Last Updated:
Ahmedabad Serial Blasts Case: అసలు ఈ కేసేంటి? అహ్మదాబాద్లో ఏం జరిగింది? ఉరిశిక్ష పడిన దోషులకు.. మళ్లీ హైకోర్టు తీర్పు ఇవ్వాల్సిన అవసరం ఎందుకొచ్చింది? తెలుసుకుందాం.
అహ్మదాబాద్ వరుస బాంబు పేలుళ్ల కేసుకు సంబంధించి మరణశిక్ష పడిన దోషులపై గుజరాత్ హైకోర్టు నేడు (జులై 7) తన చారిత్రక, తుది తీర్పును వెలువరించింది. భారతదేశ చరిత్రలోనే అత్యంత సంచలనం సృష్టించిన ఈ ఉగ్రవాద దాడి కేసులో కింది కోర్టు (స్పెషల్ కోర్టు) ఇచ్చిన మరణశిక్ష తీర్పును హైకోర్టు ధర్మాసనం సమర్థించింది. మొత్తం 38 మంది దోషులకు ఉరిశిక్ష, మరో 11 మందికి యావజ్జీవ కారాగార శిక్షను ఖరారు చేస్తూ తీర్పు ఇచ్చింది. కింది కోర్టు తీర్పును హైకోర్టు సమర్థించింది.
సరిగ్గా 18 సంవత్సరాల కిందట, అనగా జూలై 26న గుజరాత్ రాష్ట్రంలోని ప్రముఖ నగరమైన అహ్మదాబాద్లో కేవలం 70 నిమిషాల స్వల్ప వ్యవధిలోనే ఏకంగా 21 ప్రాంతాల్లో వరుసగా బాంబు పేలుళ్లు సంభవించి నగరాన్ని రక్తసిక్తం చేశాయి. ఆసుపత్రులు, రద్దీగా ఉండే మార్కెట్లు, బస్సులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు ఈ దారుణానికి ఒడిగట్టారు. ఈ అమానవీయ ఘటనలో 56 మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోగా, మరో 200 మందికి పైగా తీవ్ర గాయాలపాలై దివ్యాంగులుగా మారారు. ఈ కేసును లోతుగా విచారించిన అహ్మదాబాద్ ప్రత్యేక న్యాయస్థానం (స్పెషల్ కోర్టు) దాదాపు 14 సుదీర్ఘ విచారణ తర్వాత, ఫిబ్రవరి నెలలో కీలక తీర్పును ఇచ్చింది. మొత్తం 78 మంది నిందితులను విచారించగా అందులో 49 మందిని దోషులుగా నిర్ధారించిన ప్రత్యేక న్యాయమూర్తి ఏ.ఆర్. పటేల్, వారిలో 38 మందికి మరణశిక్ష (ఉరిశిక్ష), మరో 11 మందికి జీవితకాల (యావజ్జీవ) కారాగార శిక్ష విధించారు. ఒకే కేసులో ఏకంగా ఇంత మందికి ఉరిశిక్ష విధించడం దేశ చరిత్రలోనే ఇదే ప్రథమం అని లాబీట్ తెలిపింది.
భారతీయ న్యాయ వ్యవస్థ నియమాల ప్రకారం, కింది కోర్టు లేదా సెషన్స్ కోర్టు విధించిన మరణశిక్షను నేరుగా అమలు చేయడానికి వీలులేదు. ఆ శిక్షను సంబంధిత రాష్ట్ర హైకోర్టు ధృవీకరించాల్సి (కన్ఫర్మేషన్) ఉంటుంది. ఈ చట్టపరమైన నిబంధనల కారణంగా, దోషులకు పడిన ఉరిశిక్షను ఆమోదించాలని.. రాష్ట్ర ప్రభుత్వం.. గుజరాత్ హైకోర్టును ఆశ్రయించింది. దీనికి తోడు, తమకు విధించిన మరణశిక్ష, యావజ్జీవ శిక్షలను సవాలు చేస్తూ మొత్తం 49 మంది దోషులు కూడా హైకోర్టులో అప్పీలు చేసుకున్నారు. వేల పేజీల మేర ఉన్న స్పెషల్ కోర్టు తీర్పును పరిశీలించేందుకు.. జస్టిస్ అల్పేష్ కొగ్జే, జస్టిస్ సమీర్ దవేలతో కూడిన గుజరాత్ హైకోర్టు ప్రత్యేక ధర్మాసనం ఏర్పాటైంది. గత రెండున్నరేళ్లుగా ఈ ధర్మాసనం దాదాపు 248 సార్లు నిరంతరంగా విచారణ చేపట్టిందని ANI న్యూస్ రిపోర్ట్ చేసింది.
ఈ సుదీర్ఘమైన కేసులో ఇండియన్ ముజాహిదీన్, సిమి వంటి నిషేధిత ఉగ్రవాద సంస్థలకు చెందిన సఫ్దర్ నాగోరి, ఇతర రాష్ట్రాలకు చెందిన కొంతమంది కీలక దోషులుగా ఉన్నారు. వీరందరిపైనా చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (UAPA), పేలుడు పదార్థాల చట్టం, ప్రజా ఆస్తుల విధ్వంస చట్టం, దేశద్రోహం లాంటి అత్యంత కఠినమైన సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.
ఈ కేసు విచారణలో భాగంగా ఏకంగా వెయ్యి మందికి పైగా సాక్షులను న్యాయస్థానం ప్రశ్నించింది. రెండు పక్షాల వాదనలు పూర్తిగా ముగిసిన కారణంగా జూలై 7వ తేదీ ఉదయం 11 గంటలకు హైకోర్టు తన తీర్పును అధికారికంగా ప్రకటించింది. బాధితుల కుటుంబాలు న్యాయం కోసం నిరీక్షిస్తున్న వేళ, గుజరాత్ హైకోర్టు తీర్పు ఈ కేసులో అత్యంత కీలకంగా మారింది. ఈ తీర్పు బాధితులకు ఊరట కలిగించింది.
బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana













