Last Updated:
Junior NTR Land Issue: జూబ్లిహిల్స్ ఎమ్మెల్యే నవీన్ కుమార్ యాదవ్ తెలంగాణలో జరిగిన భూదోపిడీపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈవిషయంలో టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ పేరు ప్రస్తావించడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.
Jr NTR: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా బుధవారం నిర్వహించిన స్పెషల్ సెషన్లో 22ఏపై జరిగిన చర్చలో అధికార పార్టీ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన భూదందా, భూమాయాజాలం గురించి అనేక ఆరోపణలు, విమర్శలు చేసింది. ఇదే క్రమంలో అప్పటి సీఎంగా ఉన్న కేసీఆర్ ధరణి పేరుతో లక్షల కోట్ల దోపిడీకి తెర తీశారని.. ఫలితంగా లక్షల కోట్ల ఆస్తి కొందరు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిందని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. వాటి వివరాలు, లెక్కల గురించి చెప్పుకుంటూ పోతే రామాయణం, మహాభారతం అవుతుందన్నారు. ఇక ఇదే క్రమంలో ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన 22ఏ భారీ భూదోపిడీకి పాల్పడబోతోందన్న విపక్ష నేతల వ్యాఖ్యలకు బదులిచ్చారు అధికార కాంగ్రెస్ సభ్యులు. ఇందులో భాగంగానే జూబ్లిహిల్స్ ఎమ్మెల్యే నవీన్ కుమార్ యాదవ్ సంచలన కామెంట్స్ చేశారు. ధరణిని అడ్డుపెట్టుకొని గత పాలనలో భూముల రికార్డులను తారుమారు చేసి వందల కోట్ల ఎకరాలకు పట్టాలు పుట్టించి వేరే వ్యక్తులకు అమ్ముకున్నారని ఆరోపించారు. ఈ విషయంలో సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ని కూడా బాధితుడే అని చెప్పిన నవీన్ కుమార్ యాదవ్.. దానికి సంబంధించిన పూర్తి వివరాలను సభలో వెల్లడించారు. కేసీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి, ధరణి వర్సెస్ 22ఏగా సాగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో జూనియర్ ఎన్టీఆర్ భూముల కొనుగోలు సక్రమం కాదనే విషయాన్ని బయటపెట్టడంతో ఇప్పుడు అటు రాజకీయంగా ఇటు సినీ పరిశ్రమలో హాట్ టాపిక్గా మారింది.
సినిమా పరిశ్రమకు చెందిన చాలా మంది హీరోలు, నిర్మాతలు, దర్శకులకు హైదరాబాద్ పరిసరాల్లో వేల కోట్ల రూపాయల విలువ చేసే వందల ఎకరాల భూములు ఉన్నాయి. ఇందులో స్టార్ హీరోలు చాలా మంది ఉన్నారు. అయితే ఇవన్నీ ఎలా కొనుగోలు చేశారు..? భూమి రికార్డుల ప్రకారం అవన్నీ ఇప్పుడు వారికే చెందుతాయా లేక ప్రభుత్వం వాటిని స్వాధీనం చేసుకుంటుందా అనే కొత్త సందేహాలు వస్తున్నాయి. బుధవారం తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా 22A పై జరిగిన చర్చలో భూముల పంచాయితీ తెరపైకి వచ్చింది. మరీ ముఖ్యంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రభుత్వ, దేవాదాయ, అటవీశాఖ భూముల రికార్డులను ధరణి పేరుతో తారుమారు చేసి లక్షల కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడిందని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. దీనికి బలం చేకూర్చే విధంగా జూబ్లిహిల్స్ ఎమ్మెల్యే నవీన్ కుమార్ యాదవ్.. కూడా ప్రముఖ సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ కొనుగోలు చేసిన భూముల ప్రస్తావనను సభలో లేవనెత్తారు. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధి రామచంద్రాపురం మండలంలోని ఏదులనాగులపల్లి గ్రామపంచాయితీ పరిధిలోని ఉన్న సర్వే నంబర్ 134, 135 లోని భూములను ధరణిని అడ్డుపెట్టుకుని భూరికార్డులను ఇష్టారాజ్యంగా మార్చేసి… ప్రభుత్వ భూములకు పట్టాలు సృష్టించి… 150 ఎకరాలు జూ.ఎన్టీఆర్తో సహా మరికొంతమందికి అంటగట్టారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపి దోషులపై చర్యలు తీసుకోవాలని నవీన్ కుమార్ యాదవ్ డిమాండ్ చేశారు.
హీరో జూ.ఎన్టీఆర్ కూడా ధరణి బాధితుడే…!
ధరణిని అడ్డుపెట్టుకుని భూరికార్డులను ఇష్టారాజ్యంగా మార్చేసి… ప్రభుత్వ భూములకు పట్టాలు సృష్టించి… 150 ఎకరాలు జూ.ఎన్టీఆర్తో సహా మరికొంతమందికి అంటగట్టారు…
ఈ వ్యవహారంపై విచారణ జరిపి దోషులపై చర్యలు తీసుకోవాలి…
– ఎమ్మెల్యే నవీన్… pic.twitter.com/ghdCixNTdl
— Indiramma Indla Seenanna (@IndlaSeenanna) September 16, 2026
అయితే నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్నట్లుగా హైదరాబాద్ శివార్లతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న వేలాది ఎకరాల భూములను సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు కొనుగోలు చేశారు. అయితే అప్పటి ప్రభుత్వం ప్రకారం భూమి విలువ చెల్లించి సొంతం చేసుకున్న సినీ నటులను బాధితులుగా చూపిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు వాటిని బయటపెడతామని .. ఒకవేళ ప్రభుత్వ భూములే అని తేలినా లేక రికార్డులు తారుమారు చేసి పట్టాలు సృష్టించినవే అని నిర్ధారణ జరిగినా వాటిని స్వాధీనం చేసుకుంటామని స్పష్టంగా చెబుతోంది. ఇందుకు గత సీఎం కేసీఆర్కి కూడా మినహాయింపు ఇవ్వడం లేదు.
గజ్వేల్ నియోజకవర్గంలోని ఎర్రవెల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్ పరిధిలోని వందల ఎకరాల భూమిపై కూడా విచారణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఒకవేళ అది కబ్జా, తప్పుడు పత్రాలతో సృష్టించినదే అని తేలితే దళితులకు పంచుతామని చెప్పారు. అయితే ఈవిధంగా చూస్తే జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రవితేజ, శ్రీకాంత్, ప్రకాష్ రాజ్ తో పాటు చాలా మంది సినీ ప్రముఖులు సిటీ ఔట్ కట్స్లో వందల ఎకరాలను కొనుగోలు చేశారు. వాటిపై కూడా ఈ ప్రభుత్వం విచారణ జరుపుతుందా అనే చర్చ ఇప్పుడు ఇండస్ట్రీని షేక్ చేస్తోంది.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం సోయి లేకుండా తెచ్చినదే ధరణి అని కాంగ్రెస్ పాలకులు ఆరోపిస్తున్నారు. 2010 ఒడిశాలో ధరణి ప్రారంభమైంది.. కానీ కేసీఆర్ తానే ధరణి తెచ్చానని చెప్పుకున్నారు.. ఒడిశాలో ధరణిని కాగ్ తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టింది.. అయినా కేసీఆర్ ధరణిని తెచ్చి పెట్టారని.. ధరణితో భూ దందాలకు తెరలేపారని కాంగ్రెస్ నేతలు సభలో విమర్శిస్తున్నారు. ధరణి చిట్టా చెప్పాలనే కేసీఆర్ను పదే పదే సభకు రావాలని అడుగుతున్నామని .. అందుకే బబుల్ షూటర్.. కేసీఆర్ను సభకు రావొద్దని చెప్పారంటూ కేటీఆర్, హరీష్ రావుపై పరోక్ష విమర్శలు చేశారు రేవంత్ రెడ్డి. ఈ భూదందా బయటపడుతుందనే సభ నుంచి పారిపోయారని ఎద్దేవా చేశారు.














