Last Updated:
ఈ సందర్భంగా ప్రస్తుతం టాలీవుడ్ చిత్ర పరిశ్రమ, ముఖ్యంగా ఎగ్జిబిటర్ల విభాగం ఎదుర్కొంటున్న పలు కీలక సమస్యలను వారు పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు.
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ నిర్మాతలు మర్యాదపూర్వకంగా మంగళవారం కలుసుకున్నారు. రాజమహేంద్రవరం పర్యటనలో ఉన్న డిప్యూటీ సీఎంతో మైత్రీ మూవీ మేకర్స్ అధినేత రవిశంకర్, నిర్మాతలు సతీష్, సూర్యదేవర నాగవంశీ (సితార ఎంటర్టైన్మెంట్స్), సాహు గారపాటి (షైన్ స్క్రీన్స్) తదితరులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రస్తుతం టాలీవుడ్ చిత్ర పరిశ్రమ, ముఖ్యంగా ఎగ్జిబిటర్ల విభాగం ఎదుర్కొంటున్న పలు కీలక సమస్యలను వారు పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు.
రాష్ట్రంలో సింగిల్ స్క్రీన్ థియేటర్ల మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని, చాలా థియేటర్లు తీవ్ర నష్టాల్లో నడుస్తున్నాయని నిర్మాతలు డిప్యూటీ సీఎంకు వివరించారు. థియేటర్ల యజమానులను ఆదుకునేందుకు ప్రభుత్వ పరంగా చొరవ చూపి, ఒక నిర్దిష్టమైన చలనచిత్ర విధానాన్ని రూపొందించాలని వారు కోరారు. మల్టీప్లెక్స్ థియేటర్ల తరహాలోనే, సినిమాల ద్వారా వచ్చే లాభాల్లో నిర్మాతల నుండి కొంత శాతం షేర్ సింగిల్ స్క్రీన్లకు కూడా దక్కేలా వీలు కల్పిస్తే అవి నిలదొక్కుకుంటాయని పవన్కు ప్రతిపాదించారు.
గత కొంతకాలంగా థియేటర్ల నిర్వహణ వ్యయం (మెయింటెనెన్స్ కాస్ట్) విపరీతంగా పెరిగిపోయిందని, నెలవారీ ఖర్చులు భరించలేని స్థాయికి చేరాయని నిర్మాతల బృందం పేర్కొంది. థియేటర్లకు ఇచ్చే కరెంట్ బిల్లులపై, విద్యుత్ చార్జీల్లో ప్రభుత్వ పరంగా కొంత రాయితీ కల్పిస్తే.. యాజమాన్యాలపై భారం గణనీయంగా తగ్గుతుందని వారు విజ్ఞప్తి చేశారు.
నిర్మాతలు సమర్పించిన వినతులను, పరిశ్రమ సమస్యలను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎంతో సానుకూలంగా విన్నారు. తెలుగు సినీ రంగ సమస్యలను పరిష్కరించే దిశగా కూటమి ప్రభుత్వం తప్పకుండా ముందడుగు వేస్తుందని ఈ సందర్భంగా ఆయన అభయమిచ్చారు. అంతేకాకుండా, నిర్మాతలు తీసుకొచ్చిన ప్రతిపాదనలను, విద్యుత్ రాయితీ అంశాలను త్వరితగతిన పరిశీలించి తగిన నివేదిక సిద్ధం చేయాల్సిందిగా రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ను పవన్ కల్యాణ్ ఫోన్ ద్వారా ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana













