Last Updated:
పార్లమెంటు ఆవరణలో సనాతన ధర్మాన్ని, సాధువులను అవమానించేలా నిరసన తెలిపారన్న ఆరోపణలతో లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, మరో ఇద్దరు ఎంపీలపై వారణాసి పోలీసులు కేసు నమోదు చేశారు. రామమందిర విరాళాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా వీరు చేసిన ఒక స్కిట్ వివాదాస్పదమైంది.
పార్లమెంటు ఆవరణలో ‘సనాతన ధర్మాన్ని, మతపరమైన మనోభావాలను దెబ్బతీసేలా’ ప్రవర్తించారన్న ఆరోపణలతో లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సహా ముగ్గురు నేతలపై ఉత్తరప్రదేశ్ పోలీసులు కేసు నమోదు చేశారు. రాహుల్ గాంధీతో పాటు బీహార్కు చెందిన స్వతంత్ర ఎంపీ రాజేష్ రంజన్ (పప్పు యాదవ్), సమాజ్వాదీ పార్టీ ఫైజాబాద్ ఎంపీ అవధేష్ ప్రసాద్లపై వారణాసిలోని కొత్వాలి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైనట్లు న్యూస్18 ఇంగ్లీష్ కథనం పేర్కొంది. భారతీయ న్యాయ సంహిత (BNS) చట్టం కింద వీరిపై కేసులు పెట్టినట్లు వారణాసి పోలీసులు శనివారం ధృవీకరించారు.
అయోధ్యలోని రామమందిరానికి వచ్చిన విరాళాలను కొందరు స్వామీజీలు దుర్వినియోగం చేస్తున్నారంటూ ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి నేతలు శుక్రవారం పార్లమెంటు ఆవరణలో ఒక నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ క్రమంలో పార్లమెంట్ మకర్ ద్వార్ మెట్ల వద్ద విరాళాల పెట్టెలను ఉంచి వినూత్నంగా నిరసన తెలిపారు. రాహుల్ గాంధీతో సహా పలువురు ఎంపీలు అందులో డబ్బులు వేస్తుండగా, కాషాయ దుస్తులు ధరించి పూజారి వేషంలో ఉన్న పప్పు యాదవ్ ఆ డబ్బును దొంగిలిస్తున్నట్లుగా ఒక ‘స్కిట్’ చేశారు. ఈ నిరసనలో ఎంపీ అవధేష్ ప్రసాద్ కూడా పాల్గొన్నారు. ఈ విధంగా కాషాయ దుస్తులను, సాధువుల సంప్రదాయాన్ని అవహేళన చేశారంటూ పాతాళపురి మఠాధిపతి జగద్గురు బాలక్ దాస్ తదితరులు వారణాసి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
రాహుల్ గాంధీ, పప్పు యాదవ్ చేసిన ఈ ప్రదర్శన హిందూ సాధువుల సంప్రదాయాన్ని, శ్రీరాముడిని కించపరిచేలా ఉందని ఫిర్యాదుదారులు మండిపడ్డారు. సనాతన ధర్మాన్ని పాటించే ఎవరూ ఈ చర్యను క్షమించరని జగద్గురు బాలక్ దాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు ఢిల్లీలోనూ బీజేపీ నాయకులు ఈ ఘటనపై పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ అంశం ఇప్పుడు రాజకీయంగా పెద్ద దుమారం రేపుతోంది. కాగా, ఇదే నిరసనలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని విపక్షాలు డిమాండ్ చేశాయి.
బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana
Aug 01, 2026 11:00 PM IST














