Last Updated:
Hyderabad: హైదరాబాద్లోని సైదాబాద్లో ‘సక్సెస్ ది స్కూల్’ యాజమాన్యంపై ఎఫ్ఐఆర్ నమోదైంది. రెండో తరగతి చదువుతున్న హిందూ విద్యార్థికి ఇస్లామిక్ మత శ్లోకాలు హోంవర్క్గా ఇచ్చిన ఉదంతంలో పాఠశాల యాజమాన్యంపై సదరు విద్యార్థి పేరెంట్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పాఠశాల కార్యకలాపాలలో భాగంగా ఒక హిందూ మైనర్ విద్యార్థి చేత బలవంతంగా ఖురాన్ ప్రార్థన అయిన ‘సూరా అల్-ఫాతిహా’శ్లోకాలను హోం వర్క్గా ఇచ్చారు. బాధిత విద్యార్థి తల్లి ఇచ్చిన లిఖితపూర్వక ఫిర్యాదు మేరకు సైదాబాద్ పోలీసులు ఈ చర్యలు చేపట్టారు. విద్యార్థి తల్లి తన ఫిర్యాదులో నిందుతులుగా సక్సెస్ ది స్కూల్ యాజమాన్యం, ప్రిన్సిపాల్, సదరు క్లాస్ టీచర్ను పేర్కొంది.
ఈ వివాదం తీవ్రరూపం దాల్చడంతో సదరు మహిళా ఉపాధ్యాయురాలిని ఉద్యోగం నుంచి తొలగిస్తూ యాజమాన్యం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. సైదాబాద్లోని ‘సక్సెస్ ది స్కూల్’ యాజమాన్యం సదరు ఉపాధ్యాయురాలికి గురువారం టెర్మినేషన్ లెటర్ అందజేసింది. “మీ సేవలను తక్షణమే నిలిపివేస్తున్నాం. అంతేకాకుండా, భవిష్యత్తులో మా ‘సక్సెస్ గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్’ పరిధిలోని ఎలాంటి విద్యాసంస్థల్లోనూ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకోవడానికి మీకు శాశ్వతంగా అనర్హత వేస్తున్నాం” అని స్కూల్ ప్రిన్సిపాల్ సంతకంతో కూడిన ఆ ఆర్డర్లో స్పష్టం చేశారు.
స్కూల్ యాజమాన్యం, ఉపాధ్యాయుల ప్రవర్తన కారణంగా తమ చిన్నారి మానసిక వేదనకు గురయ్యాడని, ఇది తమ మత స్వేచ్ఛను హరించడమేనని తల్లి సుప్రియ గౌడ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. పాఠశాలలో ఇలాంటి పద్ధతులను వ్యవస్థీకృతంగా కొనసాగిస్తున్నట్లయితే తక్షణమే విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
తమ అనుమతి లేకుండా హిందూ విద్యార్థులపై ఇటువంటి మతపరమైన ఒత్తిళ్లు తీసుకువస్తున్న ప్రిన్సిపాల్, యాజమాన్యం, క్లాస్ టీచర్పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. అలాగే ఫిర్యాదు చేసినందుకు గానూ భవిష్యత్తులో స్కూల్ యాజమాన్యం నుండి తమ బాబుకి ఎలాంటి వేధింపులు లేదా బెదిరింపులు ఎదురుకాకుండా రక్షణ కల్పించాలని పోలీసులను ఆశ్రయించారు.
శ్రీమతి సుప్రియ గౌడ్ స్వయంగా పోలీస్ స్టేషన్కు వచ్చి గురువారం మధ్యాహ్నం 2:30 గంటలకు ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు. కేసు నమోదు చేసిన వెంటనే దర్యాప్తు అధికారి సంఘటనా స్థలమైన సైదాబాద్లోని సక్సెస్ స్కూల్ను సందర్శించి ప్రాథమిక ఆధారాలను సేకరించారు. ఈ సున్నితమైన అంశంపై పోలీసులు పూర్తి స్థాయి దర్యాప్తు జరుపుతున్నారు.
Hyderabad,Telangana
Jul 17, 2026 11:52 AM IST














