Last Updated:
ఓటీటీ ప్లాట్ఫామ్లో ఎంతో సైలెంట్గా విడుదలై, కేవలం 48 గంటల్లోనే మాయమైంది ‘సట్లజ్’ మూవీ. మరి ఎందుకిలా చేశారు? అసలు వివాదం ఏంటి? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.
ఓటీటీ ప్లాట్ఫామ్లో ఎంతో సైలెంట్గా విడుదలై, కేవలం 48 గంటల్లోనే ఓ సినిమాను తొలగించడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అదే ప్రముఖ పంజాబీ సింగర్, యాక్టర్ దిల్ జిత్ దోసాంజ్ ప్రధాన పాత్రలో నటించిన హిందీ చిత్రం ‘సట్లజ్’ (Sutlej). హనీ ట్రెహాన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా జీ5 (Zee5) వేదికగా విడుదలై, రెండు రోజులకే అదృశ్యమవ్వడం వెనుక పెద్ద హైడ్రామానే నడుస్తోంది.
ఈ సినిమా వివాదాల్లో చిక్కుకోవడం ఇదే తొలిసారి కాదు. దీనికి ముందుగా ‘ఘల్లుఘర’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఆ తర్వాత దాన్ని ‘పంజాబ్ 95’ (Punjab 95)గా మార్చారు. చివరకు విడుదలకు ముందు ‘సట్లజ్’ అనే పేరును ఖరారు చేశారు. 2022లోనే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెన్సార్ బోర్డు (CBFC) వద్ద తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. సినిమా చూసిన సెన్సార్ సభ్యులు ఏకంగా 120 కట్స్ సూచించారు లేదా సినిమాను మళ్లీ రీషూట్ చేయాలని తేల్చి చెప్పారు. వాస్తవిక సంఘటనల ఆధారంగా, డాక్యుమెంటరీ శైలిలో తెరకెక్కిన ఈ సినిమా కోసం నిర్మాతలు (ఆర్.ఎస్.వి.పి. మూవీస్, మెక్ గఫిన్ పిక్చర్స్, స్కై వాక్ ఫిలిమ్స్) దాదాపు మూడేళ్ల పాటు సెన్సార్పై న్యాయ పోరాటం చేశారు.
థియేట్రికల్ రిలీజ్ వర్కవుట్ కాదని భావించిన మేకర్స్, నేరుగా జూలై 3వ తేదీన జీ5 ఓటీటీలో ‘సట్లజ్’ను విడుదల చేశారు. దిల్ జిత్ దోసాంజ్, అర్జున్ రామ్ పాల్, గీతికా విద్యా ఓహ్లియాన్, కన్వల్ జీత్ సింగ్ తదితరులు నటించిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొంది. కానీ అనూహ్యంగా జూలై 5 నాటికి ప్లాట్ఫామ్ నుంచి సినిమాను తొలగించారు. సబ్స్క్రైబర్ల ఆందోళనతో స్పందించిన జీ5 సంస్థ.. “కొన్ని కరెంట్ డెవలప్మెంట్స్ (తాజా పరిణామాలు) కారణంగా సినిమాను నిలిపివేశాం. భారతీయ ప్రేక్షకులకు తగిన సరైన టైటిల్తో త్వరలోనే ఈ చిత్రాన్ని మళ్లీ తీసుకొస్తాం” అని ఒక ప్రకటన విడుదల చేసింది.
అయితే ఇక్కడ గమనించాల్సిన ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. భారతదేశంలో స్ట్రీమింగ్ ఆగిపోయిన ఈ చిత్రం, అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా వంటి విదేశాల్లోని జీ5 ప్లాట్ఫామ్లో యథేచ్ఛగా స్ట్రీమింగ్ అవుతోంది. మన దేశానికి చెందిన కథ, మన దేశంలోనే ప్రదర్శితం కాకపోవడం పట్ల సినీ అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఈ సినిమా పంజాబ్లో జరిగిన కొన్ని వాస్తవిక, సున్నితమైన సంఘటనల ఆధారంగా (ముఖ్యంగా మానవ హక్కుల నేత జస్వంత్ సింగ్ ఖాల్రా జీవితం ఆధారంగా) తెరకెక్కినట్లు సమాచారం. అందులోని కొన్ని అంశాలు మన దేశంలోని ఒక వర్గానికి లేదా ప్రభుత్వ వ్యవస్థలకు నచ్చని విధంగా ఉండటం వల్లే ఇక్కడ స్ట్రీమింగ్ ఆపేశారనేది ఒక బహిరంగ రహస్యం.
మరోవైపు ఇదంతా మేకర్స్ ఆడుతున్న ‘మార్కెటింగ్ మైండ్ గేమ్’ అని కూడా కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ సినిమాకు థియేట్రికల్ క్రేజ్ లేదు, సరైన ప్రమోషన్స్ కూడా చేయలేదు. ఇలా అర్ధాంతరంగా ఆపేయడం ద్వారా జాతీయ స్థాయిలో సినిమాపై ఒక క్యూరియాసిటీ పెరుగుతుందని, వివాదాల కారణంగా ఫ్రీ పబ్లిసిటీ వస్తుందని, ఆ తర్వాత స్ట్రీమింగ్ చేస్తే భారీ వ్యూస్ వస్తాయనేది వారి వ్యూహంగా కనిపిస్తోందని టాక్. కారణం ఏదైనా.. మూడేళ్ల పోరాటం తర్వాత కూడా ‘సట్లజ్’కు స్వదేశంలో ఈ గతి పట్టడం సినీ స్వేచ్ఛపై పలు ప్రశ్నలు లేవనెత్తుతోంది.
సినిమా న్యూస్, మూవీ అప్డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్డేట్స్, టీవీ షోస్, రియాల్టీ షోస్, వెబ్స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్టైన్మెంట్ అప్డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Hyderabad,Telangana
Jul 07, 2026 12:56 PM IST













