Last Updated:
Earthquake: అఫ్గానిస్తాన్లో శనివారం సాయంత్రం భూకంపం సంభవించింది. శనివారం సాయంత్రం 7:04 గంటల ప్రాంతంలో సంభవించిన ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.2గా నమోదైందని భూకంప శాస్త్రవేత్తలు వెల్లడించారు.
అఫ్గానిస్తాన్లో భూమి కంపించినప్పటికీ, దాని ప్రభావంతో భారతదేశంలోని రాజధాని ప్రాంతమైన ఢిల్లీ-NCR, జమ్మూ కాశ్మీర్తో పాటు ఉత్తర భారతదేశంలోని ఇతర ప్రాంతాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. బలమైన ప్రకంపనలు రావడంతో జనం భయంతో ఇళ్ల నుండి రోడ్లపైకి పరుగులు తీశారు.
భారత ప్రభుత్వానికి చెందిన నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) అందించిన వివరాల ప్రకారం.. అఫ్గానిస్తాన్లో భూగర్భంలో దాదాపు 215 కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం సంభవించింది. ఈ భూకంప కేంద్రం ఈశాన్య అఫ్గానిస్తాన్లోని ‘కలాఫ్గన్’ (Kalafgan) పట్టణానికి సుమారు 81 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. భూకంప కేంద్రం భూమికి చాలా లోతులో ఉండటం వల్లే దీని ప్రభావం వేలాది కిలోమీటర్ల మేర విస్తరించిందని నిపుణులు చెబుతున్నారు.
ఈ భూకంపం తాలూకు ప్రకంపనలు కేవలం అఫ్గానిస్తాన్కే పరిమితం కాకుండా ఏకంగా ఎనిమిది దేశాలలో విస్తరించాయి. పాకిస్థాన్, భారతదేశంతో పాటు చైనా, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, కిర్గిజిస్తాన్, తుర్క్మెనిస్తాన్ దేశాలలో కూడా భూమి కంపించినట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యంగా పాకిస్థాన్, అఫ్గానిస్తాన్ సరిహద్దు ప్రాంతాలలో భూమి తీవ్రంగా కంపించింది. ప్రస్తుతానికి ఈ భారీ భూకంపం కారణంగా ఎక్కడైనా ఆస్తి నష్టం లేదా ప్రాణ నష్టం సంభవించిందా అనే దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియరావాల్సి ఉంది.
బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana













