Last Updated:
Hospital Fire: ప్రసాద్ హాస్పిటల్లోని ఐసీయూలీ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం జరిగి పది మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 15 మంది తీవ్రగాయాలతో చావు బ్రతకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. ప్రాణాలు పోసే ఆసుపత్రుల్లో వరుసగా అగ్నిప్రమాదాలకు అసలు కారణం ఏంటీ..?
Hospital Fire: హాస్పిటల్స్ అంటేనే ప్రాణపాయస్థితిలో వచ్చే రోగులకు పునర్జన్మ ప్రసాదించే కేంద్రాలుగా జనం భావిస్తారు. అయితే అనారోగ్య సమస్యలతో చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్లి ప్రాణాలు కోల్పోతున్న కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. తాజాగా బీహార్లోని ముజాఫర్పూర్లో ప్రసాద్ హాస్పిటల్లోని ఐసీయూలీ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం జరిగి పది మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 15 మంది తీవ్రగాయాలతో చావు బ్రతకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. సంపూర్ణ ఆరోగ్యం కోసం ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లే రోగుల ప్రాణాలు గాల్లో దీపాల్లా మారుతున్నాయి. రోగుల భద్రత ప్రమాణాలు, ఆసుపత్రిలో అగ్నిప్రమాదాలు సంభవిస్తే రోగుల ప్రాణ రక్షణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శ్రద్ద పెట్టకపోవడం వల్లే ఇలాంటి దుర్ఘటనలు దేశ వ్యాప్తంగా అనేక మంది ప్రాణాలు పోవడానికి కారణమవుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన పలు ప్రమాదాల వివరాలు.. వాటిలో ప్రాణాలు కోల్పోయిన రోగుల సంఖ్య చూస్తే ఆసుపత్రుల్లో ఫైర్ యాక్సిడెంట్స్ డెత్ బెల్స్గా మారాయని తెలుస్తోంది.

దేశ వ్యాప్తంగా చూసుకుంటే ఆసుపత్రుల్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగి పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు చాలానే ఉన్నాయి. తాజాగా అంటే జూన్ 2న తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ శివారు శంషాబాద్లో ఉన్న లిమ్స్ ప్రైవేట్ ఆసుపత్రిలో కూడా ఇదే తరహా ప్రమాదం చోటుచేసుకుంది. ఎమర్జెన్సీ వార్డులో ఏసీ షార్ట్ సర్క్యూట్ వల్ల భారీగా పొగతో కూడిన మంటలు ఎగసిపడ్డాయి. రాత్రి సమయంలో ఈ ప్రమాదం జరగడంతో ఆసుపత్రి స్టాఫ్ ఏసీ రూమ్స్ అద్దాలు పగలగొట్టి రోగులను సురక్షితంగా బయటకు పంపే ప్రయత్నం చేయడంతో ప్రాణనష్టం తప్పింది. ఈక్రమంలోనే మరికొందరు రోగులు ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు. అయితే ఆసుపత్రి యాజమాన్యం సేఫ్టీ ప్రికాషన్స్ పాటిస్తున్నప్పటికి షార్ట్ సర్క్యూట్ కారణంతో ఈ అగ్నిప్రమాదం జరిగినట్లుగా ఫైర్ సిబ్బంది, పోలీసులు నిర్ధారించారు.
మార్చి 23న హైదరాబాద్ మాసబ్ట్యాంక్లోని శృతి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో కూడా అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. థర్డ్ ఫ్లోర్లో ఎయిర్ కండీషనర్ పేలడంతో మంటలు ఎగసిపడ్డాయి. హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్న రోగులు భయంతో ఉలిక్కిపడ్డారు. ఆసుపత్రి సిబ్బంది, ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పడంతో రోగులకు ప్రాణహాని తప్పింది.

ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో కూడా సరిగ్గా 6 సంవత్సరాల క్రితం ఇలాంటి దుర్ఘటనే 10 మంది రోగుల ప్రాణాల్ని పొట్టనపెట్టుకుంది. కరోన సమయంలో హోటల్ స్వర్ణ ప్యాలెస్ను కోవిడ్ కేర్ సెంటర్గా మార్చారు. అక్కడ క్వారంటైన్లో ఉన్న సుమారు 20 మంది రోగులు చికిత్స పొందుతున్నారు. అయితే ఆగస్టు 9, 2020న తెల్లవారుజామున ప్రైవేట్ ఆసుపత్రి నిర్వహణలోని స్వర్ణ ప్యాలెస్లో మంటలు చెలరేగాయి. ఈ దుర్ఘటనలో 10 మంది కొవిడ్ రోగులు మృతి చెందగా మరో 22 మంది గాయపడ్డారు. అప్పట్లో ఈ ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది.

ఇదే కాదు 2023 డిసెంబర్ 5న కూడా విజయవాడలోని అక్కినేని విమెన్స్ ఆసుపత్రిలో జరిగిన అగ్నిప్రమాదాన్ని స్థానికులు ఇప్పటికి మర్చిపోలేకపోతున్నారు. ఇక్కడ కూడా షార్ట్ సర్క్యూట్ కారణంగానే పైఅంతస్తులో మంటలు ఎగసిపడటంతో రోగులు హుటాహుటిన కింది ఫ్లోర్కి పరుగులు పెట్టి ప్రాణాలు కాపాడుకున్నారు. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తినష్టం జరిగినప్పటికి ప్రాణనష్టం సంభవించకపోవడంతో అధికారులు, రోగులు, ఆసుపత్రి సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.
ఇది మాత్రమే కాదు అటు గుంటూరులోని ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఏడాది మే 22వ తేది ఆసుపత్రిలోని 24 వార్డులో అకస్మాత్తుగా మంటలు ఎగసిపడటంతో రోగులు భయాందోళనకు గురయ్యారు. అయితే ఆసుపత్రి సిబ్బంది వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారమివ్వడంతో అగ్నిమాపక సిబ్బంది పైరింజన్ల సహాయంతో మంటలు ఆర్పారు. అయితే ఈప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.అయితే ఘటన స్తలాన్ని అప్పటి జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ పరిశీలించారు. విచారణకు ఆదేశించారు.

ఏ ఆసుపత్రిలో అయినా రోగులు అంటే చాలా వరకు అస్వస్థతకు గురైన వాళ్లు, వృద్దులు, నడవలేని స్థితిలో ఉండే ఆపరేషన్స్, సర్జరీలు చేయించుకొని అచేతన స్థితిలో ఉంటారు. ఇలాంటి వారు ఏదైనా దుర్ఘటనలు, విపత్తులు, ప్రమాదాలు జరిగిన వెంటనే నడవడం , పరిగెత్తడం వంటివి చేయలేరు. కాబట్టి ఆసుపత్రులలో అగ్నిప్రమాద నిర్వహణ చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఆసుపత్రిలో ఉండే పరికరాల వల్ల అధిక ప్రమాదం జరిగే ఛాన్సుంది. ఆసుపత్రులు విద్యుత్ యంత్రాలు, ఆక్సిజన్ సిలిండర్లు, మండే రసాయనాలు, పేలుడు స్వభావం కలిగిన లిక్విడ్స్ ఎక్కువగా ఉపయోగిస్తారు. వీటిని సరిగ్గా నిర్వహించకపోతే అగ్నిప్రమాదాలు సంభవిస్తాయి. మంటలను ఆర్పే ఫైర్ స్పెయర్స్ అందుబాటులో ఉంచడం,షార్ట్ సర్క్యూట్ జరగకుండా ఏసీలను ఎప్పటికప్పుడు సర్వీసింగ్ చేయడం వల్ల కూడా ఆసుపత్రుల్లో అగ్నిప్రమాదాలను అరికట్టవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana
Jun 04, 2026 11:12 AM IST













