Pakistan Suicide Blast: పాకిస్థాన్‌‌లో దారుణం.. శాంతి ర్యాలీపై ఆత్మాహుతి దాడి.. 14 మంది మృతి! | | ACTPnews

News18


Last Updated:

పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. తీవ్రవాదానికి వ్యతిరేకంగా చేపట్టిన శాంతి ర్యాలీ లక్ష్యంగా చేసుకుని ఓ ఆత్మాహుతి దళ సభ్యుడు తనను తాను పేల్చుకున్నాడు. ఈ ఘోర ఘటనలో ఐదుగురు పోలీసులతో సహా 14 మంది ప్రాణాలు కోల్పోయారు.

News18
News18

పాకిస్థాన్‌‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో ఘోర ఉగ్రదాడి జరిగింది. తీవ్రవాదానికి వ్యతిరేకంగా ప్రజలు పెద్ద ఎత్తున చేపట్టిన శాంతి ర్యాలీనే లక్ష్యంగా చేసుకుని ఓ ఉగ్రవాది ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. ఆదివారం స్వాత్ వ్యాలీలోని కబాల్ పట్టణంలో జరిగిన ఈ ఘటనలో కనీసం 14 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారని అసోసియేటెడ్ ప్రెస్ వార్తా సంస్థ వెల్లడించింది. మృతుల్లో ఐదుగురు పోలీస్ అధికారులు కూడా ఉన్నట్లు సమాచారం. ఉగ్రవాద కార్యకలాపాలకు చరమగీతం పాడాలంటూ నినాదాలు చేస్తూ.. శాంతి కోసం స్థానికులు పోలీస్ స్టేషన్ సమీపంలో ఆందోళన చేస్తున్న సమయంలో ఈ దాడి చోటుచేసుకుంది. ‘స్వాత్ అమన్ జిర్గా’ (స్థానిక గిరిజన మండలి) ఆధ్వర్యంలో ఈ ర్యాలీని నిర్వహించినట్లు స్థానిక మీడియా పేర్కొంది.

భారీగా భద్రతా బలగాలు

శాంతి ర్యాలీలో ఉన్నట్టుండి పేలుడు జరగడంతో అక్కడ ఉన్న వందలాది మంది ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే రెస్క్యూ, ఎమర్జెన్సీ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. ప్రావిన్షియల్ ఎమర్జెన్సీ సర్వీస్ ప్రతినిధి బిలాల్ ఫైజీ ఈ ప్రమాద వివరాలను ధృవీకరించారు.

ఈ దాడికి తామే బాధ్యులమని ఇప్పటివరకు ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించనప్పటికీ, పాకిస్థానీ తాలిబన్‌గా పిలిచే తెహ్రీక్-ఇ-తాలిబన్ పాకిస్థాన్ (TTP) హస్తం ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. గాయపడిన వారిని చికిత్స కోసం సైదు షరీఫ్‌లోని సెంట్రల్ ఆసుపత్రికి తరలించారు.

ఉగ్రదాడుల పెరుగుదల

ఇటీవల కాలంలో ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో ఉగ్రవాద హింస విపరీతంగా పెరిగిపోయింది. జులై నెలలోనే అక్కడ ఉగ్రదాడుల కారణంగా 154 మంది ప్రాణాలు కోల్పోయారు. శాంతి ర్యాలీపై జరిగిన ఈ దాడిని పాకిస్థాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ, ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ తీవ్రంగా ఖండించారు. దేశం నుంచి ఉగ్రవాదాన్ని పూర్తిగా రూపుమాపే వరకు పోరాటం కొనసాగుతుందని వారు స్పష్టం చేశారు. భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని విచారణను వేగవంతం చేశాయి.

Click here to add News18 as your preferred news source on Google.

బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *