Last Updated:
యూట్యూబ్ వీడియోల ప్రేరణతో హతమార్చిన ఘటన జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం రేపింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న తల్లి అరుణ, కుమారుడు సాయిరత్నంలను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
Hyderabad: సినిమా ఫక్కీలో హత్య చేసి, ఆధారాలు దొరకకుండా తప్పించుకోవచ్చని భావించిన తల్లీకొడుకుల ప్లాన్ రివర్స్ అయింది. మద్యం తాగి వేధిస్తున్నాడనే కోపంతో, అడ్డుగా ఉన్న వ్యక్తిని యూట్యూబ్ వీడియోల ప్రేరణతో హతమార్చిన ఘటన జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం రేపింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న తల్లి అరుణ, కుమారుడు సాయిరత్నంలను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
ఈనాడు కథనం ప్రకారం.. సంగారెడ్డి జిల్లాకు చెందిన అరుణ అనే మహిళకు గతంలోనే వివాహం కాగా, భర్త మరణించాడు. ఆమెకు 19 ఏళ్ల సాయిరత్నం అనే కుమారుడు ఉన్నాడు. ఈ క్రమంలో అరుణకు ఏపీలోని అన్నమయ్య జిల్లాకు చెందిన శివారెడ్డి (40) అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి, అది సహజీవనానికి దారితీసింది. వీరు జీడిమెట్ల సమీపంలోని చింతల్ ప్రాంతంలో నివాసం ఉండేవారు. అయితే, శివారెడ్డి నిత్యం మద్యం తాగి అరుణను, ఆమె కుమారుడిని వేధిస్తుండేవాడు. ఈ వేధింపులు భరించలేక, ఎలాగైనా అతడిని వదిలించుకోవాలని తల్లీకొడుకులు నిర్ణయించుకున్నారు.
సాధారణంగా హత్య చేయడం కంటే, హత్య తర్వాత పోలీసులకు దొరకకుండా ఉండటమే కష్టమని భావించిన కుమారుడు సాయిరత్నం, యూట్యూబ్లో ‘క్రైమ్ వీడియోల’ను ఆశ్రయించాడు. ఒక వ్యక్తిని ఎలా హతమార్చాలి, రక్తం మరకలు దొరకకుండా ఎలా శుభ్రం చేయాలి, మృతదేహాన్ని ఎవరికీ తెలియకుండా ఎలా మాయం చేయాలి అనే విషయాలపై పలు వీడియోలు చూసి పక్కా స్కెచ్ వేశాడు.
పథకం ప్రకారం, హత్య చేయడానికి ముందే ఇంటి పక్కన ఉన్న ఒక మటన్ దుకాణం నుంచి పదునైన కత్తిని సేకరించాడు. ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో శివారెడ్డి మద్యం మత్తులో నిద్రపోతుండగా, సాయిరత్నం ఆ కత్తితో అతడి మెడపై బలంగా నరికి ప్రాణాలు తీశాడు.
హత్య జరిగిన తర్వాత రక్తం మరకలు ఉన్న దుస్తులను భీముని కాలువలో పడవేసి ఆధారాలు ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు. అనంతరం మృతదేహాన్ని ఒక ప్లాస్టిక్ డ్రమ్ములో పెట్టి, దానిని బయట ఎక్కడైనా పడవేయాలని ప్లాన్ చేశారు. ఒంటరిగా ఆ డ్రమ్మును తరలించడం కష్టం కావడంతో, సాయిరత్నం తన స్నేహితుడికి ఫోన్ చేసి సాయం కోరాడు. అయితే, అక్కడికి వచ్చిన స్నేహితుడు డ్రమ్ములో ఉన్న మృతదేహాన్ని చూసి హతాశుడై, వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు.
కుత్బుల్లాపూర్ జోన్ డీసీపీ కోటిరెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం, నిందితుడు సాయిరత్నం ఫోన్ను పరిశీలించగా అందులో భయంకరమైన విషయాలు వెలుగుచూశాయి. హత్య చేసిన తర్వాత నిందితుడు మృతదేహం వద్ద కత్తి పట్టుకుని ఫోటోలు, వీడియోలు తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితులపై హత్య కేసు నమోదు చేసి, లోతైన దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. నేరపూరితమైన కంటెంట్ యువతను ఎలా దారి తప్పిస్తుందో చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనమని అధికారులు పేర్కొంటున్నారు.
Hyderabad,Telangana
Hyderabad: మటన్ షాప్ నుంచి కత్తి.. యూట్యూబ్ నుంచి నేర పాఠాలు.. కిరాతకంగా ప్రియుడి హత్య.. డ్రమ్ములో మృతదేహం.. జీడిమెట్ల హత్యలో విస్తుపోయే నిజాలు!













