హైదరాబాద్‌లో భారీ డ్రగ్స్ దందా బట్టబయలు.. రూ.26 లక్షల గంజాయి స్వాధీనం..! | తెలంగాణ వార్తలు | ACTPnews

News18


Last Updated:

హైదరాబాద్ నగరంలో మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. తాజాగా గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో మాదాపూర్ స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ (SOT), గచ్చిబౌలి పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్‌లో భారీ మొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

News18
News18

హైదరాబాద్ నగరంలో మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. తాజాగా గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో మాదాపూర్ స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ (SOT), గచ్చిబౌలి పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్‌లో భారీ మొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్‌లో రూ.26 లక్షల విలువైన 26 కిలోల గంజాయిని పట్టుకోవడంతో పాటు ఒక ఆటో డ్రైవర్‌ను అరెస్ట్ చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నానక్‌రామ్‌గూడ ప్రాంతంలో గంజాయి అక్రమ రవాణా జరుగుతోందనే విశ్వసనీయ సమాచారం అందడంతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఓ ఆటోను గుర్తించిన పోలీసులు తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో ఆటోలో దాచిపెట్టిన 26 కిలోల గంజాయి బయటపడింది. వెంటనే మత్తు పదార్థాన్ని స్వాధీనం చేసుకుని ఆటో డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

అరెస్టైన నిందితుడిని విచారించగా, అతడు నగరంలో గంజాయి అక్రమ వ్యాపారంతో సంబంధాలు ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ముఖ్యంగా గంజాయి డాన్‌గా పేరుగాంచిన నీతు భాయ్‌కు అతడు అనుచరుడిగా పనిచేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. గత కొంతకాలంగా నగరంలోని వివిధ ప్రాంతాలకు గంజాయి సరఫరాలో అతడు కీలక పాత్ర పోషిస్తున్నాడని పోలీసులు అనుమానిస్తున్నారు.

ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న నీతు భాయ్ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు సమాచారం. అతడిని పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. అతడి కదలికలపై నిఘా ఉంచడంతో పాటు నగరంలో అతనికి సంబంధించిన నెట్‌వర్క్‌ను ఛేదించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. త్వరలోనే అతడిని అరెస్ట్ చేస్తామని పోలీసులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

స్వాధీనం చేసుకున్న గంజాయి, ఆటోతో పాటు ఇతర ఆధారాలను తదుపరి దర్యాప్తు కోసం గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. గంజాయి ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎవరికి సరఫరా చేయాలనుకున్నారు, ఈ నెట్‌వర్క్ వెనుక మరెవరు ఉన్నారు అనే అంశాలపై లోతుగా విచారణ కొనసాగుతోంది. అలాగే రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలు, పొరుగు రాష్ట్రాలతో ఈ ముఠాకు ఏమైనా సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇటీవల హైదరాబాద్ నగరంలో మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టేందుకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. వరుస దాడులు నిర్వహిస్తూ మత్తు పదార్థాల సరఫరా గొలుసును విచ్ఛిన్నం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జరిగిన తాజా పట్టివేత నగరంలో మాదకద్రవ్యాల వ్యాపారంపై మరో పెద్ద దెబ్బగా భావిస్తున్నారు.

గంజాయి, ఇతర మాదకద్రవ్యాల అక్రమ రవాణా మరియు విక్రయాలపై కఠిన చర్యలు కొనసాగుతాయని పోలీసులు స్పష్టం చేశారు. యువతను మత్తు పదార్థాల బారిన పడకుండా కాపాడటమే లక్ష్యంగా ప్రత్యేక ఆపరేషన్లు నిర్వహిస్తున్నామని తెలిపారు. మాదకద్రవ్యాల వ్యాపారంలో పాల్గొనే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని, ఎవరినీ ఉపేక్షించబోమని హెచ్చరించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *