Last Updated:
Ukraine War: దాడి జరిగిన సమయంలో నౌకలో మొత్తం 17 మంది సిబ్బంది ఉన్నారు. వీరిలో 5 గురు భారతీయులు కాగా, మిగతా వారు సిరియాకు చెందిన వారని ‘ఉక్రెయిన్ నావికాదళం’ తమ అధికారిక ప్రకటనలో తెలిపింది.
ఉక్రెయిన్లోని ఒడెస్సా పోర్టు నుంచి జులై 19 (ఆదివారం) సాయంత్రం ధాన్యం లోడుతో బయలుదేరిన వాణిజ్య నౌకపై ఘోరమైన క్షిపణి దాడి జరిగింది. రాయిటర్స్ రిపోర్టు ప్రకారం, గినియా-బిస్సావు (Guinea-Bissau) దేశపు జెండాతో ప్రయాణిస్తున్న ‘ఎంవీ గోల్డెన్ లియో’ అనే కార్గో నౌకపై రష్యా దళాలు మూడు ‘Kh-59/Kh-69’ క్రూయిజ్ క్షిపణులతో దాడికి పాల్పడ్డాయి. దాడి జరిగిన సమయంలో నౌకలో మొత్తం 17 మంది సిబ్బంది ఉన్నారు. వీరిలో 5 గురు భారతీయులు కాగా, మిగతా వారు సిరియాకు చెందిన వారని ‘ఉక్రెయిన్ నావికాదళం’ తమ అధికారిక ప్రకటనలో తెలిపింది.
క్షిపణులు ఢీకొట్టడంతో నౌకలో భారీ అగ్నిప్రమాదం జరిగిందనీ, సహాయక చర్యల కోసం రెస్క్యూ టీమ్లు వెంటనే రంగంలోకి దిగాయని ఈనాడు రిపోర్ట్ చేసింది. ఈ భీకర దాడి కారణంగా నలుగురు భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోగా, మరొక భారతీయ పౌరుడు తీవ్ర గాయాల పాలయ్యాడు. ఏమాత్రం సైనిక ముప్పు లేని, సాధారణ ధాన్యం తీసుకెళ్తున్న పౌర నౌకపై జరిగిన ఈ దాడిని ఉగ్రవాద చర్యగా చెబుతూ.. ‘ఉక్రెయిన్ అధికారులు’ తీవ్రంగా ఖండించారు. ఈ దుర్ఘటనలో మొత్తం 8 మంది సిబ్బందిని రక్షించి ఒడెస్సాలోని ఆసుపత్రికి తరలించారు. ఈ నౌక ముంబైకి చెందిన ఓషన్ గ్రేస్ షిప్పింగ్ లిమిటెడ్ అధ్వర్యంలో నడుస్తోంది.
భారత పౌరుల మృతిపై భారత ‘విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ’ (MEA) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఎంవీ గోల్డెన్ లియో నౌకపై జరిగిన దాడిలో నలుగురు భారతీయులు ప్రాణాలు కోల్పోయారనీ, మరొక భారతీయ పౌరుడు ఆసుపత్రిలో విషమ స్థితిలో చికిత్స పొందుతున్నారని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. మరణించిన భారతీయుల కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం ప్రగాఢ సానుభూతిని తెలిపింది, అలాగే గాయపడిన వ్యక్తి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది.
అమాయకులైన పౌర సిబ్బందితో వెళ్తున్న వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడాన్ని భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించిందని విదేశాంగ శాఖ తెలిపింది. వాణిజ్య నౌకల స్వేచ్ఛాయుత రాకపోకలకూ, గ్లోబల్ షిప్పింగ్కూ ఆటంకం కలిగించడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదనీ,.. ఇలాంటి దాడులను వెంటనే నివారించాలని కేంద్రం కోరింది.
ఉక్రెయిన్లోని భారత రాయబార కార్యాలయం (Indian Mission in Ukraine) అక్కడి స్థానిక అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోందని విదేశాంగ శాఖ తెలిపింది. బాధిత కుటుంబాలకు అవసరమైన అన్ని విధాలా సహాయ సహకారాలు అందించడానికి, అలాగే మృతదేహాలను త్వరగా స్వదేశానికి రప్పించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు కేంద్రం వివరించింది. నల్ల సముద్రం (Black Sea) గుండా ధాన్యం రవాణా చేసే పౌర నౌకలపై జరుగుతున్న ఈ దాడులు ప్రపంచ దేశాల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఈ దాడి చేసింది రష్యా కావడం.. రష్యా మనకు మిత్ర దేశం కావడంతో.. ఈ ఘటనను భారత్.. దౌత్యపరంగా, జాగ్రత్తగా డీల్ చేస్తోందని సమాచారం. ఏది ఏమైనా.. ఉక్రెయిన్తో వార్ని ముగించాల్సిన రష్యా.. ఆ పని చెయ్యకుండా.. ఇలా సామాన్య నావికుల ప్రాణాలు తీస్తుండటం విచారకరం. దీనిపై భారత్ బలంగా స్పందించాని నెటిజన్లు కోరుతున్నారు.
బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana














