ఆలయంలో ఎలా నిర్వహించారు?సంప్రదాయానికి అనుగుణంగా చిన్నారికి ప్రత్యేక వస్త్రాలు, కిరీటం ధరింపజేశారు. అనంతరం అనసర తాటి మార్గం గుండా మహాప్రభువు వద్దకు తీసుకెళ్లి సంప్రదాయ ప్రకారం పౌణా భేటి సమర్పింపజేశారు. తర్వాత చకటా భోగం స్వీకరింపజేసి అధికారికంగా దైతాపతి సేవకుడిగా గుర్తింపు కల్పించారు. ఈ కార్యక్రమం పూర్తిగా ఆలయ ఆచార సంప్రదాయాల ప్రకారమే నిర్వహించారు. పురీ జగన్నాథ ఆలయంలో జరిగే అన్ని సేవలను “ఛత్తీసా నియోగ్” అనే వ్యవస్థ ద్వారా నిర్వహిస్తారు. ఇందులో అనేక సేవకుల వర్గాలు ఉన్నప్పటికీ, దైతాపతి సేవకులు అత్యంత ముఖ్యమైనవారిగా భావిస్తారు. వీరిని మహాప్రభువుకు అత్యంత సన్నిహిత సేవకులుగా గౌరవిస్తారు. దేవస్నాన పౌర్ణమి తర్వాత అనసర కాలంలో స్వామివారికి జ్వరం వచ్చినట్లు భావించి నిర్వహించే వైద్య సేవలు, ఔషధ నైవేద్యాలు, గోప్య ఆచారాలు అన్నింటినీ దైతాపతి సేవకులే నిర్వహిస్తారు. అలాగే ప్రపంచ ప్రఖ్యాత రథయాత్రలో జరిగే పహండి సేవ, నవకలేబర సమయంలో జరిగే అత్యంత పవిత్రమైన బ్రహ్మ పరివర్తన వంటి గోప్యమైన క్రతువుల్లో కూడా వీరికే ప్రత్యేక బాధ్యతలు ఉంటాయి.













