Tirumala Srivani Tickets: శ్రీవాణి టిక్కెట్ల హైజాక్.. టికెట్ల బుకింగ్‌లో సాఫ్ట్‌వేర్ జిమ్మిక్కులు! | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews

తిరుమల


Last Updated:

టెక్నాలజీని అడ్డం పెట్టుకుని క్షణాల్లో టికెట్లను బుక్ చేస్తూ, భక్తుల నుంచి భారీగా అదనపు వసూళ్లకు పాల్పడుతున్న ఈ ముఠా ఉదంతం తాజాగా వెలుగులోకి వచ్చింది.

తిరుమల
తిరుమల

Tirumala Srivani Tickets: ఏడుకొండల వాడిని దర్శించుకోవాలనే భక్తుల ఆకాంక్షను కొందరు అక్రమార్కులు కాసుల వేటగా మార్చుకుంటున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘శ్రీవాణి’ (SRIVANI) ట్రస్టు టికెట్లను సాఫ్ట్‌వేర్ పరిజ్ఞానంతో హైజాక్ చేస్తూ, సామాన్య భక్తులకు అందకుండా చేస్తున్నారు. టెక్నాలజీని అడ్డం పెట్టుకుని క్షణాల్లో టికెట్లను బుక్ చేస్తూ, భక్తుల నుంచి భారీగా అదనపు వసూళ్లకు పాల్పడుతున్న ఈ ముఠా ఉదంతం తాజాగా వెలుగులోకి వచ్చింది.

హైటెక్ దోపిడీ సాగుతోందిలా..

ఈనాడు కథనం ప్రకారం.. సాధారణంగా శ్రీవాణి ట్రస్టుకు రూ.10,000 విరాళం ఇచ్చి, రూ.500 దర్శన రుసుము చెల్లించే భక్తులకు టీటీడీ బ్రేక్ దర్శన సౌకర్యం కల్పిస్తుంది. ప్రతిరోజూ ఆన్‌లైన్‌లో సుమారు 900 టికెట్లను జారీ చేస్తుండగా, వీటిని దక్కించుకోవడానికి ప్రైవేటు ట్రావెల్స్ ఏజెంట్లు, నెట్ సెంటర్ల నిర్వాహకులు ‘ఆటోఫిల్లింగ్’ వంటి థర్డ్ పార్టీ సాఫ్ట్‌వేర్లను ఉపయోగిస్తున్నారు.

సాధారణ భక్తులు వెబ్‌సైట్ ఓపెన్ చేసి తమ వివరాలు నమోదు చేసేలోపే, ఈ సాఫ్ట్‌వేర్ల సాయంతో ఏజెంట్లు భక్తుల ఆధార్ వివరాలను ముందే సిద్ధం చేసుకుని క్షణాల్లో బుకింగ్ పూర్తి చేస్తున్నారు. రోజుకు సుమారు 200 నుండి 250 టికెట్లు ఇలాగే పక్కదారి పడుతున్నట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు.

చెన్నై ట్రావెల్స్ దందా వెలుగులోకి

ఈ అక్రమ వ్యవహారంపై చెన్నైకి చెందిన ఇద్దరు భక్తులు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది. చెన్నైకి చెందిన ‘పద్మావతి ట్రావెల్స్’ అనే సంస్థ శ్రీవాణి టికెట్ల పేరుతో భక్తులను మోసం చేస్తున్నట్లు తేలింది. కేవలం ఒక మెసేజ్ చేస్తే చాలు టికెట్ ఇప్పిస్తామని నమ్మబలికి, రూ.10,500 విలువైన టికెట్ కోసం భక్తుల నుండి రూ.13,500 వసూలు చేస్తున్నారు. అంటే ఒక్కో టికెట్‌పై అదనంగా రూ.3,000 వరకు దోపిడీ సాగిస్తున్నారు.

విచారణ వేగవంతం చేసిన విజిలెన్స్

ఈ వ్యవహారంపై తిరుమల టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. టికెట్ల బుకింగ్‌లో ఐటీ విభాగంలోని కొందరి సహకారం ఉందా? లేదా హ్యాకింగ్ ద్వారా డేటా చోరీ చేస్తున్నారా? అనే కోణంలో టీటీడీ విజిలెన్స్ విభాగం దర్యాప్తు చేస్తోంది. ఒకే ఐపీ అడ్రస్ లేదా ఒకే మొబైల్ నంబర్ నుండి పెద్ద ఎత్తున టికెట్లు బుక్ అవుతున్న తీరును అధికారులు పరిశీలిస్తున్నారు. ఇప్పటికే నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు చెన్నై వెళ్లగా, సదరు ట్రావెల్స్ వెబ్‌సైట్‌ను బ్లాక్‌లిస్ట్‌లో చేర్చారు.

పరిష్కార మార్గాలు

ఈ అక్రమాలకు అడ్డుకట్ట వేయడానికి నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు. టికెట్ బుక్ చేసే సమయంలోనే భక్తుల లైవ్ ఫోటోను సేకరించి, దర్శనం వద్ద ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ (Facial Recognition System) ద్వారా సరిపోల్చితే ఇలాంటి అక్రమ బుకింగ్‌లను పూర్తిగా నివారించవచ్చని అభిప్రాయపడుతున్నారు. భక్తులను మోసం చేసే ఏజెంట్లపై కఠిన చర్యలు తీసుకుంటామని టీటీడీ సీవీఎస్వో వి.వెంకట సుబ్బారెడ్డి హెచ్చరించారు.

భక్తులు కూడా ఇలాంటి ప్రైవేటు ఏజెంట్లను నమ్మి మోసపోకుండా, అధికారిక టీటీడీ వెబ్‌సైట్ ద్వారానే టికెట్లు బుక్ చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు. కల్తీ లేని భక్తికి అక్రమార్కుల నీడ పడకుండా చూడాల్సిన బాధ్యత అటు వ్యవస్థపై, ఇటు భక్తులపై ఉంది.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports