Last Updated:
వేలాది మంది దేశీయ, అంతర్జాతీయ ప్రయాణికులు తిరిగే ఇటువంటి ప్రతిష్టాత్మక హబ్లో పరిశుభ్రత, భద్రతా ప్రమాణాలు ఇంత దారుణంగా ఉన్నాయా అంటూ నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Shamshabad Airport: హైదరాబాద్లోని శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA)లో చోటుచేసుకున్న ఒక విస్తుపోయే ఘటన సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. విమానాశ్రయం లోపల ప్రయాణికులు కూర్చునే ప్రాంతంలో ఒక వీధి కుక్క టేబుల్పైకి ఎక్కి, ప్లేట్లలో ఉన్న ఎంగిలి ఆహారాన్ని తింటున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. వేలాది మంది దేశీయ, అంతర్జాతీయ ప్రయాణికులు తిరిగే ఇటువంటి ప్రతిష్టాత్మక హబ్లో పరిశుభ్రత, భద్రతా ప్రమాణాలు ఇంత దారుణంగా ఉన్నాయా అంటూ నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సిరాజ్ నూరానీ అనే నెటిజన్ తన ‘ఎక్స్’ (ట్విట్టర్) ఖాతాలో ఈ వీడియోను షేర్ చేస్తూ ఎయిర్పోర్ట్ యాజమాన్యంపై మండిపడ్డారు. ఎయిర్పోర్ట్ ఫుడ్ కోర్ట్ వెలుపల ఉన్న సీటింగ్ ఏరియాలోకి ప్రవేశించిన ఒక వీధి కుక్క, అక్కడ ప్రయాణికులు వదిలేసి వెళ్లిన ట్రేలలోని ఎంగిలి ఆహారాన్ని టేబుల్పైకి ఎక్కి మరీ తింటూ కనిపించింది. పక్కనే వేరే ప్రయాణికులు కూర్చుని ఉన్నప్పటికీ, ఆ కుక్క ఎవరి భయం లేకుండా అక్కడ తిరుగుతూ తిండి తింటోంది.
“శంషాబాద్ ఎయిర్పోర్టులో టేబుల్పై కుక్క తిండి తింటోంది. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని పరిస్థితులు బయటపడ్డాయి. రెస్టారెంట్ టేబుల్పై కుక్క ఎక్కి ఎంగిలి ఆహారం తినడం చూసి ప్రయాణికులు దిగ్భ్రాంతికి గురయ్యారు. అంతర్జాతీయ విమానాశ్రయంలో పరిశుభ్రతపై ఇది తీవ్ర విమర్శలకు దారితీసింది” అని నూరానీ పేర్కొన్నారు.
You can watch in this video how a stray dog is roaming inside the passenger lounge at Rajiv Gandhi International Airport..
It has sparked outrage in passengers, raising concerns over the safety & airport hygiene standards.
This is what these Frustrated lonely Dog Scammers want.🤮 pic.twitter.com/d6q2lIpES0
— Harshit Singh (@i_m_harshitsing) May 26, 2026
ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు ఎయిర్పోర్ట్ యాజమాన్యాన్ని ఏకిపారేశారు. విమానాశ్రయం లోపలికి వీధి కుక్క ఎలా ప్రవేశించగలిగింది? అక్కడ భద్రత, పర్యవేక్షణ లోపించిందా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ వివాదంపై హైదరాబాద్ ఎయిర్పోర్ట్ అధికారులు అధికారికంగా స్పందించారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
వీధి కుక్కల నియంత్రణకు అధీకృత సంస్థ అయిన జీహెచ్ఎంసీతో కలిసి తాము ప్రత్యేక డ్రైవ్లు నిర్వహిస్తున్నామని, జనవరి 2026 నుండి ఇప్పటివరకు ఎయిర్పోర్ట్ ప్రాంగణంలో 21 వీధి కుక్కల సమస్యను పరిష్కరించామని వెల్లడించారు. ఎయిర్పోర్ట్లోని అన్ని ఫుడ్ కోర్టులు, సర్వీస్ ప్రొవైడర్లు విధిగా వ్యర్థాలను మూతలు ఉన్న డబ్బాల్లోనే పారవేయాలని కఠిన నిబంధనలు విధించినట్లు పేర్కొన్నారు. ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా ఉండేందుకు క్షేత్రస్థాయి సిబ్బందిని మరింత అప్రమత్తం చేశామని, ముందస్తు నివారణ చర్యలను చురుగ్గా అమలు చేస్తున్నామని ఎయిర్పోర్ట్ యాజమాన్యం స్పష్టం చేసింది.
Hyderabad,Telangana













