Last Updated:
హైదరాబాద్ భక్తుడు మహేష్ అలిపిరి చెక్పాయింట్లో మరిచిపోయిన 100 గ్రాముల బంగారు ఆభరణాల బ్యాగును టీటీడీ సిబ్బంది తిరిగి అప్పగించారు.
తిరుమలకు కాలినడకన వచ్చే భక్తుల భద్రత విషయంలో టీటీడీ విజిలెన్స్, సెక్యూరిటీ సిబ్బంది ఎంత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారో మరోసారి రుజువైంది. అలిపిరి చెక్పాయింట్లో జరిగిన ఓ ఘటన టీటీడీ సిబ్బంది నిజాయితీ, బాధ్యతాయుత సేవాభావాన్ని మరోసారి వెలుగులోకి తీసుకొచ్చింది. హైదరాబాద్కు చెందిన ఓ భక్తుడు తన వద్ద ఉన్న విలువైన బంగారు ఆభరణాలతో కూడిన బ్యాగును అనుకోకుండా అక్కడే మరిచిపోయినా, టీటీడీ సిబ్బంది అప్రమత్తతతో అది క్షేమంగా తిరిగి ఆయన చేతికి చేరింది.
హైదరాబాద్కు చెందిన శ్రీ మహేష్ తిరుమలకు కాలినడకన బయలుదేరే క్రమంలో అలిపిరి చెక్పాయింట్ వద్ద భద్రతా తనిఖీలకు హాజరయ్యారు. ఆ తొందరలో తన బ్యాగును అక్కడే వదిలి ముందుకు వెళ్లిపోయారు. విధుల్లో ఉన్న టీటీడీ విజిలెన్స్, సెక్యూరిటీ సిబ్బంది కొద్దిసేపటికే యజమాని లేని బ్యాగును గమనించి వెంటనే తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అనుమానాస్పద వస్తువులేమైనా ఉన్నాయేమోనని నిబంధనల ప్రకారం పరిశీలించగా, అందులో సుమారు 100 గ్రాముల బంగారు ఆభరణాలు ఉన్నట్లు గుర్తించారు.
విలువైన బంగారం ఉండటంతో ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా టీటీడీ అధికారులు ఆ బ్యాగును అత్యంత భద్రంగా సంరక్షించారు. అనంతరం అసలు యజమానిని గుర్తించేందుకు వెంటనే అలిపిరి చెక్పాయింట్లోని సీసీటీవీ దృశ్యాలను పరిశీలించారు. వీడియో ఫుటేజ్ ఆధారంగా ఆ బ్యాగు హైదరాబాద్కు చెందిన శ్రీ మహేష్దేనని గుర్తించి వెంటనే ఆయనను సంప్రదించారు.
అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. అప్పటివరకు తాను బ్యాగును అక్కడే మరిచిపోయిన విషయాన్ని కూడా శ్రీ మహేష్ గుర్తించలేదు. టీటీడీ నుంచి ఫోన్ రావడంతోనే బ్యాగు కనిపించడం లేదని ఆయనకు తెలిసింది. వెంటనే టీటీడీ కార్యాలయానికి చేరుకున్న ఆయనను అధికారులు పూర్తి వివరాలు, గుర్తింపు ఆధారాలు ధృవీకరించిన అనంతరం బ్యాగుతో పాటు అందులో ఉన్న సుమారు 100 గ్రాముల బంగారు ఆభరణాలను యథాతథంగా ఆయనకు అప్పగించారు.
పోయిందనుకున్న విలువైన బంగారం ఏమాత్రం నష్టం లేకుండా తిరిగి లభించడంతో శ్రీ మహేష్ ఆనందం వ్యక్తం చేశారు. టీటీడీ విజిలెన్స్, సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తత, నిజాయితీ వల్లే తన విలువైన ఆభరణాలు సురక్షితంగా తిరిగి అందాయని పేర్కొన్నారు. తమ ఆస్తిని అత్యంత బాధ్యతతో కాపాడి అందించిన టీటీడీ యాజమాన్యానికి, విధుల్లో ఉన్న సిబ్బందికి ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
భక్తుల భద్రతతో పాటు వారి విలువైన ఆస్తుల పరిరక్షణలోనూ టీటీడీ సిబ్బంది ఎంత నిబద్ధతతో పనిచేస్తున్నారో ఈ ఘటన మరోసారి చాటి చెప్పింది. భక్తుల విశ్వాసాన్ని నిలబెడుతూ, సేవనే ధ్యేయంగా విధులు నిర్వర్తిస్తున్న టీటీడీ విజిలెన్స్, సెక్యూరిటీ సిబ్బంది నిజాయితీకి ఈ సంఘటన మరో గొప్ప నిదర్శనంగా నిలిచింది.
Tirupati,Chittoor,Andhra Pradesh
Jul 21, 2026 10:53 PM IST














