Last Updated:
తిరుమల బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజు మోహినీ అవతారంలో శ్రీ మలయప్పస్వామి భక్తులకు దర్శనమిచ్చారు. గరుడ వాహనసేవకు ప్రత్యేక స్థానం ఉంది.
తిరుమలలో బ్రహ్మోత్సవాల సందడి రోజురోజుకూ మరింత వైభవంగా మారుతోంది. ఐదో రోజు ఉదయం శ్రీవారి మాడవీధుల్లో కనిపించిన అపురూప దృశ్యం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. శ్రీ మలయప్పస్వామివారు మోహినీ అవతారంలో సర్వాలంకార భూషితుడై జగన్మోహనాకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
మరో తిరుచ్చిపై శ్రీకృష్ణుడి అలంకారంలో స్వామివారు భక్తులకు అభయమిచ్చారు. ముందుగా గజరాజులు నడుస్తుండగా.. భక్తుల భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల ఘోష, మంగళవాయిద్యాల నడుమ పల్లకీసేవ వైభవంగా సాగింది. మాడవీధుల్లో అడుగడుగునా భక్తులు కర్పూరహారతులు సమర్పిస్తూ మోహినీ రూపంలో ఉన్న స్వామివారిని భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు.
మోహినీ అలంకారానికి ఆధ్యాత్మికంగా ప్రత్యేక ప్రాశస్త్యం ఉంది. జగత్తును ఆవరించే మాయామోహాలకు అతీతంగా భగవంతుడి శరణు పొందాలనే సందేశాన్ని ఈ రూపం అందిస్తుందని భక్తుల విశ్వాసం. సర్వం భగవంతుడి లీలలో భాగమేనని.. భక్తి మార్గంలో నడవడం ద్వారా మాయామోహాల నుంచి విముక్తి పొందవచ్చనే భావాన్ని మోహినీ రూపం చాటిచెబుతుంది.
బ్రహ్మోత్సవాల్లో అత్యంత విశిష్టమైన గరుడ వాహనసేవకు 108 వైష్ణవ దివ్యదేశాల్లో ప్రత్యేక స్థానం ఉంది. భగవంతుడి వాహనమైన గరుడుడి దర్శనం భక్తుల్లో శరణాగతి, జ్ఞానం, వైరాగ్య భావాలను పెంపొందిస్తుందని విశ్వాసం. గరుడ వాహనసేవను దర్శించడం ద్వారా స్వామివారి అనుగ్రహం లభించి పాపాలు తొలగి ఆధ్యాత్మిక శుభఫలాలు కలుగుతాయని పురాణాలు పేర్కొంటున్నాయి.
ఈ కార్యక్రమంలో పెద్దజీయర్స్వామి, చిన్నజీయర్స్వామి, టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, పలువురు బోర్డు సభ్యులు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, సీవీఎస్వో మురళీకృష్ణ, ఎస్వీబీసీ ఛైర్మన్ శ్రీధర్ వర్మ తదితరులు పాల్గొన్నారు.













