Last Updated:
CM Revanth Reddy: ఈనెల 20న తెలంగాణ సీఎం మేడిగడ్డ పర్యటన ఫిక్సైంది.కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీలో క్షేత్రస్థాయిలో పర్యటించనున్నారు. టూర్ తర్వాత రేవంత్ రెడ్డి నస్తూర్ పల్లిలోని 40 ఎకరాల్లో వచ్చే పట్టే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గత ప్రభుత్వం చేపట్టిన అక్రమాలతో పాటు నిర్లక్ష్యంగా, నాసీరకంగా పూర్తి చేసిన నిర్మాణాలను వేలెత్తి చూపించింది. అందులో ఒకటే మేడిగడ్డ బ్యారేజ్. బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన ఈ లక్ష్మీబ్యారేజ్ కూలిపోయిందని కాంగ్రెస్ విమర్శిస్తే .. మరి మీరెందుకు మరమ్మతులు చేపట్టలేదని బీఆర్ఎస్ కౌంటర్ ఇచ్చింది. ఈపరిణామాల నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి అక్కడ ఏం జరిగిందో తెలుసుకునేందుకు పరిశీలించేందుకు ఈనెల 20న మేడిగడ్డకు వెళ్తున్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని మేడిగడ్డ వద్ద లక్ష్మీ బ్యారేజీని గత ప్రభుత్వ హయాంలో నిర్మించారు. గోదావరి నదిలోని నీటిని తాగునీరు నీటిపారుదల కోసం ఉపయోగించుకోవడమే ప్రధాన లక్ష్యంగా ఈ బ్యారేజీ నిర్మించబడింది.16.17 టీఎంసీలతో దీని పూర్తి నిలువ నీటి సామర్థ్యం ఉంది.
మేడిగడ్డ బ్యారేజ్ 2023 అక్టోబర్ నెలలో కుంగిపోయింది. ఈ బ్యారేజీలోని 7వ బ్లాక్ లో 18 నుండి 21వ పిల్లర్లు దెబ్బతినడంతో వాటిపై ఉన్న వంతెన వంగిపోయింది. ప్రాథమికంగా భారీ వరదల వల్ల పిల్లర్లు కుంగినట్లు గుర్తించారు. కానీ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదికల ప్రకారం ప్రణాళిక ఆ రూపకల్పన నాణ్యత లోపాలు ఉన్నట్లు నిపుణులు గుర్తించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు,ఎమ్మెల్యేల బృందం కుంగిన మేడిగడ్డ బ్యారేజీని గతంలో పరిశీలించింది.ఈ అంశం అప్పట్లో హాట్ టాపిక్ గా నిలిచింది. అధికార కాంగ్రెస్ నేతలు, ప్రతిపక్ష బిఆర్ఎస్ నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకున్నారు.మేడిగడ్డ బ్యారేజ్ కుంగిన ఘటనపై గతంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారు. దీనికి సాంకేతిక సమస్యగా పేర్కొంటూనే నిర్మాణ సంస్థల బాధ్యతను నొక్కి చెప్పారు. మేడిగడ్డ పునరుద్ధరణ పనులను ఆయా నిర్మాణ సంస్థలే సొంత ఖర్చులతో చేపట్టాలని అభిప్రాయపడ్డారు. ఈ అంశంపై కక్ష సాధింపు చర్యలు జరుగుతున్నాయన్నారు.
మేడిగడ్డ బ్యారేజ్ ఎగువ దిగువ భాగంలో 40 మీటర్ల లోతుతో డయాఫ్రం వాల్ నిర్మించాలని నిపుణులు నిర్ధారించారు. ఈ వాల్ నిర్మిస్తేనే బ్యారేజీ నాలుగు కాలాలపాటు ఉంటుందన్న అంచనాకు వచ్చారు. బ్యారేజీలకు తొలుత చేసిన డిజైన్ ప్రకారం షీట్ పైల్స్ ఉపయోగించాలని ఉండగా నిర్మాణం మధ్యలో సికెంట్ పైల్స్ వాడారు.దాంతో సికెంట్ ఫైల్స్ ను సరిగ్గా అమర్చుకపోవడం వల్లే బ్యారేజీ దిగువ భాగం ఇసుక జారీ మేడిగడ్డలో 12 పిల్లర్లు ఉన్న ఏడవ బ్లాకు కుంగిందని జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ నిపుణుల కమిటీ నిర్ధారించింది. కాలేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణ డిజైన్లు అందించడానికి ఎంపికైన ఆఫ్ ఫ్రీ ఇండియా సంస్థ డయాఫ్రం వాల్ ఒక్కటే బ్యారేజీని కాపాడగలదని అభిప్రాయ పడినట్లు సమాచారం భూ భౌతిక,భూ సాంకేతిక పరీక్షల అనంతరం నివేదిక అందిన తర్వాత దీని నిర్మాణం చేపట్టవచ్చని భావిస్తున్నారు.
ఈ బ్యారేజీ పునరుద్ధరణకే దాదాపు రూ.2500 కోట్ల దాకా ఖర్చవుతాయని అంచనాలు ఉన్నాయి. బ్యారేజి పునరుద్ధరణ పనులకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే ఈనెల 20న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాలేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీలో క్షేత్రస్థాయిలో పర్యటించనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ,ఎస్పి శిరిశెట్టి సంకీర్త భద్రత ఏర్పాట్లను పరిశీలించారు. 2023లో మేడిగడ్డ బ్యారేజీ లో ఏడవ బ్లాక్ లోని 20వ పిల్లర్ కుంగిపోగా వంతెనె కుంగి పగుళ్లు ఏర్పడిన విషయం తెలిసిందే. అదే సమయంలో అన్నారం సుందిళ్ల బ్యారేజీల్లో సిపేజీ లీకేజీలు ఏర్పడ్డాయి. దీంతో నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ సూచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం బ్యారేజీల్లో నీటిని నిల్వ చేయడం లేదు. వాటికి మరమ్మత్తులు చేసి పునరుద్ధరిస్తామని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇవ్వడంతో ఈ పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. ఇందులో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి క్షేత్రస్థాయిలో పర్యవేక్షించనున్నారు.
సీఎంతో పాటు ఇతర మంత్రులు మేడిగడ్డ పర్యటన తర్వాత నస్తూర్ పల్లిలోని 40 ఎకరాల్లో వచ్చే పట్టే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. సభా వేదిక,వాహనాల పార్కింగ్, సదుపాయాలు,హెలిప్యాడ్, భద్రత ఏర్పాట్లు,ప్రజలకు మౌలిక సదుపాయాలను కల్పించే దిశగ అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు.
Warangal,Telangana
Apr 17, 2026 12:10 PM IST













