Last Updated:
Jantar Mantar Dharna: మీరు ఓ చోట ధర్నా చేస్తూ ఉంటారు. మీకు ఎక్కడి నుంచో ఫ్రీగా పిజ్జాలు, వాటర్ బాటిళ్లు వస్తే, వాటిని మీకు ఎవరో అజ్ఞాత వ్యక్తులు పంపితే.. ఆశ్చర్యంగానే ఉంటుంది కదా. ఢిల్లీ.. జంతర్ మంతర్ దగ్గర అదే జరుగుతోంది. ఆ విశేషాలు తెలుసుకుందాం.
ఎవరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా.. ఇండియాలో ఇప్పుడో సైలెంట్ రివల్యూషన్ నడుస్తోంది. అదే కాక్రోజ్ జనతా పార్టీ. సోషల్ మీడియాలో మీమ్స్ లాగా మొదలైన ఈ ఉద్యమం.. శాంతియుతంగా దాదాపు అన్ని రాష్ట్రాల్లో నడుస్తోంది. ఇక దీని విశ్వరూపం ఢిల్లీలో కనిపించింది. లక్షలాదిగా తరలివచ్చిన విద్యార్థులు, కార్యకర్తలూ.. కేంద్ర ప్రభుత్వాన్ని ఆలోచనలో పడేశారు. ఒకటే ప్రధాన డిమాండ్. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చెయ్యాలి. ఈ డిమాండ్ ఇప్పుడు దేశాన్ని ఊపేస్తోంది. కేంద్రం దీనిపై లోతుగా ఆలోచిస్తోంది. ఇలాంటి తరుణంలో ధర్నా చేస్తున్న వారికి భారీ సపోర్టు లభిస్తోంది.
దాదాపు నెల నుంచి సీజేపీ కార్యకర్తలు ఆందోళనలు చేస్తున్నారు. ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర వారు పెద్ద సంఖ్యలో హాజరవుతున్నారు. అనేక రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు, ఉద్యోగులూ, జెన్ జీ యువత అక్కడకు వచ్చి.. ధర్నాలో పాల్గొంటున్నారు. దేశంలో విద్యా సంస్కరణలు జరగాలని వారు కోరుకుంటున్నారు. తమ భవిష్యత్తు బంగారంలా ఉండాలని వారు ఆశిస్తున్నారు. ఈ దేశపు నెక్ట్స్ తరం ఆశలు అవి. వారి చేతుల్లోనే ఈ దేశం ఉండబోతోంది. కాబట్టి.. వారు తమ దేశాన్ని తామే సంస్కరించుకుంటామని ముందుకొచ్చారు. ఇది దేశవ్యాప్త చర్చగా మారింది.
జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తున్న వారిలో చాలా మంది విద్యార్థులూ, నిరుద్యోగులే. వారి దగ్గర డబ్బు లేదు. రేపు ఏమవుతుందో అనే ఆందోళన లేదు. అందువల్ల వారు.. ఏ ప్లానింగూ లేకుండా అక్కడ ధర్నా చేస్తున్నారు. మరి వారి ఆకలి తీరేదెలా? ఇక్కడే దేశం వారికి మద్దతుగా కదులుతోంది. దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడి నుంచో వారికి ఫుడ్ డెలివరీలు వస్తున్నాయి. స్విగ్గీ, జొమాటో వంటి ఫుడ్ డెలివరీ యాప్స్ ద్వారా.. అజ్ఞాత వ్యక్తులు.. డెలివరీలను పంపుతున్నారు. అడ్రెస్ ఒక్కటే. జంతర్ మంతర్. డెలివరీ బాయ్ అక్కడికి వెళ్లగానే.. ధర్నా చేస్తున్న ఎవరికైనా ఫుడ్ ఇచ్చేయమని చెబుతున్నారు.. ఆర్డర్ పెట్టిన వారు. దాంతో.. డెలివరీ బాయ్స్.. అక్కడ ఎవరికైనా ఫుడ్ ఇచ్చేస్తున్నారు. ఇలా ఆహారం, వాటర్ సప్లై అవుతోంది.
పిజ్జాలు, బర్గర్లు, మోమోస్, థాలీలు.. ఆన్లైన్ ఆర్డర్ ద్వారా వచ్చేస్తున్నాయి. “ఈ ఫుడ్ ఎవరు ఆర్డర్ ఇచ్చారు” అంటే.. ఫలానా “అనిరుధ్” అనో, “శ్రేయ” అనో చెబుతున్నారు డెలివరీ బాయ్స్. దాంతో.. ఫుడ్ తీసుకుంటున్నవారు.. “థాంక్యూ అనిరుధ్ భాయ్” అంటూ తీసుకుంటున్నారు. ఆయు జాకబ్ అనే 18 ఏళ్ల డెలివరీ బాయ్ ఒక్కరోజులో 20 సార్లు డెలివరీ చేశాడు. దేశం నలుమూలల నుంచి, విదేశాల నుంచి కూడా ఆర్డర్లు వచ్చాయి. చివరకు.. CJP నాయకులు ఇక ఫుడ్ ఆర్డర్లు ఆపమని అభ్యర్థించారు. ఎందుకంటే సప్లైలు అధికంగా పేరుకుపోయాయి. ఇది ఒక రకమైన హెల్పింగ్ హ్యాండ్లా మారింది. మా కోసం మీరు ధర్నా చేస్తున్నారు.. మీ కోసం మేం ఉన్నాం.. అనే సంకేతాన్ని ఇస్తోంది. ఈ వార్తను బీబీసీ తెలుగు హైలెట్ చేసింది. పెద్ద ఎత్తున పార్సిల్స్ అక్కడికి వస్తున్నాయని తెలిపింది.
రాజకీయాలు ఎప్పుడూ ఉండేవే. మనం ఏ విషయాన్నైనా రాజకీయ కోణంలో చూసినప్పుడు.. కొందరు ఈ ధర్నాని తప్పు పడతారు, మరికొందరు సమర్థిస్తారు. ఒక్కసారి రాజకీయాల్ని పక్కన పెట్టేస్తే.. అప్పుడు మన మనసులోంచీ.. అసలైన భావన పైకి వస్తుంది. అదే అసలైన భావన. ఈ భావనే.. ఆ విద్యార్థులకు సపోర్ట్ అందించేలా చేస్తోంది. ఈ స్ఫూర్తితోనే.. ఎంతో మంది ఆందోళనకారులకు తమ వంతుగా సహాయం చేస్తున్నారు. ఇలా సాయం చేస్తున్నవారు.. ప్రచారం చేసుకోవట్లేదు, రీల్స్ చేసుకోవట్లేదు. సేవ మాత్రమే చేస్తున్నారు. అందుకే.. వారి ఈ చర్య.. మరింతగా స్పూర్తిని రగిలిస్తోంది.
బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana














