Last Updated:
Restaurant Service Charge Rules: హోటళ్లు, రెస్టారెంట్లలో బిల్లుతో పాటు సర్వీస్ ఛార్జీని కూడా చాలాచోట్ల వసూలు చేస్తున్నారు. అయితే ఈ ఛార్జీ చెల్లించడం పూర్తిగా స్వచ్ఛందం. ఒకవేళ బిల్లులో బలవంతంగా సర్వీస్ ఛార్జీ జతచేస్తే, దాన్ని తొలగించమని అడిగే హక్కు వినియోగదారులకు ఉంది.
హోటళ్లు, రెస్టారెంట్లలో భోజనం చేసిన తర్వాత బిల్లు చూసే సమయంలో చాలామందికి ఒక విషయం గమనించే ఉంటారు. ఆహార ధరలు, జీఎస్టీతో పాటు అదనంగా ‘సర్వీస్ ఛార్జీ’ కూడా బిల్లులో ఉండడాన్ని చూసుంటారు. చాలామంది దీనిని తప్పనిసరిగా చెల్లించాల్సిన ఛార్జీగా భావించి ఎలాంటి ప్రశ్నలు అడగకుండా చెల్లిస్తారు. అయితే, వారికి మందికి తెలియని విషయం ఏమిటంటే.. సర్వీస్ ఛార్జీ చెల్లించడం పూర్తిగా స్వచ్ఛందం (Voluntary). దానిని వినియోగదారులపై బలవంతంగా విధించడం చట్టబద్ధం కాదు.
కొన్ని రెస్టారెంట్లు, హోటళ్లు వినియోగదారుల అనుమతి లేకుండానే బిల్లులో సర్వీస్ ఛార్జీని జతచేస్తుంటాయి. ఒకవేళ కస్టమర్ ఆ మొత్తాన్ని తొలగించాలని కోరితే, “ఇది మా పాలసీ”, “ఈ డబ్బు వెయిటర్లకు వెళ్తుంది” లేదా “సర్వీస్ ఛార్జీ తప్పనిసరి” వంటి కారణాలు చెబుతూ తొలగించేందుకు నిరాకరిస్తుంటాయి. అయితే, ఇటువంటి వాదనలు చట్టపరంగా సమర్థనీయం కావని వినియోగదారుల హక్కుల నిపుణులు చెబుతున్నారు.
వినియోగదారుల నుంచి వరుసగా ఫిర్యాదులు రావడంతో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రెస్టారెంట్లు, హోటళ్లకు సర్వీస్ ఛార్జీని బలవంతంగా వసూలు చేయవద్దని స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. అయినప్పటికీ కొందరు వ్యాపారులు ఈ నిబంధనలను ఉల్లంఘిస్తుండటంతో, ఇటీవల సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CCPA) సర్వీస్ ఛార్జీలు వసూలు చేసిన 41 రెస్టారెంట్లపై చర్యలు తీసుకుని జరిమానాలు విధించింది. దీంతో వినియోగదారుల హక్కుల పరిరక్షణ విషయంలో ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరిస్తున్నట్లు స్పష్టమైంది.
వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ మార్గదర్శకాల ప్రకారం, రెస్టారెంట్ అందించిన సేవతో సంతృప్తి చెందిన కస్టమర్ స్వచ్ఛందంగా టిప్ లేదా సర్వీస్ ఛార్జీ చెల్లించవచ్చు. కానీ దానిని బిల్లులో తప్పనిసరిగా చేర్చి వసూలు చేయడం అనుమతించబడదు. కాబట్టి బిల్లులో సర్వీస్ ఛార్జీ కనిపిస్తే, దానిని తొలగించాలని కోరే పూర్తి హక్కు వినియోగదారుడికి ఉంటుంది. ఒకవేళ మీ అభ్యర్థనను రెస్టారెంట్ తిరస్కరించి, సర్వీస్ ఛార్జీని బలవంతంగా వసూలు చేయడానికి ప్రయత్నిస్తే, మీరు ప్రభుత్వానికి అధికారికంగా ఫిర్యాదు చేయవచ్చు. ఇందుకోసం పలు మార్గాలు అందుబాటులో ఉన్నాయి.
ముందుగా జాతీయ వినియోగదారుల హెల్ప్లైన్ (National Consumer Helpline) నంబర్ 1915కు కాల్ చేసి ఫిర్యాదు నమోదు చేయవచ్చు. అలాగే మొబైల్లో NCH యాప్ డౌన్లోడ్ చేసుకుని, బిల్లు వివరాలతో ఆన్లైన్లో కూడా ఫిర్యాదు చేయొచ్చు. ఈ ఫిర్యాదులను సంబంధిత అధికారులు పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటారు.
అలాగే ఇ-దాఖిల్ (e-Daakhil) పోర్టల్ ద్వారా కూడా వినియోగదారులు నేరుగా ఫిర్యాదు నమోదు చేసే అవకాశం ఉంది. ఈ ఆన్లైన్ వేదిక ద్వారా న్యాయవాది అవసరం లేకుండానే ఇంటి నుంచే వినియోగదారుల కమిషన్కు ఫిర్యాదు సమర్పించవచ్చు. దీంతో సమయం, ఖర్చు రెండూ ఆదా అవుతాయి.
ఇంకా, బిల్లు కాపీతో పాటు పూర్తి వివరాలను సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CCPA) అధికారిక ఈమెయిల్ com-ccpa@nic.inకు పంపి కూడా ఫిర్యాదు చేయవచ్చు. అవసరమైతే మీ జిల్లా కలెక్టర్ (DM) వద్ద కూడా రెస్టారెంట్ లేదా హోటల్పై ఫిర్యాదు చేసే అవకాశం ఉంది.
వినియోగదారులు తమ హక్కులపై అవగాహన కలిగి ఉండటం ఎంతో ముఖ్యం. సర్వీస్ ఛార్జీ తప్పనిసరి కాదని తెలుసుకుని, అవసరమైతే చట్టబద్ధమైన మార్గాల్లో ఫిర్యాదు చేయడం ద్వారా ఇటువంటి అక్రమ వసూళ్లను అరికట్టడంలో ప్రతి ఒక్కరూ తమ వంతు పాత్ర పోషించవచ్చు.
Hyderabad,Telangana
Jul 20, 2026 10:50 AM IST














