Last Updated:
Trump: పశ్చిమాసియాలోని వ్యూహాత్మక హార్మూజ్ జలసంధి (Strait of Hormuz) గుండా వెళ్లే నౌకలపై 20 శాతం టోల్ రుసుము వసూలు చేస్తామంటూ సంచలన ప్రకటన చేసిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, కేవలం ఒక్క రోజులోనే తన నిర్ణయాన్ని మార్చుకున్నారు.
హార్మూజ్లో ఎలాంటి టోల్ వసూలు చేయడం లేదని స్పష్టం చేస్తూ ఆయన యూటర్న్ తీసుకున్నారు. హార్మూజ్ జలసంధిలో ప్రయాణించే వాణిజ్య నౌకలకు అమెరికా రక్షణ కల్పిస్తుందని, అందుకు బదులుగా ఆ నౌకల్లోని సరకు విలువలో 20% టోల్ వసూలు చేస్తామని ట్రంప్ సోమవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ నిర్ణయం అంతర్జాతీయంగా తీవ్ర చర్చనీయాంశం కావడంతో పశ్చిమాసియా దేశాల నాయకత్వంతో ట్రంప్ అత్యవసర చర్చలు జరిపారు. అనంతరం ఈ రుసుముల విధింపు నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.
టోల్కు బదులుగా పశ్చిమాసియా దేశాలు అమెరికాతో కొత్త వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటాయని, అలాగే అమెరికాలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు అంగీకరించాయని ట్రంప్ మంగళవారం స్పష్టం చేశారు.
మరోవైపు, హార్మూజ్ వివాదం ఇలా ఉంటే, పశ్చిమాసియాలో ఇరు పక్షాల మధ్య దాడులు తీవ్రరూపం దాల్చుతున్నాయి. ఇరాన్ను లక్ష్యంగా చేసుకుని అమెరికా సైన్యం మంగళవారం కూడా భారీ వైమానిక దాడులతో విరుచుకుపడింది. ఇరాన్ తీర రక్షణ వ్యవస్థలతో పాటు, ఆ దేశానికి చెందిన క్షిపణి, డ్రోన్ కేంద్రాలే లక్ష్యంగా ఈ దాడులు జరిగాయి.
అమెరికా దాడులకు ప్రతిచర్యగా ఇరాన్ (టెహ్రాన్) సైతం పశ్చిమాసియాలోని అగ్రరాజ్య మిత్రదేశాలైన బహ్రెయిన్, కువైట్, జోర్డాన్లను లక్ష్యంగా చేసుకుని క్షిపణి దాడులకు తెగబడింది. అయితే, ఇరాన్ వైపు నుండి దూసుకొచ్చిన నాలుగు క్షిపణులను తమ వైమానిక రక్షణ వ్యవస్థల ద్వారా విజయవంతంగా అడ్డుకున్నట్లు జోర్డాన్ సైన్యం ప్రకటించింది. ప్రస్తుత పరిస్థితులు పశ్చిమాసియాలో పూర్తిస్థాయి యుద్ధ ముప్పును తలపిస్తుండటంతో అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేస్తోంది.
అమెరికా లాంటి అగ్ర దేశానికి అధ్యక్షుడగా ఉండటం అంటే మామూలు విషయం కాదు. అలాంటి పదవిలో ఉన్నప్పుడు ఆచితూచి మాట్లాడాల్సి ఉంటుంది. ముఖ్యంగా సునితమైన విషయాలపై.. కానీ, ట్రంప్ అలా కాదు. తన నోటికి ఏది వస్తే అది మాట్లాడతాడు. అమెరికా మాటను ధిక్కరిస్తే యుద్ధం అంటాడు. ఆ వెంటనే అలా ఏం లేదు అంటాడు. తమకు నచ్చని దేశాలతో వ్యాపారం చేసే వారిపై 200 శాతం టారిఫ్స్ అంటాడు. మళ్లీ చేసుకోండి అంటాడు. ముఖ్యంగా రెండోసారి అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత ఏదో ఒక గొడవతో ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తున్నాడు. ప్రస్తుతం ఇరాన్పై దాడి విషయంలో కూడా ట్రంప్ దోరణి అలానే ఉంది. ఇజ్రాయిల్ కోసం ఇరాన్పై మొదట దాడి చేసింది అమెరికా. ఆ దాడి ముందు వరకు కూడా హర్మూజ్లో ప్రశాంతంగా ఉండేది. కానీ, ఇప్పుడు అక్కడ ప్రతిరోజూ విధ్వంసమే.
మొదట ఇరాన్లో నాయకత్వ మార్పు కోసమే యుద్ధం అన్నారు. అక్కడ మహిళలపై ఖమేని ప్రభుత్వం నిరంకుశంగా ఉందంటూ వారికి స్వేచ్ఛను ప్రసాదించడం కోసమే యుద్ధం అంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఆ తర్వాత ఇరాన్ తీవ్రంగా ప్రతిఘటించింది. ముఖ్యంగా హర్మూజ్ను బ్లాక్ చేసింది. ఈ ప్రతిఘటనను ఏ మాత్రం ఊహించని అమెరికా ఇరాన్పై పై చేయి సాధించడానికి దాడులు చేస్తూనే వచ్చింది. నాటో దేశాల నుంచే నిరసనలు రావడం.. క్రూడ్ ధరలు పెరగడంతో ట్రంప్ కాస్త వెనక్కి తగ్గాడు. సీజ్ ఫైర్ అంటూ ముందుకు వచ్చాడు. తర్వాత 60 రోజుల శాంతి ఒప్పందం అన్నారు. అయితే జూలై 7 నుంచి మరోసారి యుద్ధం మొదలు పెట్టాడు. ఇక అదే సమయంలో హర్మూజ్లో ప్రయాణించే ఓడలకు సెక్యూరిటీ కల్పిస్తామని పేర్కొన్నారు. దాని కోసం 20 శాతం టోల్ అన్నారు. దీనిపై తీవ్ర విమర్శలు రాగా.. ఇప్పుడు అదేం లేదు అన్నట్లు మాట మార్చారు. పిచ్చోడి చేతిలో రాయి అనే సామెతకు నిలువెత్తు రూపం ట్రంప్.
బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana














