Last Updated:
Trainee IPS Case: సామాజిక మాధ్యమాలు కేవలం పరిచయాలకే కాదు, సరిగ్గా వినియోగించకపోతే ఎంతటి ఆపదలకు దారితీస్తాయో నిరూపించే ఘటన ఇది. సివిల్ సర్వీసెస్ సాధించి, ఉన్నతమైన పోలీస్ అధికారి స్థానంలో నిలవాల్సిన ఓ ట్రైనీ ఐపీఎస్ అధికారి దారి తప్పాడు.
తోటి మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిణిని వేధించిన కేసులో ఐపీఎస్ శిక్షణ పొందుతున్న ఉదయ్ కృష్ణారెడ్డి (33)ని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ఈనాడు కథనం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం ఊళ్లపాలెం గ్రామానికి చెందిన ఉదయ్ కృష్ణారెడ్డి గతేడాది డిసెంబరు నుంచి హైదరాబాద్లోని సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీ (ఎన్పీఏ)లో ఐపీఎస్ శిక్షణ పొందుతున్నాడు. గతేడాది మధ్యలో ఇన్స్టాగ్రామ్ ద్వారా ఒక మహిళ అతడికి పరిచయమైంది. సివిల్స్ సాధించడానికి ఉదయ్ పడిన శ్రమను తెలుసుకున్న సదరు మహిళ అతడిని అభినందిస్తూ మెసేజ్ చేసింది. తాను 2024 బ్యాచ్ ఐపీఎస్కు ఎంపికయ్యానని, సెలవులో ఉన్నందున 2025 బ్యాచ్తో కలిసి శిక్షణలో చేరనున్నట్లు సదరు మహిళ తెలపడంతో ఇద్దరి మధ్య స్నేహం మొదలైంది. శిక్షణ కాలంలో ఈ పరిచయం కాస్తా మరింత బలపడింది.
కొంతకాలం బాగానే ఉన్నప్పటికీ, వీరి మధ్య మనస్పర్థలు రావడంతో గొడవలు ప్రారంభమయ్యాయి. సదరు మహిళ తన నుంచి దూరంగా ఉండటాన్ని భరించలేకపోయిన ఉదయ్ కృష్ణారెడ్డి.. తీవ్రస్థాయిలో ఆగ్రహానికి గురయ్యాడు. తాను ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడమే కాకుండా, ఆయుధాలు చూపి ఆమెను భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నం చేశాడు. సదరు మహిళా అధికారిణిపై అసత్య ప్రచారాలు చేస్తూ ఆమె వ్యక్తిత్వాన్ని, గౌరవాన్ని భంగపరిచేలా ప్రవర్తించాడు. ఇతడి చేష్టలు భరించలేక సదరు మహిళ మరొకరిని వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత కూడా ఉదయ్ వైఖరిలో మార్పు రాలేదు. సోషల్ మీడియా వేదికగా మరింతగా మానసిక వేధింపులకు గురిచేయడం మొదలుపెట్టాడు.
వేధింపులు భరించలేని బాధితురాలు ఈ నెల 18న అత్తాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. విచారణలో భాగంగా బుధవారం ఉదయం ఇన్స్పెక్టర్ సీతయ్య బృందం నిందితుడిని అశోక్నగర్లోని అతడి పూర్వ నివాసానికి తీసుకెళ్లి సీన్ రీ-కన్స్ట్రక్షన్ నిర్వహించింది.
దర్యాప్తు అనంతరం ఉదయ్ కృష్ణారెడ్డిని ఉప్పర్పల్లి కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం అతనికి 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు నిందితుడిని చంచల్గూడ జైలుకు తరలించారు. ఈ విషయాన్ని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ అధికారిక ప్రకటన ద్వారా వెల్లడించారు.
తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ ఉదయ్ కృష్ణారెడ్డి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన జస్టిస్ జె.శ్రీనివాసరావు.. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు, ప్రైవేటు ప్రతివాది అయిన మహిళా ట్రైనీ ఐపీఎస్కు వ్యక్తిగత నోటీసులు జారీ చేశారు. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ కేసు విచారణను ఆగస్టు 26వ తేదీకి వాయిదా వేశారు. లా అండ్ ఆర్డర్ కాపాడాల్సిన వ్యక్తే ఇలాంటి నేరారోపణల్లో అరెస్ట్ కావడం పోలీస్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Hyderabad,Telangana














