Last Updated:
Iran War: హార్ముజ్ జలసంధిలో వరుసగా చమురు ట్యాంకర్లపై దాడులు జరగడంతో అమెరికా సోమవారం కీలక నిర్ణయం తీసుకుంది.
గత నెలలో వాషింగ్టన్, టెహ్రాన్ల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం (MOU) ప్రకారం ఇరాన్ చమురు విక్రయించుకోవడానికి ఇటీవల ఇచ్చిన మినహాయింపును (వైవర్) అమెరికా రద్దు చేసింది. గత జూన్ నెలలో ప్రకటించిన ఈ మినహాయింపు ప్రకారం.. ఇరాన్ ఆగస్టు 21 వరకు ముడి చమురు దానికి సంబంధించిన ఉత్పత్తులను ఉత్పత్తి చేయడానికి, విక్రయించడానికి, సరఫరా చేయడానికి మొదట అనుమతి లభించింది. అయితే, వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైన హార్ముజ్ జలసంధి జలమార్గంలో కొన్ని గంటల వ్యవధిలోనే మూడు చమురు ట్యాంకర్లపై దాడులు జరగడంతో అమెరికా ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాయిటర్స్ నివేదిక పేర్కొంది.
ఇరాన్ చర్యలు “చాలా ఆమోదయోగ్యం కానివి” అని మండిపడ్డ ఒక అమెరికా అధికారి, దీనికి తగిన పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. పశ్చిమ ఆసియాలో యుద్ధాన్ని ముగించే లక్ష్యంతో వాషింగ్టన్, టెహ్రాన్ల మధ్య కుదిరిన ఈ సున్నితమైన అవగాహన ఒప్పందం భవిష్యత్తుపై తాజా నిర్ణయం తీవ్ర ఆందోళనలను రేకెత్తిస్తోంది. అయితే, ఈ ఉద్రిక్తతలు చోటుచేసుకున్నప్పటికీ ఇరాన్తో చర్చలు ఇంకా “సద్భావనతో” కొనసాగుతున్నాయని అమెరికా అధికారి తెలిపారు.
హార్ముజ్ జలసంధి పరిసరాల్లో గుర్తుతెలియని క్షిపణులు ద్వారా మూడు చమురు ట్యాంకర్లపై దాడులు జరిగినట్లు నివేదికలు రావడంతో అమెరికా ఈ చర్యకు ఉపక్రమించింది. బ్రిటిష్ నౌకాదళానికి అనుబంధంగా ఉన్న ‘యుకే మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్’ (UKMTO) తెలిపిన వివరాల ప్రకారం.. రాత్రి వేళలో ఒక ట్యాంకర్పై దాడి జరగడంతో అందులో మంటలు చెలరేగాయని, అలాగే మరో నౌకపై డ్రోన్ దాడి జరిగినట్లు పేర్కొంది. ఇక క్రూడ్ ఆయిల్ ధరలు కూడా స్వల్పంగా పెరిగాయి. ఉద్రిక్త పరిస్థితులు తారా స్థాయికి చేరితే క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయి.
దాడికి గురైన నౌకల్లో ఖతార్కు చెందిన ఎల్ఎన్జీ (LNG) ట్యాంకర్ ‘అల్-రెకాయత్’ కూడా ఉంది. ఈ ఘటనను ఖతార్ తీవ్రంగా ఖండించడమే కాకుండా, తమ నిరసనను అధికారికంగా తెలియజేయడానికి ఇరాన్ డిప్యూటీ అంబాసిడర్కు సమన్లు జారీ చేసింది. ఖతార్ నౌకను లక్ష్యంగా చేసుకోవడం సముద్ర భద్రతపై జరిగిన “ఆమోదయోగ్యం కాని దాడి” అని ఖతార్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మాజెద్ అల్ అన్సారీ అన్నారు. ఈ దాడికి, దాని వల్ల జరిగిన నష్టానికి ఇరానే బాధ్యత వహించాలని దోహా స్పష్టం చేసింది.
దాదాపు వారం రోజుల పాటు ప్రశాంతంగా ఉన్న వాతావరణం, ఈ వరుస దాడులతో మళ్లీ వేడెక్కింది. అమెరికాతో తాత్కాలిక కాల్పుల విరమణ తర్వాత ఇరాన్ ఈ కీలక జలమార్గంపై ఆంక్షలను ఎత్తివేసింది. అయితే తాజా దాడులు అంతర్జాతీయ నౌకాయాన స్వేచ్ఛపై మళ్లీ ఆందోళనలను రేకెత్తించాయి. ఈ మూడు నౌకలు ఒమన్ దేశానికి సమీపంలోనే దాడికి గురయ్యాయి. నౌకల ప్రయాణం కోసం ఒమన్ తన తీరప్రాంతాన్ని ఆనుకుని ఒక తాత్కాలిక రవాణా కారిడార్ను ప్రతిపాదించింది. అయితే ఇరాన్ ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తోంది, ఎందుకంటే ఆ ఇరుకైన జలమార్గాన్ని ఉపయోగించే నౌకల నుండి రుసుము (ఛార్జీలు) వసూలు చేయాలని ఇరాన్ భావిస్తోంది.
గల్ఫ్ దేశాల ఇంధన ఎగుమతులకు ప్రధాన మార్గమైన హార్ముజ్ జలసంధి భవిష్యత్తు, గత ఫిబ్రవరి చివరలో ప్రారంభమైన ఈ వివాదానికి శాశ్వత ముగింపు పలికేందుకు టెహ్రాన్ మరియు వాషింగ్టన్ మధ్య జరుగుతున్న చర్చల్లో అత్యంత సంక్లిష్టమైన అంశంగా మారింది.
బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana













