Last Updated:
బెంగళూరులో జరిగిన న్యూస్18 రైజింగ్ భారత్ సమ్మిట్–సౌత్ ఎడిషన్లో తమిళనాడు ఆరోగ్య మంత్రి డా. కేజీ అరుణ్రాజ్ నీట్కు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని మరోసారి స్పష్టం చేశారు.
News18 Rising Bharat Summit: జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష NEET)కు వ్యతిరేకంగా తమిళనాడు ప్రభుత్వం మరోసారి తన స్పష్టమైన వైఖరిని వెల్లడించింది. ఆరోగ్యం, వైద్య విద్యకు సంబంధించిన విధానాలు కేంద్రం ఆధ్వర్యంలో కాకుండా రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ఉండాలని తమిళనాడు ఆరోగ్య, వైద్య విద్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డా. కేజీ అరుణ్రాజ్ పేర్కొన్నారు. బెంగళూరులో శుక్రవారం నిర్వహించిన న్యూస్18 రైజింగ్ భారత్ సమ్మిట్ – సౌత్ ఎడిషన్లో పాల్గొన్న ఆయన, వైద్య ప్రవేశాల్లో రాష్ట్రాలకు పూర్తి అధికారం ఇవ్వాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు.
భారత్ వంటి విస్తారమైన సమాఖ్య వ్యవస్థ కలిగిన దేశంలో లక్షలాది మంది విద్యార్థుల కోసం ఒకే జాతీయ ప్రవేశ పరీక్ష నిర్వహించడం ఆచరణాత్మకంగా క్లిష్టమని మంత్రి అభిప్రాయపడ్డారు. ఎన్నికలకు ముందే తమ పార్టీ ఆరోగ్య, వైద్య విద్య రాష్ట్రాల పరిధిలో ఉండాలనే స్థిరమైన విధానాన్ని అవలంబించిందని గుర్తుచేశారు. దేశవ్యాప్తంగా ఒకే పరీక్ష నిర్వహించడంపై కేంద్రం ఎందుకు పట్టుదలగా వ్యవహరిస్తోందని ఆయన ప్రశ్నించారు.
ఇటీవలి కాలంలో నీట్ పరీక్ష నిర్వహణలో అక్రమాలు జరిగినట్లు వచ్చిన ఆరోపణలు దేశవ్యాప్తంగా తీవ్ర రాజకీయ చర్చకు దారితీశాయి. ఈ నేపథ్యంలో పరీక్ష నిర్వహణలో పారదర్శకత, బాధ్యత పెంచాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. అదే సమయంలో తమిళనాడుతో పాటు పలు రాష్ట్రాలు నీట్ పరీక్షను పూర్తిగా రద్దు చేయాలని మళ్లీ కేంద్రాన్ని కోరుతున్నాయి.
వైద్య కళాశాలల్లో ప్రవేశాల నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వాలే తీసుకోవాలని తమిళనాడు చాలా కాలంగా వాదిస్తోంది. రాష్ట్ర విద్యా విధానాలు, స్థానిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని అడ్మిషన్ ప్రక్రియ ఉండాలని ప్రభుత్వం భావిస్తోంది. డా. అరుణ్రాజ్ తాజా వ్యాఖ్యలు కూడా ఇదే వైఖరిని మరోసారి స్పష్టం చేశాయి.
మంత్రి చేసిన వ్యాఖ్యలు ఇటీవల తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ వ్యక్తం చేసిన అభిప్రాయాలకు కూడా అనుగుణంగా ఉన్నాయి. జూలై 22న నీట్లో జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అవకతవకలపై కాంగ్రెస్ చేపట్టిన నిరసనలకు విజయ్ మద్దతు ప్రకటించారు. ఢిల్లీలో నిరసనల సందర్భంగా ప్రతిపక్ష నాయకులను అదుపులోకి తీసుకోవడాన్ని కూడా ఆయన విమర్శించారు.
అదేవిధంగా, నీట్ పరీక్షను పూర్తిగా రద్దు చేయాలనే తమ పార్టీ డిమాండ్ను విజయ్ మరోసారి పునరుద్ఘాటించారు. విద్యను ప్రస్తుతం ఉన్న కాంకరెంట్ లిస్ట్ నుంచి స్టేట్ లిస్ట్లోకి మార్చడమే నీట్ వంటి పరీక్షలను శాశ్వతంగా రద్దు చేసే మార్గమని ఆయన అభిప్రాయపడ్డారు. అంతవరకు తాత్కాలిక చర్యగా సాధారణ విద్య, వైద్య విద్యపై రాష్ట్రాలకు పూర్తి అధికారాలు కల్పించేలా ‘స్పెషల్ కాంకరెంట్ లిస్ట్’ ఏర్పాటు చేయాలని కూడా ప్రతిపాదించారు.
మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షుడు ఎం.కే. స్టాలిన్ కూడా నీట్ రద్దు కోసం ఎన్నోసార్లు కేంద్రాన్ని కోరారు. తమిళనాడులో నీట్ వ్యతిరేక ఉద్యమం ప్రధాన రాజకీయ అంశంగా మారిన నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలు ఈ డిమాండ్ను కొనసాగిస్తున్నాయి.
ఇదిలా ఉండగా, బెంగళూరులో జరుగుతున్న న్యూస్18 రైజింగ్ భారత్ సమ్మిట్ – సౌత్ ఎడిషన్ ప్రాంతీయ సదస్సుల శ్రేణిలో తొలి కార్యక్రమంగా నిర్వహిస్తున్నారు. “Engineering Growth: Policy. Participation. Progress.” అనే థీమ్తో జరుగుతున్న ఈ సదస్సులో పాలన, ఆర్థికాభివృద్ధి, ప్రజా విధానాలు, పరిశ్రమల అభివృద్ధి వంటి అంశాలపై చర్చలు సాగుతున్నాయి. దక్షిణ భారత రాష్ట్రాల విధాన నిర్ణేతలు, మంత్రులు, పరిశ్రమల ప్రతినిధులు, నిపుణులు ఒకే వేదికపై సమావేశమై అభివృద్ధి దిశగా ఆలోచనలు పంచుకుంటున్నారు.
బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana














