Last Updated:
Indian Army: ఒక వ్యక్తి తన జీవితాంతం పొదుపు చేసిన డబ్బును.. ఒక్కసారిగా ఇండియన్ ఆర్మీకి విరాళంగా ఇచ్చేయడం చిన్న విషయం కాదు. ఆయనేమీ సంపన్నుడు కాదు. మనలా సామాన్యుడే. మరి ఎందుకు భారీ మొత్తం విరాళంగా ఇచ్చేశాడు? ఆయన జీవితంలో ఏం జరిగిందో తెలుసుకుందాం.
ప్రేమ, విషాదం, అపారమైన దేశభక్తి.. ఈ మూడు కలగలిపిన ఒక అద్భుతమైన, హృదయాన్ని హత్తుకునే ఉదంతం ఇది. నేటి సమాజంలో చాలా మంది తమ సొంత కోరికలు, భవిష్యత్తు అవసరాలు, విలాసవంతమైన జీవితం కోసం ఆరాటపడుతుంటారు. కానీ, మహారాష్ట్రలోని నాగ్పూర్కు చెందిన 70 ఏళ్ల, శ్రీకాంత్ సహస్రబుద్ధే అనే రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి మాత్రం తన జీవితకాల పొదుపు మొత్తాన్నీ భారత సైన్యానికి విరాళంగా ఇచ్చి దేశవ్యాప్తంగా అందరి మన్ననలూ పొందుతున్నారు. తన భార్య జ్ఞాపకార్థం ఆయన చేసిన ఈ దానం గురించి విన్న ప్రతి ఒక్కరూ ఆయన నిస్వార్థ సేవకు సలాం చేస్తున్నారు.
శ్రీకాంత్ సహస్రబుద్ధే, ఆయన భార్య అంజలి ఇద్దరూ పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB)లో పని చేశారు. మధ్యతరగతి కుటుంబాలకు చెందిన ఇతర దంపతుల లాగానే, వీరు కూడా తమ రిటైర్మెంట్ తర్వాత జీవితాన్ని సంతోషంగా గడపాలని కలలు కన్నారు. ఇద్దరూ తమ ఉద్యోగ విరమణ తర్వాత ప్రపంచ యాత్ర చేయాలని నిర్ణయించుకున్నారు. అందుకోసం దశాబ్దాల పాటు కష్టపడి పనిచేస్తూ తమ ప్రావిడెంట్ ఫండ్ (PF), ఇతర పొదుపు మొత్తాలను జాగ్రత్తగా కూడబెట్టారు. అంతా సవ్యంగా సాగుతుందనుకున్న సమయంలో విధి మరోలా తలచింది. శ్రీకాంత్ రిటైర్ అవ్వడానికి సరిగ్గా 6 నెలల ముందు ఆయన భార్య అంజలి అకస్మాత్తుగా మరణించారు. దీంతో వారిద్దరూ కలిసి కన్న ప్రపంచ పర్యటన కల ఒక్కసారిగా తీవ్ర విషాదంగా మారిపోయింది.
భార్యపై ప్రేమ, దేశంపై భక్తి.. ఆర్మీకి రూ.25.5 లక్షల లైఫ్ సేవింగ్స్ విరాళంగా ఇచ్చిన భారతీయుడు!
భార్య మరణంతో ఒంటరైన శ్రీకాంత్ తీవ్ర శోకంలో కూరుకుపోయారు. పిల్లలు ఎవరికి వారు స్థిరపడటంతో ఆయనకు ఆ పొదుపు చేసిన డబ్బుతో ఒంటరిగా ప్రపంచ యాత్ర చేయాలన్న ఆసక్తి ఏమాత్రం కలగలేదు. ఈ క్రమంలో వాట్సాప్లో వచ్చిన ఒక మెసేజ్ ఆయన ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేసింది. అకోలాకు చెందిన ఒక వ్యక్తి దేశ రక్షణ, సామాజిక ప్రయోజనాల కోసం ఏకంగా కోటి రూపాయలు విరాళంగా ఇచ్చాడని ఆ వార్త సారాంశం. అది చదివిన శ్రీకాంత్, తన దగ్గర ఉన్న సొమ్ముతో కూడా దేశానికి ఏదైనా మంచి చేయాలని నిర్ణయించుకున్నారు. వెంటనే తన జీవితకాల పొదుపులో సగానికి పైగా అంటే ఏకంగా రూ.25,51,000లను భారత సైన్యానికి చెందిన ‘సెంట్రల్ వెల్ఫేర్ ఫండ్’కు విరాళంగా ఇవ్వాలని సంకల్పించారు.
భార్యపై ప్రేమ, దేశంపై భక్తి.. ఆర్మీకి రూ.25.5 లక్షల లైఫ్ సేవింగ్స్ విరాళంగా ఇచ్చిన భారతీయుడు!
ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ, “సరిహద్దుల్లో దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వీర జవాన్ల కుటుంబాలకు, వారి వితంతువులకూ, పిల్లలకు ఈ డబ్బు ఎంతగానో ఉపయోగపడుతుందని నేను నమ్ముతున్నాను. నా భార్యతో కలిసి ప్రపంచం చుట్టివస్తే ఎంత ఆనందం దక్కేదో, అంతకంటే గొప్ప ఆనందం, ప్రశాంతత నా దేశానికి, సైన్యానికి ఇలా సేవ చేయడం వల్ల నాకు లభిస్తోంది” అని కన్నీటి పర్యంతమయ్యారు.
బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana
Jun 15, 2026 10:31 PM IST













