Last Updated:
ఫుడ్ సేఫ్టీ అధికారులకే కళ్లుబైర్లు కమ్మేలా చేసిన రెస్టారెంట్లు ఇవే.. ఈ లిస్టులో మీ ఫేవరెట్ హోటల్ ఉందేమో చూసుకోండి!
సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) ఫుడ్ సేఫ్టీ అధికారులు నగరంలోని పలు ప్రముఖ రెస్టారెంట్లపై ఆకస్మిక దాడులు నిర్వహించారు. జూన్ 18వ తేదీ గురువారం సైబరాబాద్ పరిధిలోని మదీనాగూడ, అంజయ్య నగర్, పీఎన్ఆర్ ఎంపైర్ ప్రాంతాల్లో చేపట్టిన ఈ తనిఖీల్లో విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. కస్టమర్లకు రుచికరమైన భోజనం అందిస్తున్నామని చెప్పుకునే హోటళ్ల వంటగదుల్లో కనీస పరిశుభ్రత లేకపోవడం అధికారులను విస్మయానికి గురిచేసింది. ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్న ఈ మూడు రెస్టారెంట్లలో నిబంధనల ఉల్లంఘనలను తీవ్రంగా పరిగణించిన అధికారులు కఠిన చర్యలకు ఉపక్రమించారు.
సియాసాత్ కథనం ప్రకారం.. మదీనాగూడలోని ప్రసిద్ధ ‘బహార్ కేఫ్’లో వంటగది నిర్వహణను తక్షణమే నిలిపివేయాలని అధికారులు ఆదేశించారు. ఇక్కడ వంటగది పైకప్పు అత్యంత మురికిగా ఉండటంతో పాటు సరైన వెలుతురు లేదు. ఆహార వ్యర్థాలు నిండిన బహిరంగ డ్రైనేజీలు, నీరు నిలిచిపోయిన వాష్ ఏరియా దర్శనమిచ్చాయి. వంట చేసే ప్రదేశానికి సమీపంలోనే సిబ్బంది మరుగుదొడ్డి ఉండటం, దాని తలుపులు తెరిచి ఉంచడం అత్యంత నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. అరిగిపోయిన చాపింగ్ బోర్డులు, ఇనుప కత్తులు వాడుతున్నట్లు గుర్తించారు. ఆహార పదార్థాలపై ఎలాంటి లేబుల్స్ లేకపోవడంతో పాటు సిబ్బంది మెడికల్ ఫిట్నెస్, వాటర్ టెస్టింగ్ రికార్డులు లేకపోవడంతో యాజమాన్యానికి షోకాజ్ నోటీసు జారీ చేశారు.
అంజయ్య నగర్లోని ‘నవాబ్స్ రెస్టారెంట్’లో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. ఫ్రీజర్లలో పాడైపోయిన మాంసం, అన్నం, నూడుల్స్ నిల్వ చేసినట్లు ఫుడ్ ఇన్స్పెక్టర్లు గుర్తించారు. మాంసం కత్తిరించేందుకు ఫుడ్ గ్రేడ్ కాని ఉపరితలాలను వినియోగిస్తున్నారు. వంటగదిలో నీరు నిలిచిపోయి నేలంతా జారుడుగా మారింది. ఫ్రీజర్ల నుంచి తీవ్రమైన దుర్వాసన రావడంతో పాటు అందులో రక్తం గడ్డకట్టి ఉండటం అధికారులను నివ్వెరపరిచింది. ఆహారం వండే వారు మురికి బట్టలు వాడటం, నిల్వ ఉంచే ప్రదేశాల్లో చిన్నపాటి కీటకాలు తిరుగుతుండటంతో యాజమాన్యానికి ఇంప్రూవ్మెంట్ నోటీసు ఇచ్చారు. లోపాలను వెంటనే సరిదిద్దుకోవాలని హెచ్చరించారు.
పీఎన్ఆర్ ఎంపైర్లోని ‘స్పైస్ కిచెన్’లో బొద్దింకల బెడద తీవ్ర స్థాయిలో ఉన్నట్లు తనిఖీల్లో తేలింది. వంటగది, ఫ్రీజర్లతో పాటు వస్తువులు నిల్వ చేసే గదుల్లో ఎటు చూసినా బొద్దింకలు, ధాన్యంలో పురుగులు కనిపించాయి. ఫ్రీజర్లో పాడైపోయిన శాకాహార, మాంసాహార పదార్థాలను కలిపి నిల్వ ఉంచడం ఫుడ్ సేఫ్టీ నిబంధనల ఉల్లంఘనే. అనేక ఆహార పదార్థాలకు కనీసం ర్యాపింగ్ చేయలేదు, వాటిపై తయారీ తేదీలు కూడా లేవు. గిన్నెలు కడిగే ప్రాంతంలో ఫ్లోరింగ్ పూర్తిగా దెబ్బతింది. దీంతో పెస్ట్ కంట్రోల్ చర్యలు చేపట్టి, పారిశుధ్యం మెరుగుపరచాలని స్పష్టం చేస్తూ అధికారుల బృందం ఇంప్రూవ్మెంట్ నోటీసు అందించింది.
ఈ మూడు రెస్టారెంట్లలోనూ స్వచ్ఛమైన తాగునీటిని ధృవీకరించే వాటర్ టెస్టింగ్ రిపోర్టులు, సిబ్బంది ఆరోగ్య పరిస్థితిని తెలిపే మెడికల్ రికార్డులు లేకపోవడం గమనార్హం. ప్రజలు డబ్బులు చెల్లించి అనారోగ్యాన్ని కొనితెచ్చుకునేలా ఈ హోటళ్ల నిర్వాహకులు వ్యవహరిస్తున్న తీరుపై ఫుడ్ సేఫ్టీ అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే కిచెన్లలో పారిశుధ్యం మెరుగుపరుచుకోవాలని, లేనిపక్షంలో లైసెన్సులు రద్దు చేస్తామని కఠినంగా హెచ్చరించారు. ఆహార భద్రతా ప్రమాణాలను పాటించని హోటళ్లపై ముందు ముందు కూడా ఇలాంటి ఆకస్మిక దాడులు కొనసాగుతాయని స్పష్టం చేశారు.
Hyderabad,Telangana













