Last Updated:
ఎండ తీవ్రతకు ఆహార పదార్థాలు కుళ్ళిపోతున్నా వాటిని భద్రపరుచుకోవడానికి విద్యుత్ లేదు. తాగడానికి, స్నానాలు చేయడానికి నీరు లేదు. చివరకు వంట వండుకోవడానికి గ్యాస్ కూడా రావడం లేదు.
Pakistan: సింధు నదీ జలాల ఒప్పందాన్ని (IWT) నిలిపివేస్తూ భారతదేశం తీసుకున్న నిర్ణయం తెచ్చిపెట్టిన నష్టాల నుండి పాకిస్తాన్ ఇంకా కోలుకోకముందే, ఆ దేశ ఆర్థిక రాజధాని కరాచీ నగరాన్ని తీవ్రమైన మౌలిక వసతుల సంక్షోభం ముంచెత్తింది. కరాచీ నగరంలోని కోట్లాది మంది ప్రజలు ప్రస్తుతం నీరు, వంట గ్యాస్, విద్యుత్ కొరతతో నరకం చూస్తున్నారు. వేసవి కావడంతో నిత్యావసర సేవల వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయి, జనం అల్లాడిపోతున్నారు.
పాకిస్తాన్ ప్రముఖ పత్రిక ‘డాన్’ (Dawn) కథనం ప్రకారం.. మునుపెన్నడూ లేని విధంగా పెరిగిన భానుడి తీవ్రతకు తోడు, కనీస వసతులు కరువవ్వడంతో అక్కడి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. ఎండ తీవ్రతకు ఆహార పదార్థాలు కుళ్ళిపోతున్నా వాటిని భద్రపరుచుకోవడానికి విద్యుత్ లేదు. తాగడానికి, స్నానాలు చేయడానికి నీరు లేదు. చివరకు వంట వండుకోవడానికి గ్యాస్ కూడా రావడం లేదు. ఈ దారుణ పరిస్థితులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కరాచీ వ్యాప్తంగా ప్రజలు వీధుల్లోకి వచ్చి రోడ్లను దిగ్బంధిస్తూ భారీ నిరసనలకు దిగారు. దేశంలోని అతి ముఖ్యమైన ఒక మతపరమైన పండుగ సమయంలో కూడా ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా గంటల తరబడి సరఫరా నిలిపివేయడంపై ప్రజలు యుటిలిటీ సంస్థలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి అంతరాయాలు ఉండవని కంపెనీలు ఇచ్చిన హామీలు కేవలం కాగితాలకే పరిమితమయ్యాయని స్థానికులు మండిపడుతున్నారు.
కరాచీలో నీటి కొరత మరింత తీవ్రం అవ్వడానికి ప్రధాన కారణం విద్యుత్ సరఫరాలో ఏర్పడిన సాంకేతిక లోపమే. ‘కరాచీ వాటర్ అండ్ సీవరేజ్ కార్పొరేషన్’ (KWSC) తెలిపిన వివరాల ప్రకారం.. ‘నార్త్ ఈస్ట్ కరాచీ పంపింగ్ స్టేషన్’ కు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో నగరానికి రోజుకు 54 మిలియన్ గ్యాలన్ల నీటి కొరత ఏర్పడింది. ఈ పాడైపోయిన కేబుల్ నెట్వర్క్ను త్వరగా పునరుద్ధరించకపోతే పరిస్థితి మరింత దిగజారుతుందని వాటర్ బోర్డు హెచ్చరించింది. మే 31 అర్ధరాత్రి దాటిన తర్వాత (తెల్లవారుజామున 3:27 గంటలకు) ఈ విద్యుత్ నిలిచిపోవడంతో కె-II (K-II) పంపింగ్ స్టేషన్ పనులు పూర్తిగా నిలిచిపోయాయి. దీనికి ఒక రోజు ముందే ‘దాబేజీ పంపింగ్ స్టేషన్’ లో కూడా అత్యవసర విద్యుత్ నిలిపివేత కారణంగా సగం నగరానికి నీళ్లు బంద్ అయ్యాయి.
విద్యుత్ సరఫరా చేసే ‘కె-ఎలక్ట్రిక్’ (K-Electric) సంస్థ ప్రత్యామ్నాయంగా కె-III (K-III) ఫీడర్ ద్వారా ఉదయం 5:50 గంటలకు కొంతవరకు కరెంట్ పునరుద్ధరించినప్పటికీ, దాని సామర్థ్యం చాలా తక్కువగా ఉండటం వల్ల మోటార్లు పూర్తి స్థాయిలో నడవటం లేదు. ఈ లోపాన్ని శాశ్వతంగా సరిచేయకపోతే వాటర్ సప్లై షెడ్యూల్ మొత్తం తలకిందులవుతుందని కేడబ్ల్యూఎస్సీ ఆందోళన వ్యక్తం చేసింది.
కరాచీ నగరంలో నీటి ఎద్దడి ఇలా కొనసాగడం ఇది వరుసగా రెండో నెల. ప్రభుత్వ పంపిణీ వ్యవస్థ పూర్తిగా ఫెయిల్ అవ్వడంతో వేలాది కుటుంబాలు ఇప్పుడు ప్రైవేట్ వాటర్ ట్యాంకర్లు, ప్రైవేట్ సప్లయర్లపైనే ఆధారపడుతున్నాయి. ఒకవైపు దేశంలో పెరిగిపోయిన ద్రవ్యోల్బణం, ఆర్థిక సంక్షోభ భారం మోస్తున్న సామాన్యుడికి, ఈ నీటి ట్యాంకర్ల కోసం అదనపు డబ్బులు ఖర్చు పెట్టాల్సి రావడం మరియు ట్యాంకర్ల కోసం గంటల తరబడి లైన్లలో నిలబడాల్సి రావడం పెను భారంగా మారింది.
నిజానికి ఈ సంక్షోభం మార్చి చివరి వారంలోనే ప్రారంభమైందని, నగరంలోని పాతబడిపోయిన పైప్లైన్ల వ్యవస్థే దీనికి ప్రధాన కారణమని నివేదికలు చెబుతున్నాయి. ప్రధాన నీటి పైప్లైన్లు లీక్ అవ్వడం, కాలం చెల్లిన రవాణా మార్గాలు మాటిమాటికీ పగిలిపోవడం, పంపింగ్ స్టేషన్లలో నిరంతర విద్యుత్ కోతలు మరియు సాంకేతిక లోపాలు ఈ దుస్థితికి కారణమయ్యాయి. ఈ సంక్షోభం ప్రభుత్వ రంగ సంస్థల మధ్య ఉన్న అంతర్గత విభేదాలను కూడా బయటపెట్టింది. విద్యుత్ లైన్లను త్వరగా బాగుచేయాలంటూ వాటర్ కార్పొరేషన్ (KWSC), పవర్ కంపెనీ (K-Electric) పై ఒత్తిడి తెస్తోంది. అధికారులు అందుబాటులో ఉన్న వనరులతో సేవలను పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తున్నామని చెబుతున్నప్పటికీ, కరాచీ ప్రజల కష్టాలు తీరే మార్గం మాత్రం ప్రస్తుతానికి ఎక్కడా కనిపించడం లేదు.
బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana
Jun 01, 2026 12:02 PM IST













