Last Updated:
రాజ్యసభలో ‘రాష్ట్ర గౌరవ అవమాన నివారణ (సవరణ) బిల్లు–2026’కు ఆమోదం లభించింది. ఈ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత వందేమాతరం గానం సమయంలో ఉద్దేశపూర్వకంగా అంతరాయం కల్పించడం లేదా అవమానించడం శిక్షార్హమైన నేరంగా పరిగణించబడుతుంది. అలాంటి చర్యలకు మూడేళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంటుంది.
Vande Mataram Bill: పార్లమెంట్లో రాజకీయంగా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ రాజ్యసభ కీలక నిర్ణయం తీసుకుంది. ‘రాష్ట్ర గౌరవ అవమాన నివారణ (సవరణ) బిల్లు–2026’ కు ఎగువ సభ మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపింది. ఈ సవరణ చట్టం అమల్లోకి వస్తే, జాతీయ గీతం ‘వందే మాతరం’ ఆలాపనను ఉద్దేశపూర్వకంగా అడ్డుకోవడం, అంతరాయం కల్పించడం లేదా ఏ రూపంలోనైనా అవమానించడం శిక్షార్హమైన నేరంగా పరిగణించబడుతుంది. అలాంటి చర్యలకు గరిష్ఠంగా మూడేళ్ల జైలు శిక్ష, జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంటుంది.
బిల్లుపై స్వల్పకాలిక చర్చ అనంతరం రాజ్యసభ దీనికి ఆమోదం తెలిపింది. అయితే బిల్లు ఆమోదం పొందే సమయంలో కాంగ్రెస్తో పాటు ఇతర ప్రతిపక్ష సభ్యులు సభలో లేరు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సభకు హాజరుకాకపోవడం సహా పలు అంశాలపై నిరసన వ్యక్తం చేస్తూ ప్రతిపక్షాలు వాకౌట్ చేశాయి. దీంతో వారి గైర్హాజరీలోనే మూజువాణి ఓటుతో బిల్లు ఆమోదం పొందింది.
బిల్లుపై జరిగిన చర్చకు సమాధానంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ మాట్లాడుతూ, దేశ ప్రజల భావోద్వేగాలను దృష్టిలో ఉంచుకుని ఈ సవరణ బిల్లును తీసుకొచ్చామని తెలిపారు. భారత స్వాతంత్ర్య సమరంలో ‘వందే మాతరం’ దేశభక్తికి ప్రతీకగా నిలిచిందని, స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో ఇది కోట్లాది భారతీయులను ఉత్తేజపరిచిన నినాదమని ఆయన పేర్కొన్నారు.
అలాగే స్వాతంత్ర్యం తర్వాత రాజకీయ కారణాల వల్ల ‘వందే మాతరం’కు దక్కాల్సిన గౌరవం పూర్తిస్థాయిలో లభించలేదని ఆయన ఆరోపించారు. ఈ కారణంగానే ప్రభుత్వ కార్యక్రమాల్లో పూర్తి గీతం కాకుండా కేవలం తొలి రెండు చరణాలనే అధికారికంగా పాడే సంప్రదాయం కొనసాగిందని చెప్పారు. స్వాతంత్ర్యం వచ్చిన తొలి రోజే అప్పటి తొలి హోంమంత్రి సర్దార్ వల్లభభాయ్ పటేల్ ఆదేశాల మేరకు ప్రముఖ గాయకుడు పండిట్ ఓంకార్ నాథ్ ఠాకూర్ ఆకాశవాణి ద్వారా పూర్తి ‘వందే మాతరం’ ఆలపించారని నిత్యానంద్ రాయ్ గుర్తు చేశారు.
ఈ బిల్లు ద్వారా 1971లో అమల్లోకి వచ్చిన ‘రాష్ట్ర గౌరవ అవమాన నివారణ చట్టం’ లో కీలక సవరణలు ప్రతిపాదించారు. జాతీయ గీతం ‘జనగణమన’కు ఉన్న చట్టపరమైన రక్షణ తరహాలోనే ‘వందే మాతరం’ ఆలాపనను ఉద్దేశపూర్వకంగా అడ్డుకోవడం, దానిని అవమానించడం లేదా గానం జరుగుతున్న సభలో అంతరాయం కల్పించడం కూడా శిక్షార్హమైన నేరంగా గుర్తించేలా చట్టంలో మార్పులు తీసుకువచ్చారు.
బిల్లులో పేర్కొన్న చారిత్రక అంశాల ప్రకారం, 1950 జనవరి 24న రాజ్యాంగ సభలో అప్పటి సభాధ్యక్షుడు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ‘వందే మాతరం’కు జాతీయ గీతం ‘జనగణమన’తో సమాన గౌరవం, సమాన హోదా కల్పించబడుతుందని ప్రకటించారు. అయినప్పటికీ, ఇప్పటి వరకు ‘వందే మాతరం’ను అవమానించే చర్యలను నిరోధించే ప్రత్యేక చట్టపరమైన నిబంధన లేదని బిల్లులో స్పష్టం చేశారు.
ఈ సవరణ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత ‘వందే మాతరం’ గానం సమయంలో ఉద్దేశపూర్వకంగా అంతరాయం కల్పించడం, గీతాన్ని అవమానించడం లేదా గానం జరుగుతున్న సభను భంగం కలిగించడం వంటి చర్యలకు మూడేళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంటుంది. ఈ బిల్లు ద్వారా జాతీయ గీతానికి చట్టపరమైన రక్షణను మరింత బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana














