ఈ సందర్భంగా హైదరాబాద్లోని ప్రసాద్ ల్యాబ్స్లో ప్రీ రిలీజ్ వేడుక ఘనంగా జరిగింది. తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ముఖ్య అతిథిగా హాజరై చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. దర్శకుడు దశరథ్, చిత్ర విజయాన్ని ఆకాంక్షించారు.
“చిన్న సినిమాలకు మా పార్టీ అండగా ఉంటుంది” – కల్వకుంట్ల కవిత: తెలంగాణలో సాధారణంగా ‘తాలూకా’ అనే పదాన్ని వాడరు. మొదటిసారి ఈ పేరు విన్నప్పుడు కొంత భిన్నంగా అనిపించినా, తెలుగు ప్రజలంతా ఎప్పుడూ కలిసి ఉండాలనేదే మా ఆకాంక్ష అంటూనే.. ఫోక్ సింగర్ కోమలి ఎంతో కష్టపడి ఈ చిత్రాన్ని నిర్మించారని ప్రశంసించారు కవిత. సినిమా ఘనవిజయం సాధించాలని ఆకాంక్షిస్తూ, చిన్న సినిమాలకు ప్రభుత్వం ప్రత్యేక రాయితీలు కల్పించాలని సూచించారు. తెలంగాణలో చిన్న సినిమాల అభివృద్ధికి తమ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. తెలుగు సినిమాల మాదిరిగానే తెలుగు ప్రజలు కూడా ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు.
తెలుగు భాషను కాపాడుకోవాలి!
రాష్ట్రాలుగా విడిపోయినా… మనం మాత్రం కలిసే ఉండాలి.
“తాలుకా” అనే పదాన్ని మేం తెలంగాణలో వాడం. Venkatramaiah Gari Taluka మూవీ ఈవెంట్ లో కవిత. pic.twitter.com/G42y8K1FDg
— M9 NEWS (@M9News_) July 13, 2026
“కుటుంబ భావోద్వేగాలతో కూడిన అద్భుతమైన సినిమా” – దర్శకుడు దశరథ్
దర్శకుడు దశరథ్ మాట్లాడుతూ, కోమలి ఎంతో అంకితభావంతో ఈ చిత్రాన్ని నిర్మించారని అన్నారు. కుటుంబ బంధాలు, భావోద్వేగాలతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటుందని, బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవాలని ఆకాంక్షించారు.
మానవ సంబంధాల విలువను గుర్తు చేసే కథ:
ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలకు ప్రేక్షకులతో పాటు సినీ వర్గాల నుంచి విశేష స్పందన లభించింది. మానవ సంబంధాలు, తల్లిదండ్రుల విలువ, కుటుంబ బంధాలు, తండ్రి-పిల్లల అనుబంధం వంటి అంశాలను హృద్యంగా ఆవిష్కరించిన ఈ చిత్రం ప్రతి కుటుంబాన్ని ఆలోచింపజేసేలా ఉంటుందని చిత్రబృందం తెలిపింది. ప్రస్తుతం డబ్బు చుట్టూ తిరుగుతున్న సమాజంలో వృద్ధాప్యంలో తల్లిదండ్రులు ఎదుర్కొంటున్న సమస్యలను హృదయానికి హత్తుకునే విధంగా ఈ చిత్రంలో చూపించినట్లు పేర్కొన్నారు.
“గ్లిజరిన్ లేకుండానే కన్నీళ్లు వచ్చాయి” – మురళీధర్ గౌడ్: తన సినీ జీవితంలో ఎంతో కాలంగా చేయాలనుకున్న పాత్ర ఈ చిత్రంలో లభించిందన్నారు. “డీజే టిల్లు” తర్వాత తనకు అత్యంత సంతృప్తినిచ్చిన పాత్ర ఇదేనని చెప్పారు. వెంకట్రామయ్య పాత్రలో నటిస్తున్నప్పుడు గ్లిజరిన్ అవసరం లేకుండానే భావోద్వేగంతో కన్నీళ్లు వచ్చాయని తెలిపారు. ఈ సినిమా ప్రతి ఒక్కరి గుండెను తాకుతుందని, మానవ సంబంధాల విలువను గుర్తు చేస్తుందని అన్నారు.
“ఇది ఒక ఆడబిడ్డ కన్నీటి కథ” – నిర్మాత కోమలి మహేందర్ తొట్టె:
నిర్మాత కోమలి మహేందర్ తొట్టె మాట్లాడుతూ, ఇది తన నిజ జీవిత అనుభవాల ఆధారంగా రూపొందించిన చిత్రమని తెలిపారు. “ఇది ఒక ఆడబిడ్డ కన్నీటి కథ. నా జీవితంలో ఎదురైన అనుభవాలను ఈ చిత్రంగా మలిచాను. నా భర్త సహకారం, మా గ్రామ ప్రజల ప్రోత్సాహంతో ఈ సినిమా నిర్మించగలిగాను. ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ ఈ చిత్రాన్ని పూర్తి చేశాం. సినిమా చూస్తున్నంతసేపు కంటతడి పెట్టకుండా ఎవరూ బయటకు రారని నమ్ముతున్నాను. నన్ను జానపద గాయనిగా ప్రోత్సహించిన మానుకోట ప్రసాద్ గారికి జీవితాంతం రుణపడి ఉంటాను. జూలై 17న ప్రతి ఒక్కరూ థియేటర్లకు వచ్చి మా సినిమాను చూసి ఆశీర్వదించాలి” అని కోరారు.
“ప్రతి కుటుంబంలో జరిగే కథ” – సీనియర్ నటి సుధ:
సీనియర్ నటి సుధ మాట్లాడుతూ, కోమలి ఒక మహిళగా ఎన్నో కష్టాలు భరిస్తూ తన సొంత సంపాదనతో సినిమా నిర్మించడం గొప్ప విషయమన్నారు. ప్రతి కుటుంబంలో జరిగే కథను ఈ సినిమాలో చూపించారని, ప్రేక్షకులు తప్పకుండా తమ జీవితాన్ని ఇందులో చూసుకుంటారని తెలిపారు. కొత్త నిర్మాతగా కోమలి చేసిన ప్రయత్నాన్ని ఆదరించాలని కోరారు.
“పెద్దలకు గౌరవం ఇవ్వాలనే సందేశం” – దర్శకుడు సతీష్ ఆవాల:
దర్శకుడు సతీష్ ఆవాల మాట్లాడుతూ, భారతీయ సంస్కృతిలో పెద్దలకు గౌరవం ఇవ్వడం గొప్ప సంప్రదాయమని, కుటుంబాల్లో తలెత్తే సమస్యలను ఎలా ఎదుర్కోవాలో ఈ చిత్రం చూపిస్తుందని అన్నారు. తాను జర్నలిజం నుంచి వచ్చిన వ్యక్తినని, కుటుంబ బంధాల విలువ బాగా తెలుసని చెప్పారు. సోషల్ మీడియాలో దివిజ వీడియోలు చూసి ఈ పాత్రకు ఆమె సరిపోతుందని భావించి ఈటీవీ ప్రభాకర్ను సంప్రదించినట్లు తెలిపారు. మురళీధర్ గౌడ్, సుధ సహా ప్రతి నటుడు ప్రాణం పెట్టి నటించడంతో సినిమా అద్భుతంగా వచ్చిందన్నారు.
“ఆరు పాటలు ప్రేక్షకుల హృదయాలను తాకుతాయి” – చరణ్ అర్జున్:
సంగీత దర్శకుడు చరణ్ అర్జున్ మాట్లాడుతూ, జానపద గాయని కోమలి నిర్మాతగా సినిమా నిర్మించడం ఆనందంగా ఉందన్నారు. ఆమె పట్టుదల గొప్పదని కొనియాడుతూ, ఈ చిత్రంలోని ఆరు పాటలు ప్రేక్షకుల హృదయాలను తాకుతాయని తెలిపారు.
“హార్ట్ టచ్ చేసే సినిమా” – హీరో దినేష్ కుమార్:
హీరో దినేష్ కుమార్ మాట్లాడుతూ, చిన్న గ్రామం నుంచి వచ్చిన కోమలి ఈ స్థాయి సినిమా నిర్మించడం స్ఫూర్తిదాయకమన్నారు. ప్రతి ప్రేక్షకుడి హృదయాన్ని తాకే కథతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే అంశాలు ఇందులో ఉన్నాయని తెలిపారు.
“అందరికీ నచ్చే కథ” – హీరోయిన్ దివిజ ప్రభాకర్:
హీరోయిన్ దివిజ ప్రభాకర్ మాట్లాడుతూ, ఈ చిత్ర కథ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుందని అన్నారు. యూనిట్ సభ్యులంతా ఎంతో అంకితభావంతో పనిచేశారని, నిర్మాత కోమలి ఎంతో కష్టపడి ఈ చిత్రాన్ని నిర్మించారని తెలిపారు. జూలై 17న థియేటర్లలో సినిమా చూసి ప్రేక్షకులు ఆదరించాలని కోరారు.
“స్టోరీ విన్న వెంటనే ఏడ్చేశాను” – జబర్దస్త్ సత్యశ్రీ:
నటి జబర్దస్త్ సత్యశ్రీ మాట్లాడుతూ, తన పాత్ర, కథ విన్న వెంటనే భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నానని చెప్పారు. అవకాశం ఇచ్చిన దర్శకుడు, నిర్మాతలకు ధన్యవాదాలు తెలుపుతూ, సినిమా ఖచ్చితంగా విజయం సాధిస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. చిత్ర యూనిట్ సభ్యులు మాట్లాడుతూ, మంచి కథ ఎప్పటికీ ప్రేక్షకులను కదిలిస్తుందని, జూలై 17న థియేటర్లలో విడుదల కానున్న “వెంకట్రామయ్య గారి తాలూకా”ను కుటుంబ సమేతంగా చూసి ఆదరించాలని విజ్ఞప్తి చేశారు.













