ఈ పథకం కింద గర్భధారణ రెండో లేదా మూడో త్రైమాసికంలో, అంటే నాలుగో నెల నుంచి తొమ్మిదో నెల వరకు ఉన్న గర్భిణులందరూ అర్హులు. ఆదాయ పరిమితి లేదు. పేద, ధనిక అనే తేడా లేకుండా ప్రతి గర్భిణీ ఈ సేవలను పొందవచ్చు. బీపీఎల్ కార్డు లేదా ఇతర ప్రత్యేక రేషన్ కార్డు తప్పనిసరి కాదు. మొదటిసారి గర్భం దాల్చిన మహిళలు, గత ప్రసవాల్లో సమస్యలు ఎదుర్కొన్న వారు, క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోని గర్భిణులకు ఈ పథకంలో ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నారు.
ఈ పథకం కోసం క్లిష్టమైన దరఖాస్తు ప్రక్రియ అవసరం లేదు. రెండు విధానాల ద్వారా సేవలు పొందవచ్చు.
ఆఫ్లైన్ విధానం: ప్రతి నెల 9వ తేదీన ఆధార్ కార్డు, మాతా-శిశు సంరక్షణ కార్డు (ఎంసీపీ కార్డు)తో సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC), కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రం (CHC) లేదా జిల్లా ఆసుపత్రికి వెళ్లాలి. అక్కడ సింగిల్ విండో కౌంటర్లో పేరు నమోదు చేసుకుని ఉచిత సేవలను పొందవచ్చు.
ఆన్లైన్ విధానం: కేంద్ర ఆరోగ్య శాఖ రూపొందించిన అధికారిక PMSMA పోర్టల్ లేదా PMSMA మొబైల్ యాప్ ద్వారా మొబైల్ నంబర్తో నమోదు చేసుకుని ముందుగానే అపాయింట్మెంట్ బుక్ చేసుకునే అవకాశం కూడా ఉంది.
ఈ పథకం కింద ప్రతి నెల 9వ తేదీన ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసూతి నిపుణులు, వైద్యాధికారుల ద్వారా ఉచితంగా అనేక సేవలు అందిస్తున్నారు. గర్భిణులకు రక్తపోటు, రక్తంలో చక్కెర స్థాయి, హీమోగ్లోబిన్ (రక్తహీనత), మూత్ర పరీక్షలు నిర్వహిస్తారు. అలాగే గర్భధారణలో అత్యంత కీలకమైన అల్ట్రాసౌండ్ స్కానింగ్ కూడా ఉచితంగా అందుబాటులో ఉంటుంది.
అదనంగా ఐరన్, ఫోలిక్ యాసిడ్ మాత్రలు, కాల్షియం మాత్రలు, అవసరమైన విటమిన్ మందులు ఉచితంగా ఇస్తారు. గర్భిణుల ఆరోగ్య పరిస్థితిని బట్టి మాతా-శిశు సంరక్షణ కార్డుపై ప్రత్యేక గుర్తులు వేస్తారు. ఆరోగ్య సమస్యలు లేని గర్భిణులకు ఆకుపచ్చ స్టిక్కర్, అధిక రక్తపోటు, తీవ్రమైన రక్తహీనత వంటి సమస్యలు ఉన్న అధిక ప్రమాద గర్భధారణలకు ఎరుపు స్టిక్కర్ జారీ చేసి ప్రసవం వరకు ప్రత్యేక వైద్య పర్యవేక్షణ కల్పిస్తారు. పోషకాహారం, తల్లిపాల ప్రాముఖ్యత, ప్రసవానికి సిద్ధమయ్యే విధానం వంటి అంశాలపై ఉచిత కౌన్సెలింగ్ కూడా అందిస్తున్నారు.
ఈ పథకం అమలుతో దేశంలో మాతృ ఆరోగ్య సూచికలు గణనీయంగా మెరుగుపడ్డాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. 2014-16లో ప్రతి లక్ష సజీవ జననాలకు 130గా ఉన్న మాతృ మరణాల నిష్పత్తి (MMR), 2022-24 నాటికి 87కు తగ్గింది. అలాగే గర్భధారణ తొలి మూడు నెలల్లో నమోదు చేసుకున్న మహిళల శాతం 58.6 శాతం నుంచి 76.2 శాతానికి పెరిగింది. నాలుగు లేదా అంతకంటే ఎక్కువ ప్రసవపూర్వ వైద్య పరీక్షలు చేయించుకున్న మహిళల శాతం 51.2 శాతం నుంచి 65.2 శాతానికి, ఆసుపత్రుల్లో జరిగే ప్రసవాలు 78.9 శాతం నుంచి 90.6 శాతానికి పెరిగినట్లు ప్రభుత్వం వెల్లడించింది.
విస్తరించిన ఈ-పీఎంఎస్ఎంఏ (e-PMSMA) విధానంలో అధిక ప్రమాద గర్భిణులను ముందుగానే గుర్తించి, ప్రసవం తర్వాత 45 రోజుల వరకు పేరువారీగా పర్యవేక్షిస్తున్నారు. అదనంగా మూడు వైద్య పరీక్షలు నిర్వహించడం, స్వయంచాలక సందేశాల ద్వారా పరీక్షల తేదీలను గుర్తు చేయడం, సమీప రిఫరల్ ఆసుపత్రులకు అనుసంధానం చేయడం, ఉచిత రవాణా సౌకర్యం కల్పించడం వంటి చర్యలు చేపడుతున్నారు.
అలాగే ప్రైవేట్ ప్రసూతి నిపుణుల భాగస్వామ్యాన్ని పెంచేందుకు ‘ఐ ప్లెడ్జ్ ఫర్ 9’ పురస్కారాలు అందజేస్తున్నారు. భారత ప్రసూతి, గైనకాలజీ సంఘాల సమాఖ్య (FOGSI), భారత వైద్య సంఘం (IMA) వంటి సంస్థలు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమవుతున్నాయి. గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో అదనపు వైద్య శిబిరాలు, ఆశా కార్యకర్తలకు ప్రోత్సాహకాలు, ఆరోగ్య సిబ్బందికి శిక్షణ, నిరంతర పర్యవేక్షణ ద్వారా ఈ పథకాన్ని మరింత సమర్థంగా అమలు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.













