Last Updated:
రేపటి నుంచే శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. ఈరోజు రాత్రి తిరుమలలో జరిగే అసలు ఘట్టం ఇదే!
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, భక్త జన మందారుడు అయిన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు సర్వ సిద్ధమైంది. అంగరంగ వైభవంగా జరిగే ఈ ఆధ్యాత్మిక ఉత్సవాలు సెప్టెంబరు 15వ తేదీన అట్టహాసంగా ప్రారంభం కానున్నాయి. అయితే ఈ మహా క్రతువుకు ముందుగా సెప్టెంబరు 14వ తేదీ రాత్రి వైఖానస ఆగమ సంప్రదాయం ప్రకారం అంకురార్పణ ఘట్టాన్ని అత్యంత శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. ఆలయంలో పవిత్రంగా భావించే యాగశాలలో భక్తిశ్రద్ధలతో నిర్వహించే ఈ బీజవాపనంతో ఉత్సవాలకు లాంఛనంగా అంకురార్పణ జరుగుతుంది. సమస్త భూమండలమంతా సుభిక్షంగా, ఆనందంగా ఉండాలని ఆకాంక్షిస్తూ వేద పండితులు ఉచ్ఛరించే మంత్ర ఘోషల నడుమ ఈ ఘట్టాన్ని జరిపిస్తారు.














