో జరగనున్న అంతర్జాతీయ వాతావరణ సదస్సు (COP31) సన్నాహాల నేపథ్యంలో ప్రధాని చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

భారత్ కంటే 6 రెట్లు ఎక్కువ ఉద్గారాలు

అభివృద్ధి చెందిన దేశాల్లో తలసరి కార్బన్ ఉద్గారాలు భారతదేశం కంటే ఆరు రెట్లు ఎక్కువని ప్రధాని మోదీ ఎత్తిచూపారు. “ఈ వాస్తవాన్ని భారత్ అంతర్జాతీయ వేదికలపై బలంగా వినిపిస్తోంది. ప్రపంచాన్ని కలుపుకుంటూ పర్యావరణ పరిరక్షణలో సరికొత్త ప్రమాణాలను నెలకొల్పుతున్నాం” అని పేర్కొన్నారు. ప్రపంచ సగటుతో పోలిస్తే భారతదేశ తలసరి ఉద్గారాలు సగానికంటే తక్కువగా ఉన్నప్పటికీ, ప్రస్తుత వాతావరణ సవాళ్లకు భారత్ ఆచరణాత్మక పరిష్కారాలను చూపుతోందని అన్నారు.

చారిత్రక వాస్తవాలు వేరు

గత రెండు శతాబ్దాలుగా శిలాజ ఇంధనాలను విపరీతంగా వాడి గ్లోబల్ వార్మింగ్‌కు కారణమైన సంపన్న దేశాలు… ఇప్పుడు కఠిన ఉద్గార తగ్గింపు లక్ష్యాలను భారత్‌పై రుద్దాలని చూస్తుండగా, ప్రధాని వ్యాఖ్యలు దానికి బలమైన సమాధానంగా నిలిచాయి. 1751 నుంచి 2024 వరకు నమోదైన మొత్తం ప్రపంచ కార్బన్ ఉద్గారాల్లో భారత్ వాటా కేవలం 3.5% మాత్రమే.అమెరికా వాటా 23.5%, చైనా 15.4%, రష్యా 6.6%, జర్మనీ 5.1%, బ్రిటన్ వాటా 4.3%గా ఉన్నాయి. ప్రస్తుతం మొత్తం ఉద్గారాల పరంగా భారత్ మూడో స్థానంలో ఉన్నప్పటికీ, తలసరి ఉద్గారాల్లో చాలా వెనుకబడి ఉంది. భారతదేశంలో ఒక వ్యక్తి సగటున ఏడాదికి 2.2 టన్నుల ఉద్గారాలను విడుదల చేస్తుండగా, ఇది ప్రపంచ సగటు (4.7 టన్నులు) కంటే సగానికంటే తక్కువ. అమెరికా (14.2 టన్నులు), రష్యా (14 టన్నులు)లతో పోలిస్తే భారత్‌లో ఉద్గారాలు ఆరు రెట్లు తక్కువగా ఉన్నాయి.

పారిస్ ఒప్పంద లక్ష్యాలను అధిగమించిన ఏకైక దేశం

భారత్ తన బాధ్యతల నుంచి ఎప్పుడూ వెనకడుగు వేయలేదని ప్రధాని స్పష్టం చేశారు. “2015 పారిస్ సదస్సు (COP21)లో నిర్దేశించుకున్న అన్ని లక్ష్యాలను గడువు కంటే ముందే పూర్తి చేసిన ఏకైక జీ20 దేశం భారతదేశమే. ఇదే హిందూస్థాన్ శక్తి. శిలాజ రహిత ఇంధనాలు, సౌర విద్యుత్ సామర్థ్యం, కార్బన్ ఉద్గారాల తగ్గింపు వంటి ప్రతి అంశంలో భారత్ పనితీరుపై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుతున్నాయి” అని ప్రధాని ఉద్ఘాటించారు. 17 దేశాల నుంచి వచ్చిన న్యాయ నిపుణులు, విధాన రూపకర్తలు, శాస్త్రవేత్తలు ఈ గణాంకాలను పరిశీలించాలని ఆయన కోరారు.

నవంబర్‌లో తుర్కియేలోని అంతాల్యాలో జరిగే COP31 సదస్సులో కూడా భారత్ సమానత్వం, కార్యాచరణ అమలు, వెనుకబడిన దేశాల అవసరాలకే ప్రాధాన్యమిస్తూ తన వాదనను గట్టిగా వినిపిస్తుందని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ పేర్కొన్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports