Last Updated:
కర్నూలులో మొదలై ఆఫ్రికా దాకా.. సంచలనం సృష్టిస్తున్న ఈ తెలుగు విత్తనాల కంపెనీ గురించి తెలిస్తే అవాక్కవ్వాల్సిందే!
వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు సృష్టిస్తూ, నాణ్యమైన విత్తనాలతో రైతన్నల జీవితాల్లో సిరులు పండిస్తున్న శ్రీరామ అగ్రి జెనెటిక్స్ (ఎస్ఆర్ఎస్ గ్రూప్) సంస్థ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. బేగంపేటలోని మేరిగోల్డ్ హోటల్ వేదికగా అత్యంత అట్టహాసంగా జరిగిన రెండవ ఇండియా-ఆఫ్రికా సీడ్ సమ్మిట్-2026లో ఈ సంస్థకు ప్రతిష్టాత్మక ‘క్వాలిటీ స్టాండర్డ్స్ అవార్డు’ వరించింది. తెలంగాణ రాష్ట్ర గౌరవ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా చేతుల మీదుగా ఎస్ఆర్ఎస్ గ్రూప్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ చుండూరి రాంబాబు ఈ విశిష్ట పురస్కారాన్ని సగర్వంగా అందుకున్నారు. నాణ్యతలో ఎక్కడా రాజీపడని సంస్థ అంకితభావానికి, నిరంతర పరిశ్రమకు దక్కిన అసలైన గ్లోబల్ గుర్తింపుగా ఈ పురస్కారం నిలిచింది.
భారతదేశానికి చెందిన ఇండియన్ ఛాంబర్ ఆఫ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ (ఐసీఎఫ్ఏ), ఆఫ్రికన్ సీడ్ ట్రేడ్ అసోసియేషన్, నేషనల్ సీడ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, ఇక్రిశాట్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఈ అంతర్జాతీయ సదస్సును ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు. “భారత్, ఆఫ్రికాలకు విత్తన పరిష్కారాలు: ఆహార భద్రతకై భాగస్వామ్యాల పెంపు” అనే ప్రధాన ఇతివృత్తంతో ప్రపంచ స్థాయి నిపుణులు ఈ సదస్సులో పాల్గొని భవిష్యత్ ప్రణాళికలు చర్చించారు. గత 28 ఏళ్లుగా వ్యవసాయ ఆవిష్కరణల్లో ఎస్ఆర్ఎస్ గ్రూప్ కనబరుస్తున్న అద్భుతమైన ప్రతిభను, పనితీరును గమనించిన జ్యూరీ సభ్యులు ఈ పురస్కారానికి సంస్థను ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. దేశీయ అధునాతన విత్తన సాంకేతికతను ఆఫ్రికా వ్యవసాయ రంగానికి పరిచయం చేయాలనే సదస్సు ప్రధాన లక్ష్యానికి ఈ సంస్థ అడుగులు సరిగ్గా సరిపోతాయని నిర్వాహకులు కొనియాడారు.

కేంద్ర ప్రభుత్వ గుర్తింపు పొందిన డీఎస్ఐఆర్ (DSIR) పరిశోధనా కేంద్రం, ఎన్ఏబీఎల్ (NABL) అక్రిడిటేషన్ కలిగిన అత్యాధునిక టెస్టింగ్ ల్యాబ్ల దన్నుతో శ్రీరామ అగ్రి జెనెటిక్స్ నిరంతరం కొత్త వంగడాలను సృష్టిస్తోంది. తీవ్రంగా మారుతున్న వాతావరణ పరిస్థితులను తట్టుకుంటూ, రైతులకు లాభాలు కురిపించే హైబ్రిడ్ విత్తన సాంకేతికతలను అభివృద్ధి చేయడంలో ఈ సంస్థ ముందువరుసలో ఉంది. భారతదేశం అంతటా బలమైన నెట్వర్క్ కలిగి ఉన్న ఈ గ్రూప్.. ఆసియాతో పాటు ఆఫ్రికా ఖండానికీ వేగంగా సేవలను విస్తరిస్తోంది. ప్రధానంగా మొక్కజొన్న, పొద్దుతిరుగుడు, జొన్న, సజ్జ, పత్తి, వివిధ రకాల కూరగాయల విత్తనాల పరిశోధన, ఉత్పత్తి, మార్కెటింగ్ విభాగాల్లో ఈ సంస్థ అగ్రగామిగా కొనసాగుతూ అంతర్జాతీయ స్థాయిలో బలమైన ముద్ర వేస్తోంది.
ఈ అంతర్జాతీయ పురస్కారాన్ని స్వీకరించిన అనంతరం సంస్థ సీఎండీ శ్రీ చుండూరి రాంబాబు ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. ఇండియా-ఆఫ్రికా సీడ్ సమ్మిట్ లాంటి గ్లోబల్ ప్లాట్ఫామ్పై క్వాలిటీ స్టాండర్డ్స్ అవార్డును అందుకోవడం మొత్తం ఎస్ఆర్ఎస్ కుటుంబానికి ఎంతో గర్వకారణమని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. విభిన్న రకాల వ్యవసాయ వాతావరణ పరిస్థితుల్లో సైతం పంట దిగుబడిని పెంచేందుకు తాము చేస్తున్న కృషికి ఈ అవార్డు గొప్ప గుర్తింపునిచ్చిందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉన్న తమ పరిశోధనా కేంద్రాల నుంచి ఆఫ్రికా ఖండం వరకు అప్రతిహతంగా ప్రయాణం సాగుతోందని గుర్తుచేశారు. వాతావరణ మార్పులను దీటుగా ఎదుర్కొంటూ అత్యధిక దిగుబడినిచ్చే అత్యుత్తమ నాణ్యమైన విత్తనాలను రైతులకు అందించడమే తమ ప్రథమ లక్ష్యమని రాంబాబు స్పష్టం చేశారు.

శ్రీరామ అగ్రి జెనెటిక్స్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ ప్రస్థానం కర్నూలు నగరంలో ఘనంగా మొదలైంది. చుండూరి శ్రీరామమూర్తి గారి చేతుల మీదుగా 1996లో ఏర్పాటైన ఈ సంస్థ 28 వసంతాలుగా విత్తన రంగంలో ఎనలేని సేవలు అందిస్తోంది. జన్యుపరంగా మెరుగుపరిచిన, అత్యధిక దిగుబడినిచ్చే హైబ్రిడ్ విత్తనాలను లక్షలాది మంది రైతులకు చేరువ చేస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్త్రృతమైన పరిశోధన, ప్రాసెసింగ్, టెస్టింగ్ మౌలిక సదుపాయాలను నెలకొల్పి నిరంతరం నాణ్యమైన విత్తనాలను సరఫరా చేస్తోంది. కేవలం దేశీయ మార్కెట్లను మాత్రమే కాకుండా అంతర్జాతీయ మార్కెట్లను లక్ష్యంగా చేసుకుని, ప్రపంచ ఆహార భద్రతకు విశేషంగా సహకరిస్తూ సుస్థిర వ్యవసాయ విధానాలకు బాటలు వేస్తోంది.














