Last Updated:
టీటీడీ కీలక ప్రకటన: జూలై 14, 17న వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు. ఆణివార ఆస్థానం, కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కారణంగా మార్పులు. భక్తులు గమనించగలరు.
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి దర్శనానికి వెళ్లే భక్తులకు టీటీడీ కీలక ప్రకటన చేసింది. శ్రీవారి ఆలయంలో ప్రతి ఏడాది అత్యంత వైభవంగా నిర్వహించే ఆణివార ఆస్థానం ఈ నెల జూలై 17న జరగనుండగా.. దానికి ముందుగా ఆలయ పవిత్రత, పరిశుభ్రత కోసం నిర్వహించే కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని జూలై 14న శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు. ఈ రెండు విశిష్ట ఆధ్యాత్మిక కార్యక్రమాల నేపథ్యంలో దర్శనాలు, సేవల్లో కొన్ని కీలక మార్పులు చేస్తున్నట్లు టీటీడీ వెల్లడించింది.
ఆలయంలో ఉత్సవాలు ఆగమోక్తంగా, సజావుగా జరిగేలా ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యంలో జూలై 14, 17 తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలను ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే పరిమితం చేస్తున్నట్లు టీటీడీ స్పష్టం చేసింది. దీంతో సాధారణ సిఫార్సుల ఆధారంగా ఇచ్చే ఇతర వీఐపీ బ్రేక్ దర్శనాలను ఆ రెండు రోజులు పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
అంతేకాకుండా జూలై 13, 16 తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలకు సంబంధించిన సిఫార్సు లేఖలను కూడా స్వీకరించబోమని టీటీడీ వెల్లడించింది. ఈ నిర్ణయం వల్ల వీఐపీ దర్శనం కోసం ప్రణాళికలు వేసుకున్న భక్తులు ముందుగానే తమ ప్రయాణాన్ని సవరించుకోవాలని అధికారులు సూచించారు.
ఇదిలా ఉండగా, జూలై 17న ఆణివార ఆస్థానం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నందున కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలను కూడా రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఆలయ కార్యక్రమాలు ఎలాంటి అంతరాయం లేకుండా నిర్వహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
ఈ నేపథ్యంలో తిరుమలకు వచ్చే భక్తులు టీటీడీ ప్రకటించిన మార్పులను తప్పకుండా గమనించి, తమ యాత్రను ముందుగానే ప్రణాళిక చేసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. శ్రీవారి వార్షిక వైభవోత్సవాల్లో అత్యంత విశిష్టమైన ఆణివార ఆస్థానం సందర్భంగా అన్ని ఏర్పాట్లు విస్తృతంగా చేపడుతున్నట్లు టీటీడీ వెల్లడించింది.
Tirupati,Chittoor,Andhra Pradesh













