కాణిపాకం ఆలయంలో ఏం జరుగుతోంది..? సీఎంకు భక్తుడి సంచలన ఫిర్యాదు! | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews

News18


Last Updated:

చిత్తూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకస్వామి దేవస్థాన నిర్వహణపై ఓ భక్తుడు చేసిన ఫిర్యాదు ప్రస్తుతం భక్తుల మధ్య చర్చనీయాంశంగా మారింది.

+

News18

చిత్తూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకస్వామి దేవస్థాన నిర్వహణపై ఓ భక్తుడు చేసిన ఫిర్యాదు ప్రస్తుతం భక్తుల మధ్య చర్చనీయాంశంగా మారింది. ఆలయంలో వైదిక కార్యక్రమాల నిర్వహణ, అర్చకుల విధుల నిర్వహణ తీరు, పరిశుభ్రత వంటి అంశాల్లో లోపాలు ఉన్నాయని ఆరోపిస్తూ రాజమండ్రికి చెందిన టి. వెంకటేశ్వరరావు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, దేవాదాయ శాఖ మంత్రి, సంబంధిత ఉన్నతాధికారులు, కాణిపాకం దేవస్థానం కార్యనిర్వహణాధికారి తదితరులకు ఈ ఫిర్యాదు ప్రతులను పంపినట్లు సమాచారం.

తాను ప్రతి ఏడాది కాణిపాకం ఆలయాన్ని సందర్శించి స్వామివారి దర్శనం చేసుకోవడంతో పాటు వివిధ సేవల్లో పాల్గొంటానని వెంకటేశ్వరరావు తన లేఖలో పేర్కొన్నారు. అయితే ఈ ఏడాది ఆలయ సందర్శన సందర్భంగా కొన్ని అంశాలు తనను తీవ్రంగా కలచివేశాయని తెలిపారు. ముఖ్యంగా ఆలయంలో నిర్వహించే వైదిక కార్యక్రమాలు నిర్ణీత సమయాల్లో జరగకపోవడం, కొన్ని సేవల నిర్వహణలో నిర్లక్ష్యం కనిపించడం తనను నిరాశకు గురి చేసిందని పేర్కొన్నారు.

అభిషేకం, అర్చన, ఉయ్యాల సేవ, ఏకాంత సేవ వంటి ముఖ్యమైన ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఆలస్యంగా నిర్వహిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ కారణంగా దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఆలయ సంప్రదాయాలు, ఆగమ శాస్త్ర నియమాలకు అనుగుణంగా కార్యక్రమాలు ఖచ్చితమైన సమయపాలనతో నిర్వహించాల్సిన అవసరం ఉందని సూచించారు.

అలాగే కొందరు వైదిక సిబ్బంది విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు తన పరిశీలనలో గమనించానని తెలిపారు. కొన్నిచోట్ల అర్చకుల స్థానంలో అనధికార వ్యక్తులు కొన్ని సేవలను నిర్వహిస్తున్నట్లు కనిపించిందని ఆరోపించారు. ఇలాంటి పరిస్థితులు ఆలయ సంప్రదాయాలకు విరుద్ధమని, వాటిపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

వైదిక సిబ్బంది వస్త్రధారణ, సంప్రదాయ నియమాల పాటింపు విషయంలో కూడా కొన్ని లోపాలు కనిపించాయని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆలయ పవిత్రతను కాపాడే విషయంలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని సూచించారు. ముఖ్యంగా భక్తులకు ఆదర్శంగా ఉండాల్సిన సిబ్బంది సంప్రదాయాలకు అనుగుణంగా వ్యవహరించాలని కోరారు.

ఇక ఆలయ పరిశుభ్రత అంశంపైనా వెంకటేశ్వరరావు ఆందోళన వ్యక్తం చేశారు. గర్భగుడి పరిసర ప్రాంతాల్లో తగిన స్థాయిలో శుభ్రత కనిపించలేదని, కొన్ని ప్రాంతాల్లో దుర్వాసన వస్తోందని ఆయన పేర్కొన్నారు. పూల అవశేషాలు, ఇతర వ్యర్థ పదార్థాలు పేరుకుపోయినట్లు గమనించానని తెలిపారు. దేశవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు దర్శించుకునే ప్రముఖ దేవాలయంగా కాణిపాకం గుర్తింపు పొందిన నేపథ్యంలో పరిశుభ్రత విషయంలో మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

ఆలయ ప్రతిష్ఠకు ఎలాంటి భంగం కలగకుండా సంబంధిత అధికారులు ఈ అంశాలపై సమగ్ర విచారణ చేపట్టాలని ఆయన కోరారు. ఫిర్యాదులో పేర్కొన్న ఆరోపణలపై వాస్తవ పరిస్థితులను పరిశీలించి అవసరమైతే తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. భక్తుల విశ్వాసాలను పరిరక్షించడం దేవస్థాన యంత్రాంగం ప్రధాన బాధ్యత అని పేర్కొన్నారు.

కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకస్వామి దేవస్థానం రాష్ట్రంలోని అత్యంత ప్రసిద్ధ గణపతి క్షేత్రాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు ఇక్కడికి తరలివస్తుంటారు. ఈ నేపథ్యంలో ఆలయ నిర్వహణపై వచ్చిన ఆరోపణలు భక్తుల్లో చర్చకు దారితీశాయి. అధికారుల స్పందన, విచారణ అనంతరం ఈ ఆరోపణలపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని భక్తులు భావిస్తున్నారు.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *