ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల్లో అధికారిక లాంఛనాలను ఆయన సతీమణి తిరస్కరించినప్పటికీ, పోలీసులు వాటిని నిర్వహించడంపై మాజీ మంత్రి అంబటి రాంబాబుతో పాటు వైసీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరి మెప్పు కోసం ఇదంతా చేస్తున్నారు.. అంటూ పోలీసులతో వైసీపీ శ్రేణులు తీవ్ర వాగ్వాదానికి దిగడంతో, అక్కడ ఏర్పడిన తీవ్ర గందరగోళ పరిస్థితుల మధ్యే ముద్రగడ అంత్యక్రియలు పూర్తయ్యాయి.
మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు కిర్లంపూడిలోని ఆయన నివాస ఆవరణలో అధికారిక లాంఛనాలతో ముగిసాయి. ఆయనను కడసారి చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ముద్రగడ భౌతికకాయానికి నివాళులర్పించి, ఆయన కుటుంబసభ్యులను పరామర్శించడమే కాకుండా స్వయంగా ముద్రగడ పాడె మోసి అంతిమ యాత్రలో పాల్గొన్నారు.
ఇబ్రహీంపట్నం సమీపంలోని కృష్ణా-గోదావరి పవిత్ర సంగమం వద్ద జలహారతి అనంతరం ఏర్పాటు చేసిన సభలో సీఎం మాట్లాడారు. రెండేళ్లలో ఇరిగేషన్ ప్రాజెక్టులపై రూ.24వేల కోట్లు ఖర్చు చేశామని తెలిపిన సీఎం చంద్రబాబు. మార్చి 2027 నాటికి పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని అలాగే సెప్టెంబరు 1న వెలిగొండ ఫేజ్-1 ప్రాజెక్టును ప్రారంభిస్తామని ప్రకటించారు. వచ్చే మూడేళ్లలో రూ.35వేల కోట్లతో 36 ప్రాజెక్టులను పూర్తి చేయడమే కాకుండా, నదుల అనుసంధానం ద్వారా రాష్ట్రంలో కరవు లేకుండా చేయడమే తమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.
వరంగల్ ఎయిర్పోర్టును 2028 నాటికి పూర్తిచేయాలని కేంద్రం నిర్ణయించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు చెప్పారు. ఆ ఘనత మోదీ ప్రభుత్వానిదేనని, కేవలం క్రెడిట్ కోసమే సీఎం రేవంత్రెడ్డి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణను ఆలస్యం చేయడం వల్లే ఈ ప్రాజెక్టు ఆలస్యమైందని, మోదీ నేతృత్వంలోని ఉడాన్ స్కీం వల్లే వరంగల్కు ఎయిర్పోర్టు వస్తోందని, త్వరలోనే ఆదిలాబాద్లో కూడా డిఫెన్స్ ఎయిర్పోర్టు రాబోతోందని ఆయన స్పష్టం చేశారు.
తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం బడా రైస్ మిల్లర్లకు కొమ్ముకాస్తూ, కేవలం లక్షల రూపాయల లేవీ బాకీ ఉన్న చిన్న రైస్ మిల్లర్లపై కేసులు పెట్టి వేధించడం అన్యాయమని కల్వకుంట్ల కవిత అన్నారు . ఒకవైపు రైతులను రక్తకన్నీరు పెట్టిస్తున్న ఈ ప్రభుత్వం.. బడా మిల్లర్ల నుండి వేల కోట్ల సీఎంఆర్ బకాయిలను వసూలు చేయాలని, అలాగే చిన్న మిల్లర్లకు వన్ టైమ్ సెటిల్మెంట్ (OTS) అవకాశం ఇచ్చి ఆదుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.
ఫ్యూచర్ సిటీలో అమెజాన్ కొత్త డేటా సెంటర్కు శంకుస్థాపన చేసిన తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రానికి వచ్చే పరిశ్రమలకు సింగిల్ విండో ద్వారా వేగంగా అనుమతులు ఇస్తున్నామని, పారిశ్రామికవేత్తలకు అన్ని ప్రోత్సాహకాలు అందిస్తున్నామని తెలిపారు. దేశ జీడీపీలో తెలంగాణ వాటాను 10 శాతానికి పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్లు, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ సాధించేలా ఫ్యూచర్ సిటీని అత్యంత అధునాతనంగా నిర్మిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.
అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలతో పశ్చిమాసియా దద్దరిల్లుతుండగా, యూఎస్ సెంట్రల్ కమాండ్ ఇరాన్పై ఏడు గంటల పాటు ఏకధాటిగా దాడులు చేసింది. మంగళవారం రాత్రి ప్రారంభమైన ఈ దాడుల్లో హర్మూజ్ జలసంధి, ఇరాన్ తీరప్రాంతాల్లోని కీలక సైనిక లక్ష్యాలను అమెరికా విజయవంతంగా ఢీకొట్టింది. ప్రస్తుతానికి ఈ తాజా విడత దాడులు ముగిసినట్లు సైన్యం ప్రకటించినప్పటికీ, ఈ పరిణామాలు పశ్చిమాసియాలో తీవ్ర ఉత్కంఠను రేపుతున్నాయి.
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇరాన్కు మరోసారి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. తక్షణమే చర్చల టేబుల్ ముందుకు వచ్చి శాంతి ఒప్పందం చేసుకోవాలని స్పష్టం చేశారు. లేనిపక్షంలో, వచ్చే వారం నుండే ఇరాన్లోని కీలకమైన విద్యుత్ కేంద్రాలు, వంతెనలు, ప్రధాన ఎనర్జీ టార్గెట్లను అమెరికా సైన్యం పూర్తిగా ధ్వంసం చేస్తుందని హెచ్చరించారు. ఈ తాజా అల్టిమేటంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రస్థాయికి చేరాయి.
ఆస్తి వేలం వివాదంలో ప్రముఖ నిర్మాత బండ్ల గణేశ్ యూనియన్ బ్యాంకు చర్యలను సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వన్ టైమ్ సెటిల్మెంట్ కింద ఇప్పటికే రూ.71.44 కోట్లతో కలిపి మొత్తం రూ.129.02 కోట్లను బ్యాంకు వసూలు చేసిందని ఆయన తన పిటిషన్లో పేర్కొన్నారు. బకాయిలన్నీ పూర్తిగా తీరిపోయిన తర్వాత కూడా బ్యాంకు అక్రమంగా తన ఆస్తిని వేలం వేసిందని ఆయన న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు.
తమిళనాడు ముఖ్యమంత్రి, కథానాయకుడు విజయ్ నటించిన చివరి చిత్రం ‘జన నాయగన్’ విడుదల తేదీ ఖరారైంది. ‘పోరాటం ఎంత కఠినంగా ఉంటే.. విజయం అంత ఘనంగా ఉంటుంది’ అనే నినాదంతో ఈ చిత్రాన్ని జులై 23న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. విజయ్ నటించిన ఈ ప్రతిష్టాత్మక ఆఖరి చిత్రం థియేటర్లలోకి రానుండటంతో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో అభిమానుల కోలాహలం నెలకొంది.













