Last Updated:
సీషెల్స్ అధ్యక్షుడు పాట్రిక్ హెర్మినీ ఆహ్వానం మేరకు ఇరు దేశాల మధ్య దశాబ్దాల భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ పర్యటన సాగుతోంది.
PM Modi: తూర్పు ఆఫ్రికా ద్వీపదేశమైన సీషెల్స్లో పర్యటిస్తున్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆదివారం స్టేట్ హౌస్లో ఘనంగా గౌరవ వందనం సమర్పించారు. మూడు రోజుల అధికారిక పర్యటనలో భాగంగా ఆయన అక్కడికి చేరుకున్నారు. సీషెల్స్ అధ్యక్షుడు పాట్రిక్ హెర్మినీ ఆహ్వానం మేరకు ఇరు దేశాల మధ్య దశాబ్దాల భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ పర్యటన సాగుతోంది.
పర్యావరణ పరిరక్షణ, సుస్థిరాభివృద్ధి రంగాలలో ప్రధాని మోదీ చూపిన నాయకత్వ పటిమకు గుర్తింపుగా సీషెల్స్ ప్రభుత్వం తమ దేశ అత్యున్నత పురస్కారమైన ‘గార్డియన్ ఆఫ్ ది బ్లూ హారిజన్’ (Guardian Of The Blue Horizon) తో ఆయనను గౌరవించింది. ప్రధాని మోదీ గ్రీన్ విజన్కు, పర్యావరణ అనుకూల వృద్ధికి దక్కిన అంతర్జాతీయ గౌరవాలలో ఇది సరికొత్తది.
#WATCH | Victoria, Seychelles: Prime Minister Narendra Modi receives Guard of Honour at State House.
Seychelles President Dr Patrick Herminie also present.(Source: ANI/DD News) pic.twitter.com/oZoyEuHWk3
— ANI (@ANI) June 28, 2026
సుస్థిరాభివృద్ధి, క్లైమేట్ యాక్షన్ (వాతావరణ చర్యలు) రంగాలలో ప్రధానికి దక్కిన ఇతర అంతర్జాతీయ పురస్కారాలు:
మే 2026: ఆహార భద్రతను బలోపేతం చేయడం, సుస్థిర వ్యవసాయాన్ని ప్రోత్సహించినందుకు ఎఫ్ఏఓ (FAO) నుంచి ‘అగ్రికోలా మెడల్’ లభించింది.
2018: సుస్థిర ఆర్థిక వృద్ధి, ప్రపంచ సహకారానికి గానూ ‘సియోల్ శాంతి బహుమతి’ దక్కింది.
2018: ఐక్యరాజ్యసమితి (UN) అత్యున్నత పర్యావరణ పురస్కారం ‘ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్’ లభించింది.
జూన్ 27 నుండి 29 వరకు సాగే ఈ పర్యటనలో భాగంగా, సోమవారం జరగనున్న సీషెల్స్ గోల్డెన్ జూబ్లీ జాతీయ దినోత్సవ వేడుకల్లో ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా పాల్గొంటారు. 1976లో యునైటెడ్ కింగ్డమ్ (UK) నుండి సీషెల్స్ స్వాతంత్ర్యం పొంది 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు.
శనివారం మధ్యాహ్నం సీషెల్స్ రాజధాని విక్టోరియా చేరుకున్న ప్రధానికి విమానాశ్రయంలో అధ్యక్షుడు హెర్మినీతో పాటు సీనియర్ మంత్రులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా గుజరాత్లోని కచ్ ప్రాంతానికి చెందిన సంప్రదాయ నృత్యాలతో సహా పలు సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. పర్యటన మొదటి రోజు ప్రధాని మోదీ, అధ్యక్షుడు హెర్మినీతో కలిసి సీషెల్స్ నేషనల్ బొటానికల్ గార్డెన్ను సందర్శించారు.
సీషెల్స్ సముద్ర నిఘా, ప్రత్యేక ఆర్థిక మండలి (EEZ) పెట్రోలింగ్ సామర్థ్యాలను పెంచేందుకు భారత్ కీలక సాయం అందించింది. ‘మేడ్ ఇన్ ఇండియా’ కింద గోవా షిప్యార్డ్ లిమిటెడ్ తయారు చేసిన ఫాస్ట్ పెట్రోల్ వెసెల్ (FPV) ‘పీఎస్ లెస్ప్వార్’ (PS LESPWAR) తో పాటు 6 అంబులెన్సులు, 10 యుటిలిటీ వాహనాలు, 5 లేజర్ రేడియల్ బోట్లను ప్రధాని మోదీ సీషెల్స్ ప్రభుత్వానికి అందజేశారు. విక్టోరియాలోని సీషెల్స్ కోస్ట్ గార్డ్ బేస్లో జరిగిన ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు హెర్మినీ కూడా పాల్గొన్నారు.
“భాగస్వాములుగా కలిసికట్టుగా.. మరింత బలంగా..” అంటూ భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) ఈ పరిణామాన్ని ‘X’ (ట్విట్టర్) వేదికగా పంచుకుంది. పీఎస్ లెస్ప్వార్ నౌక సీషెల్స్ దేశ సముద్ర రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేస్తుందని పేర్కొంది.
బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana













