Last Updated:
Auto Charges: తెలంగాణ రాష్ట్రంలో ఆటో ప్రయాణికులపై చార్జీల భారం పడనుంది. గత కొన్నేళ్లుగా పెండింగ్లో ఉన్న ఆటో చార్జీల పెంపు డిమాండ్పై నియమించిన అధికారుల కమిటీ తాజాగా ప్రభుత్వానికి తన సమగ్ర నివేదికను సమర్పించింది.
రవాణాశాఖ కమిషనర్ డాక్టర్ కె. ఇలంబర్తి ఈ ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వ పరిశీలనకు పంపించారు. ఈ సిఫార్సులకు ప్రభుత్వం లాంఛనంగా ఆమోదం తెలిపిన వెంటనే కొత్త చార్జీల అమలుపై అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి. అధికారుల కమిటీ సమర్పించిన నివేదిక ప్రకారం, ఆటోలకు కొత్త బేసిక్ చార్జీగా తొలి 1.6 కిలోమీటర్ల దూరానికి రూ.30 నిర్ణయించాలని సూచించారు. ఆ తర్వాతి ప్రతి కిలోమీటరు ప్రయాణానికి రూ.14 వసూలు చేయాలని ప్రతిపాదించారు. ట్రాఫిక్ లేదా ప్రయాణికుల కోసం వేచి ఉండే సమయానికి సంబంధించి నిమిషానికి 75 పైసలు నిరీక్షణ చార్జీగా వసూలు చేయాలని పేర్కొన్నారు. ఇక రాత్రి వేళల్లో (నైట్ చార్జీలు) ప్రయాణించే వారికి సాధారణ చార్జీ కంటే 50 శాతం అదనంగా అమలు చేయాలని కమిటీ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది.














